కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
తిరుమల తిరుపతి స్వామివారి ద్వజస్తంభ రహస్యం secret of Tirumala Tirupati Dwajastambha
*తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ మీకు తెలుసా...?*
🙏🏻🙏🏻🌷🙏🏻🙏🏻
*కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!*
*డ్రైవర్ రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.*
*వందల కంఠాలు "గోవిందా! గోవిందా!" అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ చేరుకుంది*
*డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.* *కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి... చుట్టూ చూశాడు. వేలాది యువతులు*
*హారతులిచ్చి, గోవిందా.. గోవిందా.. అంటూ తన్మయులైనారు*
*అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డి గారికి, ఎక్జిక్యూటివ్* *ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి*
*నమస్కరించి "ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు, ఏడు ఎనిమిది* *క్లిష్ఠమైన మలుపులున్నాయి.*
*ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ* *ట్రక్కును ఆపకుండా కొండ*
*మీదకు తీసుకుపోతాను.* *మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు,అంచులు తగిలి* *బండరాళ్లు దొర్లిపడవచ్చు, మీరు హామీ ఇస్తే పైకి చేర్చి*
*తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో పైకి చేర్చే బాధ్యత* *నీది. మిగిలిన బాధ్యతలు మావి*
*అని అభయం ఇచ్చారు*
*వాహనాల రాకపోకలను, పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు బయలుదేరింది.వెనుకే* *వాహనాల్లో అందరూ*
*బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే*
*మానులు తగిలి, బండలు* *ఊడిపడ్డాయి. పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో* *పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది.* *ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ* *సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..*
*సూర్యాస్తమయం లోగా*
*ట్రాలీ తిరుమల చేరిపోయింది"*
*వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో*
*గోవిందా..గోవిందా..*
*నామస్మణతో తిరుమల కొండ* *ప్రతిధ్వనించింది!*
*☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం దండేలీ అడవుల్లోపుట్టి* *300 ఏళ్ల వయసున్న*
*ఈ 6 టేకుమానులు స్వామి* *వద్దకు క్షేమంగా చేరుకున్నాయి*
*🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?*
*నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.*
*తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్థంభానికి బంగారు*
*తాపడానికి పాలిష్ చేయడం.*
*నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన ఐ.ఏ.ఎస్ అధికారి* *పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు*
*ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు. ఈ పనులన్నీ ప్రసాద్* *గారు చిత్తశుద్ధితో చేసేవారు!*
*అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య! ఇలా* *ధ్వజస్తంభం చుట్టూ* *వున్న నాలుగు వరుసల*
*గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే* *సమయంలో అసలు విషయం బయటపడింది*. *ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే*
*ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో*
*ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు? మరి ఏ* *ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉంది? కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది. రేపో మాపో అది* *కూలిపోవచ్చు!*
*మరి ఇప్పుడేం చేయాలి? ఏం* *చేయాలి?వేరే వారైతే దాన్ని* *తాత్కాలికంగా ఏదో*
*చేసేయ్యండి. 75 అడుగుల* *టేకుమానులు బజారులో* *దొరకవు అని సర్దుబాటు* *చేసేవారు! కానీ ఇక్కడ* *ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే* *ప్రసాద్! స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.*
*స్వామివారికి, ఆయన* *భక్తులకు ఏ చిన్న లోపం*
*జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు*
*అందుకే "ధ్వజస్తంభాన్ని* *పునర్మిద్దాం"*
*అని ప్రకటించారు......*
*ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!*
*🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.!*
*ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,*
*కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న ఒకే మాను* *కావాలి. వందేళ్లకు పైగా మన్నిక*
*కల్గిన టేకు చెట్టు అయివుండాలి*
*ఎక్కడ? ఎక్కడ?*
*ఈ లక్షణాలున్న చెట్లు* *దొరుకుతాయి?*
*పాత మాను గురించి* *తెలుసుకుంటే దొరుకుతుంది అని 190 సంవత్సరాల*
*రికార్డులన్నీ పరిశీలిస్తే..*
*ఎక్కడా ఈ ధ్వజస్తంభం* *ప్రస్తావన లేదు. మరో వేపు* *నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి నియామకాల గడువు* *పూర్తి కానున్న తరుణం.*
*ఈ కొద్ది రోజుల్లో మనం*
*ఇది చేయగలమా????ప్రశ్నలు???*
🍀 *ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన*
*ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు*
*ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు* *రేడియోలో విన్నాను. అటువంటి మానులు కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి.*
*మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను! వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను* *పరిశీలించి, అందులో నిర్ణీత ప్రమాణాలకు* *అనుకూలంగా*
*ఆరు చెట్లను ఎంపిక* *చేశారు.అదే వారంలో*
*కర్ణాటక ముఖ్యమంత్రి* *గుండూరావు గారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆయన* *ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.* *ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.* *ధ్వజస్థంభానికి ఒక్కమాను* *సరిపోతుంది. అయినా*
*ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ* *తీసుకున్నారు.* *సమస్య అక్కడితో అయిపోలేదు*
*దట్టమైన అడవిలో, కొండ* *వాలులో ఉన్న వీటిని*
*మొదటికంటా తీయించి 8* *కిలోమీటర్ల కిందికి తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు* *నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..* *సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని..దుంగల్ని క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ* *చేర్చారు"*
*ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు*
*లేకుండా తిరుమల చేరుకుంది!*
*1982 జూన్ 10వ తేదీన*
*ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!*
*🍁ఉత్సవం చివరన నాగిరెడ్డి గారు ట్రైలర్ యజమానికి 70 వేల రూపాయల చెక్కును* *అందించారు! యజమాని..*
*"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!"*
*అని దానిని తిరస్కరించారు!*
*డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.*
*స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్,*
*ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను*
*సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!అది విప్పి* *చూసిన వెంకట్రామయ్య కళ్ళలో కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు* *చూస్తున్న తన ప్రమోషన్* *ఆర్డర్ అది! ఇలా..స్వామివారి*
*సన్నిధిలో.. ఎందరికి* *ప్రాప్తం?..అనుకుంటూ..*
*ఆయన రెండు చేతులూ జోడించి ఆనందడోలికల్లో మునిగిపోయారు!*
*🙏🏽💐ఓం నమో వెంకటేశాయ*
సేకరణ సుధా శశికుమారిమాచవరం
వినాయక చవితి పూజ ఆడియో ...ఈ లింక్ ద్వారా వింటూ పూజ చేసుకోవచ్చు
🔽 *గణపతి పూజకు పంతులుగారు పక్కన ఉండి చెబుతున్నారు అని భావిస్తూ - ఈ ఆడియో వింటూ పూజ చేసుకోవచ్చు*
విష్వక్సేనులవారు ఎవరు?........story about visvaksena
జై శ్రీరామ్.....!
ఎవరైతే విష్ణు సైన్యాదిపతియైన విష్వక్సేనుని ఆశ్రయిస్తారో, ఆయన ఎల్లప్పుడూ మరొక వంద అడ్డంకులనైనా తొలగిస్తాడు. విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. విఘ్నేశ్వరుడు శివ గణాలకు అధిపతి. ఇద్దరూ విఘ్నాదిపతులే. కాకపొతే విఘ్నేశ్వరుడు ఏక దంతుడు, విష్వక్సేనుడి దగ్గర గజ ముఖులు ఎంతో మందికి ఈయన అధిపతి. వైష్ణవ ఆలయాలలో విష్వవక్సేనుడిని పూజిస్తారు.శైవ ఆలయాలలో విగ్గనేశ్వరుని పూజిస్తారు. వైష్ణవ ఆలయాలలో పారాయణం చేసే 'విష్ణు సహస్రనామ స్తోత్రం' లో మొదటి శ్లోకం అయిన "శుక్లాంబరధరం" తరువాత రెండవ శ్లోకంగా "యస్య ద్విరద వక్త్ర్యాద్యః" అనే ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు. నిత్యం శ్రీమన్నారాయణుని సేవలో... పూర్వం ఒకానొక భక్తుడు తన పుణ్యఫలం వలన వైకుంఠానికి చేరుకుని, ద్వారపాలకులైన జయ, విజయులను చూసి, నిత్యం స్వామి సేవలో ఉంటున్న వారి భాగ్యాన్ని చూసి పొగిడాడు. ద్వారపాలకులు తమ అదృష్టాన్ని ఒప్పుకున్నప్పటికీ, తమపై పెట్టబడిన బాధ్యత రీత్యా ఎప్పుడూ ద్వారం దగ్గరే ఉండిపోవాల్సి వస్తోందని, ఇంత వరకు వైకుంఠంలోకి వెళ్ళింది లేదనీ, అసలు వైకుంఠం లోపల ఎలా ఉంటుందో తమకు తెలియదని, అదే సమయంలో వైకుంఠంలోకి ఇలా వెళ్ళి, అలా వస్తుండే నారదుడు వంటి మునీశ్వరులే తమకంటే చాలా అదృష్టవంతులని అన్నారు
అనంతరం యాదృచ్ఛికంగా నారదుని చూసిన భక్తుడు, ఆయనతో ద్వారపాలకులు చెప్పిన విషయాలను ప్రస్తావించాడు. అతని మాటలతను విని సంతోషపడిన నారదుడు తాను వైంకుఠంలోకి వెళ్ళగలిగినప్పటికీ, ఎటువంటి అడ్డంకులు లేకుండా వైకుంఠంలో సంచరించగలిగేది విష్వక్సేనుడనని, అంతటి అదృష్టం తనకు దక్కలేదని చెబుతాడు. ఆ మరుక్షణమే భక్తుడు, విష్వక్సేనుని ముందుకెళ్ళి ఆయన అదృష్టాన్ని పొగడుతాడు. అది విన్న విష్వక్సేనుడు, తన కంటే గరుత్మంతునిదే అదృష్టమని అనగా, ఆ గరుత్మంతుడు, తనకంటే స్వామి పాదాలను ఒత్తుతూ, తరిస్తోన్న లక్ష్మీదేవిదే అదృష్టమని అంటారు. మరి, ఆ లక్ష్మీదేవేమో, తనకంటే ఆదిశేషుడు గొప్ప అదృష్టవంతుడని చెబు తుంది. స్వామికి ఆదిశేషుడు చేస్తున్నంత సేవను తాను చేయలేకపోతున్నానని అంటుంది. భక్తుడు ఆదిశేషుని ముందు నిలబడి ఆయన అదృష్టాన్ని కీర్తించాడు. అది విన్న ఆదిశేషుడు, ‘మా అందరికంటే నువ్వే అదృష్టవంతుడివి. మేమందరం ఆయన కోసం పరుగులు పెడుతోంటే, ఆ పరంధాముడు మీ వంటి భక్తుల కోసం పరుగులు పెడుతు న్నాడు. అదృష్టమంటే మీదేగా!’ అని అన్నాడు.
అ(సలు విశ్వక్సేనులు ఎవరు?ఒకసారి రాక్షసులు పెట్టే బాధలను ఓర్చుకోలేకపోయిన దేవతలు, వైకుంఠానికి వచ్చి, తమను రాక్షసుల బారి నుండి కాపాడవలసిందంటూ శ్రీమన్నారాయ ణుని ప్రార్తించారు. అప్పుడు విష్ణుమూర్తి చంద్ర అనే వానిని పిలిచి, రాక్షసుల పని పట్ట మని చెప్పాడు. స్వామి వారి ఆజ్ఞతో ఆ రాక్షసులను తరిమి తరిమి కొట్టిన చంద్ర యొక్క శౌర్యప్రతాపాలను మెచ్చుకున్న నారాయణుడు, అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆయనే విష్వక్సేనుడు. శ్రీవైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణు రూపమే విష్వక్సేనుడని అంటారు. ఆయన సర్వమంగళనాయకుడు. విఘ్ననివారకుడు. ఎవరైతే విష్వక్సేనుని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని పాంచరాత్ర ఆగమం వైఖానస ఆగమం చెబుతోంది.మేఘశ్యాముడు, సుమణిమకుటధారి అయిన విష్వక్సేనునికి సూత్రవతీ, జయ అనేవారు భార్యలు. విష్వక్సేనుడు సమస్త దేవతాగణానికి అధిపతి. శ్రీమన్నారాయణునికి సేనాపతి. ‘విశ్వ’ అంటే ఈ సకలలోకాలను, ‘సేనుడు’ అంటే నడిపించేవాడని అర్థం. ఈ సృష్టిలో ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలకు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే పధ్నాలుగు భువన ఖండాలకు అధిపతి. శైవాగమం గణపతిని ప్రతిశుభకార్యంలో ముందుగా పూజించి, అగ్రతాంబూలాన్ని సమర్పించినట్లు, శ్రీ పాంచరాత్రాగమం వైఖానసాగమం విష్వక్సేనుని ప్రతి కార్యక్రమంలోను పూజిస్తారు. శైవాగమం గణపతిని పసుపు ముద్దగా చేసి పూజిస్తే, శ్రీవైష్ణవాగమాలు విష్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినపుడు అది సంకల్పబలం చేతనే విజయవంతం అవుతుంది
బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీకే సూత్రావతీ దేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించే మాత జయదేవి. వినాయకునికి సిద్ధి, బుద్ధి భార్యలు. అంటే, బుద్ధి కలిగినపుడే కార్యక్రమం తలపెడతాము. సంకల్పం తీసుకుంటాం. ఎవరికైతే, స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుందని శైవాగమం చెబుతుంది. శ్రీవైష్ణవ ఆగమాలు కూడ చెబుతున్నది అదే. శ్రీ పాంచరాత్ర ఆగమం శ్రీ వైఖానస ఆగమం ప్రకారంగా నిత్యకైంకర్యాలు నిర్వహించే శ్రీ వైష్ణవ ఆలయంలో స్వామికి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలలో విష్వక్సేనులవారు ప్రధాన పాత్ర వహిస్తారు. శ్రీవేష్ణవ ఆగమాలు విష్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి.
విష్వక్సేనుల వారు నాలుగు భుజాలతో గోచరిస్తూ, శంఖ, చక్ర, గదలను ధరించి నాలుగువేళ్ళను మడిచి, చూపుడు వేలును పైకి చూపిస్తోన్న ముద్రతో దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రతిమలలో గదకు బదులుగా దండాయుధం కనబడుతుంటుంది. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సమస్త దోషాలను హరించి, భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.యస్య ద్విరద వక్త్రాద్యాఃపారిషద్యాః పరశ్శతమ్విఘ్నం నిఘ్నంతి సతతంవిష్వక్సేనం తమాశ్రయే అని ఆ స్వామిని ధ్యానిస్తూ ధన్యులమవుదాము. ఆ స్వామి సేవలో తరించిపోదాము .......రంగాచార్యుల వారు చెప్పిన విధముగా..........
నీలమతపురాణం. ....6,to12 parts by k మురళీకృష్ణ
[8/10, 7:59 PM] Murali: _*నీలమత పురాణం – 6*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*సముద్యుక్తై ర్యథా పూర్వం సముద్భుతా మహీస్థితిః।*
*తత్ర దక్షో దదౌ కన్యాః కశ్యపాయ త్రయోదశ॥* (69)
వైవస్వత మన్వంతరం ఆరంభమవుతుండగా దక్షడు తన పదముగ్గురు పుత్రికలను కశ్యపుడికిచ్చి వివాహం చేశాడు.
నీలమత పురాణాన్ని పురాణంగా పలువురు పరిగణించకపోవడానికి కారణం , పురాణంగా వర్గీకరణకు గురికావాలంటే సర్గ , ప్రతిసర్గ , వంశ , మన్వంతర , వంశానుచరిత అన్న అయిదు లక్షణాలు ఉండాలి. నీలమత పురాణంలో సృష్టి గురించి ఉంది. మొత్తం విశ్వం నీటిలో మునిగి ఉండడం , మనువు జీవులను కాపాడడం ఉంది. ఆ తరువాత తిన్నగా వైవస్వత మన్వంతర ఆరంభం , దక్ష ప్రజాపతి పుత్రికలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేయడంతో కథ ముందుకు సాగుతుంది. అంటే సృష్ట్యారంభం , జీవుల ఉత్పత్తి వంటి వివరాలు లేకుండా తిన్నగా *‘వైవస్వత మన్వంతరంలో దక్ష ప్రజాపతి’* అంటూ కొనసాగడంతో , ఈ దక్ష ప్రజాపతి ఎవరు ? అతనికి పదముగ్గురు కూతుర్లు ఎలా కలిగారు ? కశ్యపుడు ఎవరు ? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అంటే , నీలమత పురాణం చలామణీలోకి వచ్చేనాటికి ఇందులో వివరించని అంశాలు అనేకం ప్రజలలో ప్రచారంలో ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి నీలమత పురాణం దృష్టి ప్రధానంగా *‘నీలుడు’* చెప్పిన అంశాలపైనే ఉండడంతో అందరికీ తెలిసిన విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకని అనుకొని ఉండవచ్చు. ఇదెలాగంటే , ఒక రచన చేసే సమయంలో రచయిత తన రచనలోని ప్రధానాంశం మీద నుండి దృష్టి మళ్ళకుండా ఉండేందుకు , ఇతర విషయాలు.. అవి ప్రధానమైనా , అందరికీ తెలుసని వదిలేస్తాడు. అదీగాక నీలమత పురాణం కశ్మీరుకు ప్రత్యేకమైన స్థానిక పురాణం , ఇతర ప్రాంతాలకు అంతగా వర్తించదు. కాబట్టి , విశ్వ సృష్టి ఆవిర్భావం , జీవుల ఆవిర్భావం వంటి విషయాలన్నీ చెప్పే బదులు (ఇతర జాతీయ పురాణాలలో ఉన్నాయి కాబట్టి) తిన్నగా ప్రళయం, ప్రజాపతి దగ్గరకు వచ్చేసింది *‘నీలమత పురాణం’*. ఎందుకంటే నీలుడు ప్రవచించిన విషయాలు కశ్మీరుకే ప్రత్యేకం కాబట్టి తిన్నగా అసలు విషయానికి వచ్చేసింది.
పురాణాలలో గమనిస్తే *‘దక్షుడు’* ఒకడే అయినా అతని కథ రెండు భిన్న దశలలో కనిపిస్తుంది. ఒక కథలో *‘దక్షయజ్ఞం’* సమయంలో దక్షుడు శివుడి ఆగ్రహానికి గురయి మరణిస్తాడు. అప్పుడు దేవతలు గొర్రె తలను అతికించి దక్షుడిని బ్రతికిస్తారు. ఆ తరువాత దక్షుడు ఏమయ్యాడనేది ఏ పురాణం ప్రస్తావించదు. దేవీ పురాణంలో దక్షుడి తలను తెంపేందుకు భద్రకాళి వస్తుంది. పని పూర్తి చేస్తుంది. దక్షుడి జీవితంలో పురాణాలు ప్రస్తావించిన మరొక కథ సృష్టి ఆరంభం నుంచి ఉంటుంది.
బ్రహ్మ మానస పుత్రులుగా మరీచి , అంగీరస , అత్రి , పౌలస్త్యుడు , వశిష్ఠుడు , పుహాహ , క్రతులను సృష్టించాడు. బ్రహ్మ ఆగ్రహం నుంచి రుద్రుడు రూపు దిద్దుకున్నాడు. అతని తొడ నుండి నారదుడు ఉద్భవించాడు. కుడి బొటనవేలి నుంచి దక్షుడు జన్మించాడు. బ్రహ్మ మెదడు నుంచి శౌనకుడు , ఎడమ బొటనవేలి నుంచి వీరణి అనే కూతురు జన్మించారు. వింధ్య పర్వతాలలో దక్షుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఫలితంగా మహావిష్ణు అతనికి దర్శనమిచ్చాడు. *‘అశిక్ని’* ని అతనిని భార్యగా ఇచ్చాడు.
కాళికా పురాణంలో *‘వీరణీ నామ తస్యస్తు అశిక్నిత్యాపి సత్తమా’* అని ఉండడంతో అశిక్ని , వీరణిలు ఒకే వ్యక్తి రెండు పేర్లుగా భావించే వీలు చిక్కుతోంది. అశిక్ని వల్ల దక్షుడికి సంతానం కలిగింది. వారిలో సతిని శివుడు వివాహం చేసుకున్నాడు. దక్షయజ్ఞం జరిగింది.
అయితే దక్షుడి జననం గురించి పురాణాలలో మరో కథ ఉంది. ‘బర్హి’ పదిమంది కుమారులను ప్రాచేతసులంటారు. వీరు దీర్ఘకాలం తపస్సు చేశారు. వారు తపస్సు ముగించుకుని వచ్చేసరికి , భూమిపై వృక్షాలు విపరీతంగా పెరిగి భూమి అడవిలా తయారయింది. అది చూసి ఆ పది మంది ఆగ్రహంతో అడవులను దగ్ధం చేయడం ఆరంభించారు. అప్పుడు ఔషధీ దేవత అయిన చంద్రుడు (సోమదేవుడు) అడవులను సంపూర్ణంగా దగ్ధం చేయవద్దని వారించాడు. చెట్లతో వారికి సంధి చేశాడు. ఒప్పందం చేశాడు. ఫలితంగా సర్వవృక్షాల సారంగా జన్మించిన మారిశను వారికి భార్యగా అందించాడు. తన తెలివిలో అర్ధభాగం , ప్రాచేతసుల తెలివిలో అర్ధభాగం గ్రహించి అత్యంత తెలివిగల దక్షుడు వారికి జన్మిస్తాడని వాగ్దానం చేస్తాడు. ఫలితంగా వారికి దక్షుడు జన్మించాడు.
అలాంటి దక్షుడిని పిలిచి బ్రహ్మ ప్రజలను సృజించమన్నాడు. ఫలితంగా , దక్షుడు దేవతలను , మునులను , ఋషులను , గంధర్వులను , అసురులను , నాగులను సృష్టించాడు. వీరి పునరుత్పత్తి కోసం స్త్రీ పురుషు జీవుల నడుమ లైంగిక చర్యను ప్రవేశపెట్టాడు. అశిక్ని ద్వారా అయిదువేలమంది సంతానాన్ని కన్నాడు. వారు మళ్ళీ పునరుత్పత్తి జరిపే సమయానికి నారదుడు అడ్డుపడి వాళ్ళని భూమి అంచులను దర్శించి రమ్మన్నాడు. అలా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. వారిని హర్యశ్వులంటారు. దాంతో దక్షుడు మళ్ళీ వెయ్యి మంది సంతానాన్ని సృష్టించాడు. వీళ్ళని శబలాశ్వులంటారు. వీరినీ నారదుడు ప్రపంచం నలుమూలలా విస్తరింపజేశాడు. దాంతో దక్షుడికి కోపం వచ్చి నారదుడిని దేశద్రిమ్మరి కమ్మని శపించాడు. అప్పుడు దక్షుడు అరవైమంది పుత్రికలను కన్నాడు. వారిలో పదిమందిని ధర్మదేవుడికి , 13 మందిని కశ్యపుడికి , 27 మందిని సోముడికి , నలుగురిని అరిష్టనేమికి , ఇద్దరిని బహుపుత్రునికి , ఇద్దరిని అంగిరసుడికి , ఇద్దరిని కృశాశ్వునికి ఇచ్చి వివాహం చేశాడు.
పురాణాలలో దక్ష ప్రజాపతి 60మంది పుత్రికల పేర్లు కూడా ఉన్నాయి.
*కశ్యపుడి భార్యలు:* అదితి , దితి , దను , అరిష్ట , కద్రువ , సురస , ఖస , సురభి , వినత , తామ్ర , క్రోధనక , ఇడ , ముని.
*ధర్మదేవుడి భార్యలు:* అరుంధతి , వాసు , యమి , లంబ , భాను , మరుద్వతి , సంకల్ప , ముహూర్త , సంధ్య , విశ్వ.
*సోముడి భార్యలు:* అశ్విని , భరణి , కృత్తిక , రోహిణి , మృగశిర , తారకం (ఆర్ద్ర) , పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ , ఫాల్గుణి , ఉత్తర ఫాల్గుణి , హస్త , చిత్త , స్వాతి , అనూరాధ , జ్యేష్ఠ , మూల , పూర్వాషాఢ , ఉత్తరాషాఢ , శ్రోణ , శ్రవిష్ట , ప్రాచేతస , పూర్వప్రోష్ఠపాదమ్ , ఉత్తర ప్రోష్ఠపాదమ్ , రేవతి
అయితే దక్షుడికి మరో భార్య ప్రసూతి (ఉత్తానపాదుడి సోదరి) ద్వారా 24గురు పుత్రికలు కలిగారు. వీరిలో పదముగ్గురిని ధర్మదేవుడు , ఒకరిని భృగు , సతిని శివుడు , మరీచి , అంగీరసుడు , పౌలస్త్యుడు , పులహుడు , క్రమ ఒక్కొక్కరిని – అనసూయకు అత్రిని , ఊర్జకు వశిష్ఠుడికి , స్వాహాను అగ్నిదేవుడికి ఇచ్చి చేశాడు.
అయితే ఈ విషయాలన్నీ చెప్పకుండా నీలమత పురాణం తిన్నగా కశ్యపుడికి 13 మంది పుత్రికలను ఇచ్చి వివాహం చేయడంతో చెప్తుంది. నీలమత పురాణంలో ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఒక నిముషం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.
మన పురాణాల్లో ఉన్న అనేక విషయాలు మన బుద్ధికి విరుద్ధంగా తోస్తాయి. ప్రాచేతసులు చెట్లను కూల్చడం , చెట్ల పుత్రికను వివాహమాడటం , పదిమందికి ఒకడే పుత్రుడుదయించడం , దక్ష ప్రజాపతికి వేల కొద్దీ కొడుకులు కలగడం , వారు దేశాలు పట్టిపోవడం , మళ్ళీ 60 మంది కూతుళ్ళను కనటం , వారిని గంపగుత్తగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం , మళ్ళీ ఇంకో భార్యకు 13 మంది కలగటం – ఇదంతా అభూత కల్పనలుగా , అనౌచిత్యంగా , పుక్కిట కథలుగా అనిపించవచ్చు. దాన్లో ఎవరి దోషం లేదు. కాని ఒక విషయం – మనం దాన్ని ఏ దృష్టితో చూస్తామో… అలా కనిపిస్తుంది. దోషం విషయంలో ఉండదు , చూసే దృష్టిలో ఉంటుంది.
మన పురాణాలన్నీ పనికిరానివి , అర్థం పర్థం లేనివి , ఏదో ఉబుసుపోక అల్లిన కట్టుకథలని అనుకుంటే అవి అలాగే కనిపిస్తాయి. ముఖ్యంగా వాటిని విదేశీయుల దృష్టితో చూస్తే ఇంకా ఘోరంగా కనిపిస్తాయి. సాధారణంగా ఇరుగుపొరుగువారిలో కూడా ఒకరి పద్ధతులు మరొకరికి వింతగా , అసహ్యంగా తోస్తాయి. ఉదయం నాలుగు గంటలకు లేచేవాడికి , ఏడయినా లేవని వాడిని చూస్తే అసహ్యం కలుగుతుంది. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచేవాడికి , క్రమశిక్షణగా ఉంటూ , శౌచ్యం పాటించే వాడిని చూస్తే జాలి , ద్వేషం. లంచం తీసుకునేవాడికి తీసుకోని వాడిని చూస్తే భయం , ద్వేషం. ఇలాంటి పరిస్థితి ఇద్దరు వ్యక్తుల నడుమనే ఉంటే , ఒక జాతి మరొక జాతిపై ఆధిపత్యం సాధించినప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. కాబట్టి ఎలాగయితే , గ్రీకు పురాణాలను , ఇతర విదేశీ పురాణాలను సానుభూతితో , అవగాహనతో , వాటిలోని ఆంతర్యాలను , ప్రతీకలను , అంతర్గతపుటాలోచనలను విశ్లేషించి తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయో , అలాగే భారతీయ పురాణ గాథలను కూడా భారతీయ దృక్పథంతో అవగాహన చేసుకొని , సానుభూతితో , ప్రతీకలను గుర్తించి అవగతం చేసుకుని ఆలోచించాల్సి ఉంటుంది. అంతే తప్ప , బొటన వేలి నుంచి పుట్టడం ఏమిటి ? తొడ నుంచి పుట్టడం ఏమిటి ? అని ఈసడిస్తే ఎవరికీ ఒరిగేది ఏమీ లేదు.
పౌరాణిక గాథలను జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో ఒక పద్ధతి కనిపిస్తుంది , ఒక ప్రణాళిక కనిపిస్తుంది. దేశం నలుమూలలో ఉద్భవించిన విభిన్న పురాణ గాథలు , విస్తరించిన విభిన్న పురాణాలలోనూ ఒక ఏక సూత్రత కనిపిస్తుంది. దేశమంతా ఒకే భావన , ఒక *‘ఐక్య’* భావన కనిపిస్తుంది. ఇది అత్యద్భుతమైన విషయం. ప్రతి అయిదడుగులకూ భాష , దృక్పథం , జీవన విధానం మారిపోయే పరిస్థితులలో అనాది కాలం నుంచీ అంతర్గతంగా అత్యద్భుతమైన *‘ఐక్యత’* ను సాధించటం ఏ నాగరికతలోనూ , ఎక్కడా కనిపించదు. భారతదేశంలోని ఒక రాష్ట్రమంత చిన్న చిన్న దేశాలున్న *‘యూరప్’* లోనే భిన్న భాషలు , భిన్న సంస్కృతులు , భిన్న పౌరాణిక గాథలు కనిపిస్తాయి. అలాంటిది కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ కశ్యపుడు కనిపిస్తాడు. దక్షుడు కనిపిస్తాడు. దక్షుడి పదముగ్గురు పుత్రికలను కశ్యపుడు వివాహమాడుతాడు. ఇదెలా సాధ్యమైంది ? *ఆనాడు టెలివిజన్లు లేవు. సెల్ఫోన్లు లేవు. ఇంటర్నెట్లు లేవు.* క్షణంలో సమాచారం ప్రపంచం నలుమూలల విస్తరించే వ్యవస్థ లేదు. అయినా ఈ ఐక్యత , ఏక సూత్రత ఎలా సాధ్యమైంది ? దాన్ని సాధ్యం చేసిన వ్యవస్థ , ఆనాటి వ్యక్తులు ఎంత అద్భుతం ! కాబట్టి ఆయా గాథలను తేలికగా కొట్టేసి , చులకన చేసి , కాలర్లెగరేసి *‘ఇంటలెక్చువల్స్’,* *‘ప్రోగ్రెస్సివ్’* అయిపోవటం కన్నా ఆగి , ఆలోచించి , విశ్లేషించుకోవటంలోనే *‘విజ్ఞత’* ఉంటుంది.
[8/10, 7:59 PM] Murali: _*నీలమత పురాణం – 7*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*మారీచాయ సమాధత్స్య శ్రోతుం నామాని భూపతే।*
*తాసాం యస్థాశ్చ యే జాతాస్తేషాం నామాని మే శృంగు॥*
*అదితేస్తనయా దేవా దితేర్దైత్యాస్తథైవ చ।*
*గాంధర్వ్యా వాజినః పుత్రా భద్రాశ్చ సురభే సుతాః॥*
*“రాజోత్తమా కశ్యపుడి సంతానం నామాలు చెప్తాను విను. అదితి సంతానం దేవతలు. దితి సంతానం దైత్యులు. సురభి సంతానం భద్రులు.”*
ఇక్కడి నుండి కశ్యపుడి పుత్రుల పేర్లను వివరించడం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఇటీవలి కాలంలో ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పేరు సరిగ్గా తెలిసీ తెలియనివారు కూడా భారతీయ ధర్మం , భారతీయ తత్వం , పురాణాల విషయంలో మహా పండితులుగా పురాణ విజ్ఞాన సర్వస్వాలుగా తమని తాము భావించుకుంటూ తమ బుద్ధికి (ఉందన్నది అనుమానమే) తోచినట్టు వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. తమ అజ్ఞానంతో , అదీ ద్వేషపూరితమూ , కుట్రపూరితమైన దౌర్జన్యంతో , లేని పోని దుష్ట భావనలు సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం వల్ల , ద్వేష భావనలు విస్తరింపజేయడం వల్ల కలిగే తాత్కాలిక లాభాలను ఆశించి వందిమాగధ భట్రాజ గణం ఆ ద్వేషాన్నీ , పొరపాటునీ ‘సవ్యం’గా భావించి చిందులు తొక్కుతున్నారు. అకాండతాండవం చేస్తున్నారు. వారు చేస్తున్న విద్వేషపూరితమైన ప్రచారాలలో భాగమే దేవతలు అగ్రవర్ణాల వారని , దైత్యులు అల్పవర్ణాల వారని , దేవతలు రాక్షసులను సంహరించడం తరతరాలుగా అల్పవర్ణాల వారిపై జరుగుతున్న దౌష్ట్యానికి నిదర్శనం అని వాదించి ప్రచారం చేయడం. మరి కొందరు – దేవతలు ఆర్యులు , దైత్యులు స్థానికులు ; బయట నుంచి వచ్చి ఆర్యులు స్థానికులపై జరిపిన యుద్ధాలే ఈ దేవతల , దానవుల యుద్ధాలు అనడం. ఏ మాత్రం కనీసం పురాణ పరిజ్ఞానం ఉన్నవారు కూడా అంగీకరించని ఈ దుష్ట వ్యాఖ్యలు సమాజంలో ఆమోదం పొందడం భారతీయ సమాజంలో పురాణాల పట్ల ఉన్న ఉదాసీనతను , తమ గురించి కాస్తయినా తెలుసుకోవాలన్న ఉత్సాహ రాహిత్యాన్ని స్పష్టం చేస్తుంది. తెలియనివాడిని మోసం చేయటం , మూర్ఖుడిని చేయటం , వాడిని తప్పుద్రోవ పట్టించి తనని తాను నాశనం చేసుకునేట్టు చేయటం చాలా సులభం. ప్రస్తుతం భారతీయ సమాజం అలాంటి స్వీయ నాశనకారి మూర్ఖుడి కన్నా అథమ స్థాయిలో ఉన్నవాడిలా ప్రవర్తిస్తోంది.
కశ్యపుడికి అదితికి జన్మించిన వారు దేవతలు. దితికి జన్మించిన వారు దైత్యులు అని దాదాపుగా ప్రతీ పురాణం స్పష్టం చేస్తోంది. ఆధునిక ప్రజాస్వామ్య విలువల ఆధారంగా లెక్కించినా , మెజారిటీ పురాణాలు ఇదే విషయాన్ని ప్రతీసారీ స్పష్టంగా నొక్కి చెప్తున్నాయి. అంటే , దేవతలు , దైత్యులకు తండ్రి ఒక్కడే. తల్లులు సోదరీమణులు. అంటే , వారి సంతానం కూడా వారి వంశానికి… ఆధునికంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒకే కులానికి చెందినవారు అవుతారు. ‘అదితి’ దక్ష ప్రజాపతి కూతురు. ఆమెకున్న పన్నెండుమంది సోదరీమణుల్లో దితి ఒకర్తె. బ్రహ్మ కాలి బొటనవేలి నుండి దక్షుడు ఉద్భవించాడు. బ్రహ్మ కులం ఏమిటి ? బ్రహ్మ బొటనవేలి కులం ఏమిటి ? దక్షుడి కులం ఏమిటి ? బ్రహ్మ ఆర్యుడా ?. దక్షుడు ఆర్యుడా ? ఒక వేళ బ్రహ్మ అర్యుడయితే , దక్షుడు ఆర్యుడు కావాలి. దక్షుడు ఆర్యుడయితే అతని పుత్రులూ ఆర్యులు కావాలి. పోనీ అతని ఇద్దరు భార్యలలో ఒకరు ‘అగ్రవర్ణం’ , మరొకకరు ‘అల్పవర్ణం’ అయితే ఒకరికి పుట్టిన సంతానం ఆర్యులు , అగ్రవర్ణం వారు. మరొకరికి పుట్టిన సంతానం అనార్యులు , అల్పవర్ణాల వారు అనుకోవాలి. కానీ ఇలాంటి అవకాశం లేకుండా ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టినవారు. అక్కచెల్లెళ్ళు. ఏ రకంగా చూసినా ఇక్కడ అగ్రవర్ణం , అల్పవర్ణం , ఆర్యులు , అనార్యులు ఎక్కడి నుంచో వచ్చారు , ఇక్కడ వారిని అణచివేశారు అన్న ఆలోచనలకు తావు లేదు. అసలు అలాంటి ఊహ తలంపు లోకి వచ్చేందుకు ఆస్కారం కూడా లేదు. అయినా అలాంటి వెర్రి మొర్రి కుళ్ళు ఆలోచనలు రావడమే కాదు , అవి ప్రచారం పొంది చలామణీలోకి వచ్చి ప్రజల నడుమ అడ్డుగోడలు నిర్మించగలుగుతున్నాయంటే అవి తమ గురించి తమకు తెలియని అజ్ఞానం తప్ప మరొకరి గొప్పతనం కాదు. గమనిస్తే అసలు ఆ కాలంలో ఇప్పటిలాంటి కుల , జాతి భావనలు లేవని అర్థమవుతుంది.
కశ్యపుడిని కొన్ని పురాణాలు బ్రహ్మ మనవడిగా ప్రకటిస్తాయి , మరికొన్ని పురాణాల ప్రకారం కశ్యపుడు బ్రహ్మ సంతానం. ఏ రకంగా చూసినా ఆర్యుడు కానీ అగ్రవర్ణాలకు చెందిన వాడు కానీ అయ్యే అవకాశం లేదు. మహాభారతం ప్రకారం బ్రహ్మ మానసపుత్రుడయిన మారీచి సంతానం కశ్యపుడు. కాబట్టి బ్రహ్మ మనుమడు. వాల్మీకి రామాయణం ప్రకారం మారీచి , అత్రి , పులస్త్యుల తమ్ముడు కశ్యపుడు. అంటే బ్రహ్మ సంతానం. కొన్ని పురాణాలు కశ్యపుడు , కాశ్యపుడు వేర్వేరుగా చూపితే , ఇంకొన్ని ఇద్దరినీ ఒకరిగా చూపుతాయి. దీన్ని పక్కనబెట్టి చూస్తే , కశ్యపుడు బ్రహ్మల నడుమ సంబంధం విషయంలో మాత్రం ఇలాంటి సందేహం లేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు మన పురాణ అజ్ఞాన సర్వస్వాలు దేవతలు , దైత్యులు , ఆర్యులు , అనార్యులు , అగ్రవర్నలు , అల్పవర్ణాలు అని భావించటానికి వారి ‘అజ్ఞానం’, ‘చిలిపితనం’ తప్ప మరొక ఆధారం లేదని స్పష్టం అవుతుంది.
కశ్యపుడి ఇతర జన్మల గురించి కూడా కొన్ని పురాణాలలో కథలున్నాయి. సుతపసుడు భార్య ప్రశ్నతో కలిసి 12000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడికి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వారు విష్ణువు తమకు సంతానంలా పుట్టాలని కోరుకున్నారు. తరువాత మన్వంతరంలో వారికి విష్ణువు *‘వామనుడి’* లా జన్మించాడు. కశ్యపుడు తరువాత వసుదేవుడి తండ్రిలా జన్మించాడు. అదితి దేవకిలా జన్మించింది.
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే , పురాణాలలో ఇలా వ్యక్తులు , వారి సంతానం , వారి సంతానం ఇలా వివరాలు ఉండడం ఒక సామాజిక కార్యం నిర్వహిస్తుంది. సాధారణంగా మనిషి తాను క్షణికుడిని అనుకుంటాడు. రేపు అన్నది ఉందో లేదో తెలియని తన జీవితంలో ఉన్న ఈ క్షణాన్ని అనుభవించాలని భావిస్తాడు. తదనుగుణంగా సిద్ధాంతాలు సృష్టిస్తాడు. తనకు భవిష్యత్తు లేదనుకున్నవాడు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తాడు. ఇందుకు భిన్నంగా వ్యక్తికి తన గతం తెలిసి , తన పూర్వీకుల గొప్పతనం , తన వారసత్వపు ఔన్నత్యం తెలిసి , తన ప్రతి చర్య భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని , తన వారసులపై ప్రభావం చూపుతుందని గ్రహిస్తూ ఉంటే , ఆ వ్యక్తి తాను క్షణికుడు అనుకోడు. తాను కేవలం గతానికి భవిష్యత్తుకు నడుమ వారధి మాత్రమే అనుకుంటాడు. తన బాధ్యతను తెలుసుకుంటాడు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు. ఇది గమనించిన ప్రాచీన సమాజాలన్నీ , ప్రతి వ్యక్తికీ తన గతం గురించి , తన వారసత్వం గురించి వివరించి , తమ జీవితం క్షణికం కాదు , ఇదొక నిరంతరం తరంతరం నుంచి తరానికి అందించే ప్రయాణం లాంటిదని తెలిపే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాయి. కొందరి పని ఇదే. ఊళ్ళు తిరుగుతూ ఊళ్ళోని వారందరికీ వారి పూర్వీకుల గురించి , పూర్వీకుల ఔన్నత్యం గురించి , వారసత్వం గురించి చెప్తుండేవారు. అందరి గురించి సమాచారం సేకరించేవారు. కొద్ది సంవత్సరాల క్రితం వరకు వ్యక్తులను వారి అసలు పేరుతో కాక , వారి పూర్వీకుల పేర్ల ఆధారంగా గుర్తు పట్టేవారు. *‘ఫలానా వారి మనవడు’* గా గుర్తించేవారు.
అలెక్స్ హేలీ రచించిన ‘రూట్స్’ రచన ద్వారా ఆఫ్రికాలోనూ ఇలాంటి వ్యవస్థ ఉండేదని తెలుస్తుంది. ఇలా ఊరూరు తిరిగే వ్యక్తులకు తమ వారసత్వాన్ని గుర్తు చేసే ‘గ్రియోట్’ ద్వారా హేలీ తనవారిని కలుస్తాడు. ‘రూట్స్’ రచన మొత్తం ఈ సంఘటన వైపుకే పరుగెడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పరమాద్భుతమైన ‘పతాక’ సన్నివేశం లాంటిది ఆ సంఘటన. తనవారిని కలుసుకున్న హేలీ న్యూనతా భావంతో కుంచించుకుపోతాడు. ఎందుకంటే తన నలుపు స్వచ్ఛం కాదు. తెల్లవారి సంగమంతో కలుషితమైన నలుపు అది. కానీ ఆఫ్రికాలో ఉన్న అతనివారిది స్వచ్ఛమైన నలుపు. దాన్ని చూసి తనని తాను కలుషితుడిగా భావించి న్యూనతా భావానికి గురవుతాడు హేలీ. అమెరికాలో పెరిగినవాడు , విద్యావంతుడు , ఆధునిక సౌకర్యాలను , సౌఖ్యాలను అనుభవిస్తున్నవాడు , ఆఫ్రికాలో ఓ మారుమూల ఎలాంటి ఆధునిక విజ్ఞాన గంధం లేనివారు , ఇంకా ఆదిమానవుల స్థాయిలో జీవిస్తున్నవారితో తనను తాను పోల్చుకుని సిగ్గుపడతాడు. న్యూనతా భావాన్ని అనుభవిస్తాడు. ఇది ‘రూట్స్’ రచన ఆత్మను స్పష్టం చేసే సంఘటన. తనవారికి , తన దేశానికి , తన వారసత్వానికి దూరమైన వ్యక్తి తన సంస్కృతి , సంప్రదాయాలను నిలుపుకోవటం కోసం , తనని తనకు దూరం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా జరిపిన పరమాద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శిస్తుంది ‘రూట్స్’. అతని పోరాటం ఏడుతరాల తరువాత విజయం సాధిస్తుంది. ఈ రచన తెలుగు అనువాదంలో ఈ సంఘటన కనబడదు. ఒక వ్యక్తి తన సంస్కృతి సాంప్రదాయాలను నిలుపుకోవటం కోసం చేసే పోరాటం కనబడదు. కేవలం అణచివేత కనిపిస్తుంది. తెల్లవారి దౌష్ట్యం మాత్రం కనిపిస్తుంది. తెలుగులో సంక్షిప్త అనువాదం ముసుగులో దాగి , అనువాదకుడు తన సిద్ధాంతపు రంగుటద్దాలలో మూలంలోని జీవాన్ని , ఆత్మను చంపి ‘రూట్స్’ను ఏడు తరాలుగా అందించాడు. మూలం చదవని వారంతా రంగుటద్దాలతోనే ‘రూట్స్’ను అర్థం చేసుకుంటున్నారు. సమాచార వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనే ఒక రచన ప్రచురితమైన కొద్ది సంవత్సరాలలోనే ఇంతగా దుర్వాఖ్యానానికి గురయి , అసలు అర్థానికి భిన్నంగా ప్రచారంలోకి వచ్చి ఆమోదం పొందుతుంటే , ఎప్పుడో రచించిన పురాణాల గురించిన దుర్వాఖ్యానాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంగ్లంలోని రచనను తెలుగులోకి తప్పుగా అనువదిస్తే , ఆంగ్లం తెలిసినవారూ చెప్పలేదు. తెలియనివారి గురించి చెప్పనవసరం లేదు. పురాణాలు సంస్కృతంలో ఉన్నాయి. అది తెలిసిన వారు చెప్తున్నా వినే స్థితిలో సమాజం లేకపోవటం మన సమాజంలోని వైచిత్రిని స్పష్టం చేస్తోంది.
ఇక ‘నీలమత పురాణం’ విషయానికి వస్తే , దితి అదితిల సంతానం పేర్లు చెప్పిన తరువాత వరుసగా ఎవరెవరు ఎవరెవరికి జన్మించారో ఓ జాబితా ఇవ్వటం ఉంటుంది. ఇది ఆవశ్యకమైన అంశం. ఇలా పూర్వీకుల గురించి తెలియటం వల్ల సమాజంలో వ్యక్తులకు తమ జీవితం బుద్భుద ప్రాయమైనా సృష్టి అవిచ్ఛిన్న ధారలో భాగమని తెలుస్తుంది. అనంతమైన ఈ మాలలో తాను ఒక పుష్పమన్న భావన కలుగుతుంది. ఇది మానవ జీవిత పరిణామ క్రమము , సామాజిక అభివృద్ధి గురించి అవగాహన కలిగిస్తుంది. నీటి అణువులు దేనికదే ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఉన్నా అనంతమైన పాథోరాశితో కలిపి చూస్తే దాని అస్తిత్వం లేదన్న గ్రహింపు కలుగుతుంది. కుటుంబం కోసం వ్యక్తి , సమాజం కోసం కుటుంబం , ధర్మం కోసం సర్వం త్యాగం చేయాలన్న సిద్ధాంతమ్ అర్థమవుతుంది. అందుకని ఈ జన్మల పరంపరను పురాణాలు ప్రకటిస్తూ , వ్యక్తులకు వారి వారసత్వాన్ని అందిస్తూ వస్తున్నాయి. అందుకే భారతదేశంలోని ప్రతి వ్యక్తీ , ఆ వ్యక్తిని ఇతరులు ఎంత తక్కువవడిగా భావించి , చులకనగా చూసినా , తన ఉనికిని ఏ ఋషికో , ఇంకో మహానుభావుడికో ముడిపెట్టి అటునుంచి తిన్నగా సృష్టికారుడి నుంచి తన పరంపరను వివరిస్తాడు. ఆత్మవిశ్వాసంతో , ఆత్మగౌరవంతో వ్యవహరిస్తాడు. ఎవరెంత ప్రయత్నించినా అచంచలమైన విశ్వాసంతో నిలుస్తాడు. కానీ ఎప్పుడయితే అతని ఈ పరంపర గొలుసు తెగిపోతుందో , అప్పుడీ విశ్వాసం దెబ్బతింటుంది. దాంతో ఆత్మాభిమానరాహిత్యం , ఆత్మవిశ్వాస రాహిత్యం అతని మనస్సులో చోటు చేసుకుంటాయి. వ్యక్తి బానిస మనస్తత్వంలోకి దిగజారుతాడు. తనని తాను మరచిపోతాడు. అందుకే *‘గతం లేనివాడికి వర్తమానం ఉండదు, భవిష్యత్తు ఉండదు’* అంటారు. అందుకే ప్రపంచంలో ప్రజలను ఉత్తేజిత పరిచి , కార్యసాధనకు ఉన్ముఖులను చేసేందుకు ఆత్మాభిమానం , ఆత్మవిశ్వాసం రగిలించేందుకు ‘గతం’ను ఒక ఆయుధంలా వాడతారు. లేని గతచరిత్రను సృష్టిస్తారు , వీరులను వెతుకుతారు. ప్రతీకలను సృష్టిస్తారు. అయితే ఇలా కృత్రిమంగా వెతికి , పద్ధతి ప్రకారం సృష్టించిన వాటి వల్ల ఆత్మాభిమానం , ఆత్మవిశ్వాసం దురభిమానంగా , అహంకారంగా ముదిరితే తద్వారా చెలరేగే ద్వేషభావాల వల్ల కలిగే ప్రమాదాలు కూడా చరిత్రలో సాక్ష్యాలుగా దొరుకుతాయి. ఇందుకు భిన్నంగా ఎలాంటి ద్వేష భావనలు , ఉచ్చ నీచ భావనలు లేకుండా అత్యద్భుతమైన చరిత్రను , పరంపరను మన పూర్వీకులు మనకు పురాణాల రూపంలో అందించారు. తద్వారా ప్రజలందరి నడుమ ఐక్యత ఏర్పడి , ఉచ్చ నీచ భావనలు తగ్గి , స్నేహ సౌభ్రాతృత్వ భావనలు నెలకొంటాయి. ఎవరు తమ గతాన్ని ఎవరెవరి ద్వారా నిర్మించుకున్నా చివరకు అన్నీ సృష్టికారుడి దగ్గరకు చేరాల్సిందే. అలాంటి అద్భుతమైన ఏర్పాటును అపార్థం చేసుకోవటం వల్ల , తృణీకరించి , తూష్ణీంభావం వహించడం వల్ల అంతులేని సంపద ఉండి కూడా బికారుల్లా నిలవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఏ ప్రాంతీయ పురాణం రాసినా , ఎంతగా ఆ పురాణం స్థానికమైనదైనా దానిలో ఈ పరంపరను పొందుపరిచారు. దానివల్ల కశ్మీరులో ఓ మారుమూల ప్రాంతంలో ఉన్నవాడు కూడా కన్యాకుమారిలో ఓ మూల ఉన్నవాడితోనూ సంబంధం గుర్తించగలడు. వాడితో స్నేహం నెరపగలడు. తాము ‘ఒకటి’గా భావించగలడు. కాబట్టి ఎంతగా విసుగు అనిపించినా , అప్రస్తుతం అనిపించినా పురాణాలలోని ఈ వంశావళిని , పరంపరను తప్పనిసరిగా పరామర్శించాల్సి ఉంటుంది. గమనించి , గ్రహించి , విశ్లేషించాల్సి ఉంటుంది.
[8/10, 8:00 PM] Murali: _*నీలమత పురాణం – 8*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*యక్షాశ్చ రాక్షసాశ్చైవ ఖసాయాస్తనథాః స్మృతాః ।*
*ఐరావణస్త్విలాపుత్రః పులవాయా దశ గాయనాః॥*
*ముని ప్రసవ ఉత్కశ్చ దివ్యో ప్యరసాం గణః।*
*కాలాయూ కాల కల్పాశ్చ కాలకేయా మతాః సుతాః॥*
‘ఖస’ తనయులు యక్షులు. ఐరావణుడు ఇలా పుత్రుడు. దశ గాయనులు పులవుడి పుత్రులు. మునికి అప్సరలు జన్మించారు. ‘కాలుడి’ కొడుకులు కాలకల్పులు, కాలకేయులు.
పురాణముల ప్రకారం స్వర్గంలో మూడు రకాల దేవతలుంటారు. దేవతలు , గణదేవతలు , ఉపదేవతలు.
గణ దేవతలు అంటే
12 మంది ఆదిత్యులు ,
10 విశ్వదేవులు ,
8 వసువులు ,
36 తుషితలు ,
64 ఆభాస్వరులు ,
49 అవిలులు ,
220 మహారాజికులు ,
12 సాధ్యులు ,
11 రుద్రులు. ఉపదేవతలు 10 రకాలు – విద్యాధరులు, అప్సరసలు , యక్షులు , రాక్షసులు , గంధర్వులు , పిశాచాలు , గుష్యకులు , సిద్ధులు , భూతాలు. నీలమత పురాణంలో ఖస తనయులు యక్షులు అని ఉంది. కానీ ఈ ‘ఖస’ ఎవరో ఎక్కడా లేదు. పురాణాలలో ‘ఖస’ విష్ణు పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి భార్య. మహాభారతం ప్రకారం ‘ఖస’ అన్నది ప్రాచీన భారతంలో ఒక దేశం. మహాభారతంలో ఆదిపర్వంలో బ్రహ్మ జననం తర్వాత విరాట్ పురుషుడి ‘అండం’ నుంచి యక్షులు జన్మించారని ఉంది. అగ్నిపురాణం ప్రకారం యక్షులు , రాక్షసులు ‘ముని’కి జన్మించారని ఉంది. ఈ ముని కశ్యప ప్రజాపతి భార్య. రాక్షసులు , గంధర్వులు ఈమె సంతానం. అగ్నిపురాణంలో ‘ముని’కి 16 మంది గంధర్వులు జన్మించారని , వారిలో పెద్దవాడి పేరు భీమసేనుడు అని ఉంది. పురాణాలలో ఈ ‘ముని’ కాక , ఇంకా ముగ్గురు ‘ముని’లు ఉన్నారు. ఒకరు ‘వసు’ సంతానం. మరొకరు ‘పురు’ వంశానికి చెందిన ‘కురు’ సంతానం. మరో ‘ముని’ ద్యుతిమంతుడి సంతానం. అయితే నీలమత పురాణంలో యక్షులు , రాక్షసులు ‘ఖస’ తనయులు అని ఉండడంతో ఒక చోట ‘ముని’ తనయులు , మరో చోట ‘ఖస’ తనయులు అని ఉంది కాబట్టి , పురాణానికి పురాణానికి తేడా ఉంది కాబట్టి , ఇదంతా ‘ట్రాష్’ అని కొట్టి పడేస్తే నష్టం పురాణాలకు కాదు. భారతీయ వాఙ్మయము కొన్ని వేల సంవత్సరాలు మౌఖికంగా చలామణిలో ఉంది. రాతప్రతులు తయారు చేయడం వచ్చిన తరువాత , పురాణాలు రాతగాళ్ళ రాతపై ఆధారపడింది. అందుకే ప్రాచీన పురాణాలకు పలు విభిన్నమైన ప్రతులు లభిస్తున్నాయి. వాటన్నింటిని పోల్చి పరిష్కరించడం ఒక పెద్ద పని. కాబట్టి *‘నీలమత పురాణం’* లో ఉన్న దాన్ని ఉన్నట్టు చదువుకుని ముందుకు పోవడం మంచిది.
ఐరావతము ఐరావణ అన్న పదాలను సమానార్థాలుగా వాడడం కనిపిస్తోంది. నీలమత పురాణం ప్రకారం ఐరావణ ‘ఇలా’ పుత్రుడు. కాని ‘ఐరావతం’ పురాణాల ప్రకారం ఏనుగు. విష్ణువు నుండి బ్రహ్మ , బ్రహ్మ నుండి కశ్యపుడు , తరువాత భద్రమాత , ఐరావతి , ఐరావతు. ఇదీ ఐరావతం జననం. కశ్యపుడు దక్షుడి కూతురు క్రోధవశను వివాహామాడాడు. ఆమె ద్వారా 10 మంది కూతుర్లను కన్నాడు. వారిలో భద్రమాత ఒఅక్రు. ఆమె కొడుకు ఐరావత. ఇంద్రుడు కశ్యపుడికి అదితి వల్ల జన్మించాడు కాబట్టి ఐరావతాన్ని తన వాహనంగా చేసుకున్నాడు. దుర్వాసుడి శాపం వల్ల దేవతలు ముసలివాళ్లవడం మొదలయ్యింది. సాగర మథనం వల్ల జనించే అమృత సేవనమ్ వారిని యవ్వనవంతులను చేస్తుంది. దుర్వాసుడి శాపానికి కారణమైన ఐరావతం పాలసముద్రంలో మునిగి విష్ణువు నామ జపం చేసింది. దేవతలు రాక్షసుల సహాయంతో సాగర మథనం జరిపినప్పుడు ఐరావతం శాప విమోచనం పొందింది. ఇది ఐరావతం పురాణ గాథ. అయితే నీలమత పురాణంలోని ఐరావణ , ఇతర పురాణాలలోని ఐరావతం ఒకటేనా అన్నది ఇంకా పరిశోధించాల్సి ఉంటుంది.
కశ్యప ప్రజాపతికి ‘కాలా’కి జన్మించిన వారు కాలకేయులు. కాలకేయులు 60,000 మంది. వీరు వృతాసురుడి నేతృత్వంలో పోరాడుతారు. పురాణ కథనం ప్రకారం కాలకేయులు బ్రాహ్మణులపై పగబట్టి వారిని హింసించడం ప్రారంభించారు. అప్పుడు బ్రాహ్మణులు అగస్త్యుడిని ప్రార్థించారు. అగస్త్యుడికి భయపడిన కాలకేయులు సముద్రంలో దాగారు. అప్పుడు అగస్త్యుడు సముద్రం నీటిని తాగేశాడు. అక్కడ దాగిన కాలకేయులను సంహరించాడు. కొందరు పాతాళానికి పారిపొతారు. మరో సందర్భంలో కాలకేయులు దేవలోకంపైకి దాడి చేసినప్పుడు ఇంద్రుడు అర్జునుడి సహాయం కోరతాడు. ఇది కాలకేయుల కథ.
అప్సరసలు దేవతాస్త్రీలు. వీరు కొన్ని వేల సంఖ్యలో ఉంటారు. సాగర మథనం సమయంలో అప్సరసలు జన్మించారని పురాణాలలో ఉంది. మరో కథ ప్రకారం కశ్యపుడికి, అరిష్టకు 13 మంది అప్సరసలు జన్మించారు. అలంబస , మిత్రకేశి , తిలోత్తమ , రక్షితా , రంభ , మనోరమా , కేశిని , సుబాహు , సురభా , సురతా , సుసియా. అరిష్ట నలుగురు గంధర్వులకు కూడా జన్మనిచ్చింది. వారు హాహా , హుహు , అవి , బాహు.
అయితే నీలమత పురాణంలోని దశగాయనిలు ‘పుల’కు జన్మించడం గురించి ఇతర పురాణాలలో కనబడదు. ఒకవేళ ‘పుల’ను ‘పులస్త్య’ అనుకుంటే, పులస్త్యుడికి రాక్షసులు , వానరులు , కిన్నెరలు , గంధర్వ్యులు , యక్షులు జన్మించారన్న ‘ఆదిపర్వం’ లోని శ్లోకాన్ని పరిగణనలోకి తీసుకుంటే దశగాయనులు కిన్నెరులుగా భావించవచ్చు. కాని కిన్నెరులు పురుషులు. వారందరూ వీణాధరులు. కాబట్టి ‘దశగాయని’ల గురించి తెలియడం లేదు (తెలిసిన వారెవరైనా తెలియజేస్తే ఆ సమాచారాన్ని ఈ వ్యాఖ్యానంలో పొందుపరిచే వీలుంటుంది).
ఇక్కడి నుండి నీలమత పురాణంలోని అంశాలు అందరికి పరిచయమైనవే ఉంటాయి.
‘దను’కు దానవులు జన్మించారు. క్రోధకు పదిమంది పుత్రికలు కలిగారు. ఒకరిపట్ల ఒకరు మాత్సర్యం వహించారు వినత కద్రువలు. జలం నుంచి జన్మించిన అశ్వం ‘ఉచ్ఛైశ్రవం’ను చూసి వినత అది తెల్లగా ఉందన్నది. కాని కద్రువ నల్లగా ఉందన్నది. ఇద్దరు వాదించుకున్నారు. ఓడిపోయినవారు గెలిచిన వారికి ‘బానిస’ అవ్వాలని నిశ్చయించుకున్నారు. నాగులు తల్లికి సహాయపడ్డారు. దాంతో అశ్వం నల్లగా కనబడింది. వినత కద్రువకు బానిసయ్యింది. కానీ శక్తిమంతుడైన వినత తనయుడు గరుడుడు ఇంద్రుడి నుంచి అమృతం తెచ్చాడు. నాగులను భక్షించే వరం పొందాడు. గరుడుడు నాగులను భక్షిస్తున్న తరుణంలొ వాసుకి జనార్ధనుడి రక్షణ కోరాడు. జనార్ధనుడిని ప్రార్ధించాడు. ప్ర్రసన్నుడైన భగవంతుడు వాసుకికి వరమిచ్చాడు. ఆ వరం నీలమత పురాణానికి నాందీ ప్రస్తావన లాంటిది.
ఇక్కడి నుండి అసలు నీలమత పురాణం ఆరంభమవుతుంది. అయితే ఇంకా ముందుకు వెళ్ళేకన్నా ముందు వాసుకి జనార్ధనుడిని స్తుతించిన శ్లోకాలను స్మరించాల్సి ఉంటుంది. అత్యద్భుతమైన శ్లోకాలు ఇవి.
*నమోస్తు తె దేవవరాప్రమేయ నమోస్తు తె శంఖ గదాసిపాణే।*
*నమోస్తు తె దానవనాశనాయా నమోస్తు తె పద్మజసంస్థుతాయ॥*
*నమోస్తు తె లోకహితె రతాయ నమోస్తు తె వాసవనందనాయ।*
*నమస్తు తె భక్తవరప్రదాయ నమోస్తు తె సత్పథదర్శనాయ॥*
*ఉన్నిద్రనీలనళినధ్రుతిచారూవర్నమ్ సంతృప్తహాటకనిభే వసనే వసానమ్।*
*సద్రత్నచుంబితకిరీటవిరాజమానమ్ దామోదరమ్ సురగురుమ్ ప్రాణతోశ్చిమ నిత్యమ్॥*
*క్షీరోదకన్యార్పితపాదపద్మమ్ హరిమ్ ప్రపన్నోశ్స్యానంధమ్ వరేణ్యమ్।*
*పరమ్ పురణామ్ పరమ్ సనాతనమ్ తమాదిదేవమ్ ప్రణతోస్మి భక్త్యా॥*
*ఫణావళీరత్నాసహస్రార్చిత్ర శేషశ్య భోగే విమలే శయానమ్।*
*తమాదిదేవమ్ పురూవమ్ పురాణమ్ నమామి భక్త్యా పరయా రమేశమ్॥*
*భుమేః సముద్ధారణ బద్ధచిత్తౌ దైత్యేంద్రానర్ఘాత విధానదక్షః।*
*లోకస్య సర్వస్య తు చింతయానః శుభాశుభమ్ రక్ష మమాధ్యదేవ॥*
*ఖగపతిరాతిబీమచండవేగో మమ కులమాశు వినాశాయత్యనంత।*
*కురుమునివరసంస్థుతాధరక్షామ్ పవనబలమ్ వినివారయస్వ సాక్ష్య్రమ్॥*
ఇలా అత్యంత రమణీయమైన రీతిలో స్తుతిస్తాడు వాసుకి భగవంతుడిని. ఆ స్తుతికి ప్రసన్నుడైన భగవంతుడు గరుడుడి నుండి వాసుకికి రక్షణ కల్పిస్తాడు.
*తమాహా భగవాన్దేవో వాసుకిమ్ భయవిహ్వలమ్।*
*సతీదేశోత్ర పుణ్యోదె సరస్యమరభూషితె॥*
*ధర్మిష్టైః సహితొ నాగైర్వసస్వామితవిక్రమ।*
*తస్మిన్ సరసై యె స్థానమ్ కరిష్యాంతి భుజంగమాః॥*
*తస్య తస్యాహిశత్రువై న హానిష్యాంతి జీవితమ్।*
*సతీదేశె కృతస్థానమ్ తిష్టంతమకుతోభయమ్॥*
భయంతో వణుకుతున్న వాసుకికి అభయం ఇచ్చి “నువ్వు నీ ఇతర నాగులతో కలిసి సతీదేవి దేశమైన సతీ సరోవరమనే పవిత్ర నీటి సరస్సులో భయరహితంగా జీవించు. సతీసరోవరంలో ఉన్న నాగులను ఏ శత్రువూ ఏమీ చేయలేడు. నాగులకు రాజుగా నీలుడిని నియమించండి. నీకు శత్రుభయం ఉండదు” అంటాడు.
భగవంతుడి ఆజ్ఞను వాసుకి పాటిస్తాడు. ఎలాంటి భయం లేకుండా సతీసరోవరంలో సుఖంగా నాగులు జీవించడం ప్రారంభిస్తాయి.
సతీసరోవరం జలం ఎంతటి పవిత్రమైనదంటే , దేవతల రాజు ఇంద్రుడు సతీసమేతంగా ఆ సరోవరం ప్రాంతానికి వచ్చి క్రీడిస్తాడు. ఆనందిస్తాడు.
అలా ఇంద్రుడు శచీదేవితో క్రీడిస్తున్న సమయంలొ ‘సంగ్రహి’ అనే దైత్యుల రాజు అక్కడికి వస్తాడు. శచీదేవిని చూసి మోహిస్తాడు. అదుపులేని కాంక్ష వల్ల రేతస్సు పతనం అవుతుంది. అది సతీసరోవరం నీటిలో పడుతుంది. అయితే శచీదేవిని మోహించిన సంగ్రహుడితో ఇంద్రుడు పోరాడుతాడు. సంవత్సరం పాటు జరిగిన పోరాటంలో చివరికి ఇంద్రుడు విజయం సాధిస్తాడు. సంగ్రహుడు మరణిస్తాడు. శచీదేవితో ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు.
సతీసరోవరంలో పడిన సంగ్రహుడి రేతస్సును సరోవరంలోని నాగులు కాపాడుతాయి. కొన్నాళ్లకు పిల్లవాడు పుడతాడు. జలంలో ఉద్భవించడం వల్ల ఆ దైత్యుడి సంతానానికి నాగులు జలోద్భవుడని పేరు పెడతాయి. ఈ సంగ్రహుడి ప్రసక్తి కానీ , జలోద్భవుడి గురించి కానీ ఇతర పురాణాలలో కనబడదు. ఇది కశ్మీరుకే ప్రత్యేకమైన పురాణం.
నాగుల సాంగత్యంలో పెరుగుతాడు జలోద్భవుడు. అతడు ఘోరమైన తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన భగవంతుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమంటాడు. జలోద్భవుడు మూడు వరాలు కోరుతాడు. నీటిలో ఉన్నంత కాలం మరణం తన దరిదాపుల్లోకి రాకూడదు , తనకు మాయాశక్తులు ఉండాలి , ఇతరులెవరికీ లేనంత శక్తి తనది కావాలి. భగవంతుడి నుండి వరాలను పొందిన జలోద్భవుడు సతీసరోవరం పరిసర ప్రాంతాలలో ఉన్న మనుషులను తినడం ప్రారంభిస్తాడు. దార్వాభిసార , గాంధార , జుహుందర , శక , ఖాస , తంగణ , మండవ , మద్ర , అంతర్దితి , బహిర్దితి ప్రాంతాల ప్రజలను హింసించడం ప్రారంభిస్తాడు. జలోద్భవుడికి భయపడి ప్రజలు ఇళ్ళు వాకిళ్ళు వదిలి ప్రాణాలు అరచేత పట్టుకొని దేశంలోని ఇతర ప్రాంతాలకు పారిపోతుంటారు. దేశం శూన్యమైపోతుంది.
ఇది చదువుతుంటే ఆలోచనలు పలు భిన్నమైన దిశలలో పరుగిడతాయి. సాధారణంగా పురాణాలలో పలువురు తపస్సులు చేస్తుంటారు. తపస్సు ద్వారా శక్తులు సంపాదిస్తుంటారు. కానీ ఆ శక్తులను తమ స్వార్థం కోసమో , ఇతరులను హింసించడం కోసమో చేసేవారు రాక్షసులు. వారి బారి నుండి ప్రజలను రక్షించేందుకు భగవంతుడు అవతారం ఎత్తడమో , ఎవరో మహాపురుషుడు రావటమో జరుగుతుంది. అంటే , పురాణాలు స్వార్థం రాక్షసం , నిస్వార్థం దైవత్వం అని ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తున్నాయన్న మాట. ఎంత తపస్సు చేసినా అది స్వార్థం కోసమయితే వ్యర్థమే అన్న మాట.
[8/10, 9:27 PM] Murali: _*నీలమత పురాణం – 9*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*తే హన్యమానాః పాపేనా దేశాన్సం ప్రాధ్వన్ భయాత్ ।*
*శూన్యేషు తేషు దేశేషు విచచార స నిర్భయః॥*
దైత్యనాయకుడు సంగ్రహుడి రేతస్సు సతీసరోవరంలో పతనం అయిన తరువాత , సరోవరంలోని నాగులు దాన్ని సంవత్సరం పాటు కాపాడేరు. ఫలితంగా జలోద్భవుడు ఉద్భవించాడు. జలోద్భవుడు జలంలో ఉన్నంత వరకూ మరణం లేదన్న వరం పొంది ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఫలితంగా సరోవర పరిసర ప్రాంతాలే కాదు , దూర దూర ప్రాంతాలన్నీ జన శూన్యం అయిపోయాయి. ఆ శూన్య దేశంలో నిర్భీతిగా , విచ్చలవిడిగా సంచరిస్తూండేవాడు జలోద్భవుడు.
ఇది చదువుతుంటే కశ్మీరు చరిత్రలోని ఒక అంశం స్ఫురణకు వస్తుంది. కశ్మీరు ప్రజలు ఓ వైపు అత్యంత సౌఖ్యం అనుభవించారు. మరో వైపు వెంటనే అత్యంత బీభత్సానికి గురయ్యారు. కశ్మీరు వదిలి పారిపోయారు. శూన్యమైన కశ్మీరు పిశాచాల వశం అయింది. మళ్ళీ కశ్మీరు సంప్రదాయాలను పునరుజ్జీవితం చేయటంతో పిశాచాలు బలహీనమై పారిపోతాయి. మళ్ళీ జనులు వచ్చి కశ్మీరులో చేరుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతం అవుతుంది. శాంతిగా ఉన్న కాలంలో సకల దేశాలకి అన్ని రంగాలలో మార్గదర్శకంగా ఉంటుంది కశ్మీరు. ఆ తరువాత దేశం మొత్తం ఏకమై కశ్మీరును కాపాడుకుంటుంది. ‘కశ్మీరు’ అన్న పేరు రాకముందు నుంచీ కశ్మీరు చరిత్ర ఇంతే. నీలమత పురాణంతో పాటు కల్హణ విరచిత రాజతరంగిణి చదివితే కశ్మీరు పలుమార్లు నాశనం అవటం కనిపిస్తుంది. సర్వనాశనమైన కశ్మీరు నుంచి మళ్ళీ , బూడిద నుంచి జీవం పోసుకునే ‘పక్షి’లా కశ్మీరు కొత్త రూపు ధరించి పునరుజ్జీవమవటం తెలుస్తుంది. నిజానికి ఇప్పుడు ‘శ్రీనగర్’గా చలామణీ అవుతున్న ప్రాంతం అసలు శ్రీనగర్ కాదు. ఆ శ్రీనగరం పలుమార్లు ధ్వంసం అయింది. అయినా శ్రీనగరం ఆ శకలాల నుండి తిరిగి తలఎత్తి నిలుస్తూనే ఉంది. తల ఎత్తినప్పుడల్లా ప్రపంచానికి విజ్ఞానపు వెలుగులను పంచుతూనే ఉంది. భారతీయ ధర్మం ప్రకారం వెలుగు విజ్ఞానం. విజ్ఞానం దైవం , చీకటి అజ్ఞానం. అజ్ఞానం రాక్షసత్వం. ప్రస్తుతం కశ్మీరులో మళ్ళీ రాక్షసత్వం రాజ్యం ఏలుతున్నట్లు కనిపిస్తోంది. పిశాచాలు కరాళ నృత్యం చేస్తున్నాయి. వాటిని తరిమి మళ్ళీ కశ్మీరు తల ఎత్తేట్టు చేయడం మన కర్తవ్యం.
కశ్మీరు జలోద్భవుడి అకృత్యాలలో అల్లకల్లోలమవుతున్న సమయంలో అక్కడికి కశ్యపుడు వచ్చాడు.
*ఏతాస్మిన్నేవ కాలే తు కశ్యపో భగవాన్ ఋషిః।*
*తీర్థయాత్రా ప్రసంగేన చచార సకలాం మహీమ్॥*
*వర్షేస్మిన్ భారత పుశ్యే శుభాశుభ ఫలప్రదే।*
*పుష్కరం దుష్కరగమం బ్రహ్మలోకప్రదం శివమ్॥*
*ధర్మక్షేత్రం కురుక్షేత్రం నైమిషం పాపనాశనమ్।*
*పిత్రూణామాలయం పుణ్యం హయశీర్షం మహాత్మానమ్॥*
*సర్వపాపహరం దివ్యం తథా చామరుకంటకమ్।*
*వరాహ పర్వతం పుణ్యం పుణ్యం పంచనదం తథా॥*
*కాలాంజనం సగోకర్ణం కేదారం సమహాలయం।*
*నారాయణయస్య చ స్థానం సపుణ్యం బదిరాశ్రమమ్ ॥*
*సుగన్ధాం శతకుంభాం చ కాలికాశ్రమమేవచ।*
*శాకంబరీం నీలాంతికం శాలిగ్రామం పృథుదకమ్॥*
*సంవర్లాక్షం రుద్ర కోటిం ప్రభాసమ్ సాగరోదకమ్।*
*ఇంద్రమార్గం మతంగస్య వాపీం పాపప్రసూదినీమ్॥*
ఇలా దాదాపుగా 15 శ్లోకాలలో కశ్యపుడు దేశమంతా పర్యటించి దర్శించిన పుణ్యతీర్థాల జాబితా , వాటి ప్రాశస్థ్యం పొందుపరిచి ఉన్నాయి.
పుష్కరం , ప్రయాగ , కురుక్షేత్రం , నైమిశం , వరాహ పర్వతం , పంచనంద , కాలంజన , గోకర్ణ , కేదార , మహాలయ , లలితిక , శాలగ్రామ , పృథుదకం , సంవర్లాక్ష , రుద్రకోటి , ప్రభాస , సాగరోదక , ఇంద్రమార్గ , మాతంగ వాపి , అగస్త్యాశ్రమం , తండులికాశ్రమం , జంబూమార్గం , వారణాసి , జమున , శతధ్రు , సరయు , గోదావరి , వైతరణి , గోమతి , బహుద , వేదస్మృతి , అస , వర్ల , తామ్రపర్ణోత్పలావతి , శిప్ర , నర్మదా , గోన , పయోంష్ణీ , ఇక్షుమతి , సరట్టు , దుర్గ , కటశు , కావేరి , బ్రహ్మణి , గౌరి , కంపనాం , తమసాం , గంగాసాగర సంధి , సింధుసాగర సంగమం , భృగుతంగం , విశాలం , కుబ్జామ్రం , రైవతం , కుశావర్తం , బిల్వకం , నీలపర్వతం , కనఖలం వంటి తీర్థాలు , తీర్థస్థానాలు దర్శించి పునీతుడయ్యాడు కశ్యపుడు.
కశ్యపుడు దర్శించిన తీర్థాలు , తీర్థస్థానాల జాబితా చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. దేశం మొత్తాన్ని ఒక్క అంగుళం కూడా వదలకుండా దర్శించాడు కశ్యపుడు. అంటే ఈ దేశం మొత్తం అణువణువునా దైవ భావన , పవిత్ర భావన నర్తనమాడుతున్నదన్న మాట. అందుకే ఇది దైవభూమి అయ్యింది. వేదభూమి అయింది.
ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. కశ్యపుడు తిరిగిన ప్రదేశాలు ఏ ఒక్క రాజ్యానికో చెందినవి కావు. ఇవి ఎవరి సొత్తు కావు , ఇవి పవిత్ర స్థలాలు. సకల భారతీయులకు పవిత్ర ప్రదేశాలు. వీటికి మతంతో , రాజకీయంతో సంబంధం లేదు. గమనిస్తే , శ్లోకాలలో ఆయా తీర్థాల ప్రాశస్త్యం , అక్కడ కొలువైన దైవం గురించి చెప్పడం తప్ప *‘ఫలానా రాజ్యంలోని ఫలానా తీర్థం’* అంటూ చెప్పడం కనపడదు. కారణం , ఆ కాలంలో ఇప్పటిలా భౌగోళిక సరిహద్దుల భావన లేదు. రాజులెవరెవరో ఉండవచ్చు. రాజ్యాలు ఎన్నో వుండవచ్చు. కానీ ఈ దేశం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఒకటే. ఈ దేశాన్ని పట్టి ఉంచేది ధర్మం. దాన్ని పాలించేది దైవం. అంతే తప్ప ‘ఫలానా రాజు పాలిస్తున్నాడు కాబట్టి ఆ రాజ్యం నాది కాదు. నా రాజభక్తి నా భౌగోళిక సరిహద్దుల వరకే’ అన్న భావన ఆనాడు లేదు. అది ఆధునిక భావజాల జనిత వికృతి. *‘తీర్థయాత్రా ప్రసంగేన చచార సకలాం మహీమ్’.* తీర్థయాత్ర ఉద్దేశంతో ‘సకలాం మహీమ్’ ప్రయాణించాడు. అంతే తప్ప పలు రాజ్యాలు దాటాడు అన్న ఆలోచన ఆనాడు లేదు. ఈనాటి దృష్టితో ఆనాటి కాలాన్ని దర్శించి , మనకు ‘దేశభక్తి’ భావన ‘బ్రిటీష్ వాడి వల్ల వచ్చింది’ అని తీర్మానించడం మూర్ఖత్వం. చీమ దృష్టితో ఏనుగును చూసి తీర్మానాలు చేయటం లాంటిది. భారతీయులకు దేశం , ధర్మం భావనల నడుమ అభేద ప్రతిపత్తి. దేశ భావనకు రాజుతో సంబంధం లేదు. ధర్మ భావనకు రాజుతో సంబంధం లేదు. భక్తి భావనకు ఎవరితో సంబంధం లేదు. సంబంధం అంతా ధర్మంతో , దైవంతో అంతే.
అంటే ధర్మ బావన అనే దారంతో ఈ దేశమనే భావనకు పూలమాలను అర్పించే వీలును కల్పించారన్నమాట. అందుకే రాజ్యాలపై విదేశీ దాడులు జరిగినప్పుడు లేని స్పందన మందిరాలపై , పవిత్ర స్థలాలపై దాడులు జరిగినప్పుడు కనిపిస్తుంది. కారణం ఇక్కడి ప్రజలను ఏకత్రితం చేసేది , వారిలో స్పందనలు కలిగించేది ధార్మిక భావన మాత్రమే. ఇక్కడి కథలో కూడా సతీసరోవరం పరిసర ప్రాంతాలలో జలోద్భవుడు పట్టు బిగించి ప్రజలను తరిమేస్తూంటే , తీర్థయాత్రలకు వచ్చిన కశ్యపుడిని కశ్మీరుకు ఆహ్వానిస్తాడు నీలుడు అనే నాగు.
*పూర్వదేశే త్వయా బ్రహ్మాన్ దాక్షిణే పశ్చిమే తథా।*
*దృష్టాని సర్వతీర్థాని యాస్యమోద్యోత్తరాం దిశమే॥*
నీలుడు కశ్యపుడిని పితృ సమానుడిగా భావించి సేవలు చేస్తాడు. తండ్రి కూర్చునేందుకు అనుమతినిచ్చిన తర్వాత కూర్చుంటాడు. తరువాత వినయంగా తండ్రి ముందు తన మనసులోని మాటను ప్రస్తావిస్తాడు. ‘ధర్మప్రేమికులయిన తమరు తీర్థయాత్రలు చేస్తున్నరని తెలిసింది. తమను సేవించుకోవాలన్న తపనతో మీ దగ్గరకు వచ్చాను. బ్రహ్మ సమానులైన తమరు దేశంలోని తూర్పు , దక్షిణ , పశ్చిమ ప్రాంతాలలోని పుణ్యస్థలాలు , తీర్థాలన్నింటినీ దర్శించారు. ఇక ఉత్తర ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలను దర్శించాల్సి ఉంది’ అని ఉత్తర ప్రాంతాలలో ఉన్న పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తాడు.
ఇక్కడ గమనించాల్సినదేంటంటే నీలుడు , ‘దేశంలోని తూర్పు , పశ్చిమ , దక్షిణ ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాలను కశ్యపుడు దర్శించారు’ అనటం అంటే ‘నీలమత పురాణం’ నాటికే దేశం అన్న భావన ఉంది. మొత్తం భారతదేశంలోని తూర్పు , పశ్చిమ , దక్షిణ ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాలను కశ్యపుడు సందర్శించాడు. అంటే అప్పటి ‘దేశ’ భావనలో విభిన్న రాజ్యాలన్నీ మిళితమై ఉన్నాయి. రాజ్యం వేరు , దేశం వేరు. రాజ్యం రాజుకు సంబంధించినది. దేశం ధర్మానికి సంబంధించినది. ధర్మం అందరిది. ధర్మానికి ఎల్లలు లేవు. అంటే , ఆనాటి దేశ భావనకు ఎల్లలతో సంబంధం లేదు. ఎల్లలు రాజులకు , రాజ్యాలకు సంబంధించినవి. ఇంత స్పష్టంగా పురాణాలలో దేశ భావన ఉంటే , ఆధునికులు భారతీయులకు దేశమన్న భావన స్వాతంత్ర్యం తరువాత మాత్రమే వచ్చిందని అనడంలో అర్థం ఏమిటి ? వచ్చిన చిక్కు ఏమిటంటే , మనం ఇప్పటి సాంకేతిక పదాల నిర్వచనాన్ని అప్పటి పదాలకు అన్వయించి అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. కానీ అప్పటికీ , ఇప్పటికీ నడుమ కొన్ని వేల సంవత్సరాలున్నాయి. ఈనాడు ఒక అయిదారేళ్ళలోకి పదాల అర్థాలు విపరీతంగా మారిపోవటం గమనిస్తున్నామ్. ఒకప్పటి ‘సెల్’ ఇప్పటి ‘సెల్’ కాదు. ఒకప్పటి ‘మౌస్’ ఇప్పటి ‘మౌస్’ కాదు. అలాంటిది కొన్ని వేల సంవత్సరాలలో పదాలు , పదాల అర్థాలలో మార్పులు రావడంలో ఆశ్చర్యం లేదు. అప్పటి పదాల అర్థాలను వివరించడంలో ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి ‘దేశం’ అప్పటి ‘దేశం’ పదాలు ఒకే రకంగా ఉన్నా , అర్థాలలో తేడా ఉందని గ్రహించాలి. కశ్యపుడితో నీలుడు అన్న దేశం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న భూభాగం. దాన్ని పశ్చిమ , తూర్పు , దక్షిణ అన్న ఖండాలుగా సూచించాడు. ఉత్తరం వైపున ఉన్న తీర్థాల గురించి వివరించాడు. ఇక్కడ ఎక్కడా రాజు , రాజ్యం ప్రసక్తి లేదు. ఆ కాలం వారు ఇలాంటి సంకుచిత భావాలను , ఎల్లలను గుర్తించలేదు. ఎల్లలు లేని ధర్మంపైనే వారి దృష్టి. ఆ తరువాత కశ్యపుడితో ‘మాద్ర దేశంలో , హిమాలయాలలో బోలెడన్ని తీర్థప్రదేశాలున్నాయ’ ని చెప్తాడు. దేశం అన్న పదం రెండు మార్లు రెండు విభిన్నమైన అర్థాలలో వాడటం గమనార్హం. ఒక దేశం సమస్త భారతదేశం. మరొకటి మాద్రదేశాన్ని సూచిస్తోంది. కాని మాద్రదేశం అనటంలో వేరు భావన లేదు. భారతదేశమనే మహాదేశంలో మాద్రదేశం ఒక ప్రాంతం మాత్రమే. ఆధునిక గణిత భాషలో చెప్పాలంటే భారతదేశమనే ‘సెట్’ (set) లో మాద్రదేశం ఒక ‘సబ్ సెట్’ (sub-set) లాంటిదన్న మాట. భారతవర్షం , భారత ఖండంలో ఒక దేశం అన్న మాట. ఉత్తర దేశంలోని పుణ్యక్షేత్రాలు కూడా చూడమని అభర్థిస్తూ నీలుడు ఒకటొకటిగా ఉత్తరంలోని పుణ్యక్షేత్రాలను ప్రస్తావిస్తాడు.
శుభప్రదమైన విపాస , పాపాలను కడిగివేసే దేవహృద , స్నానమాచరణతోనే స్వర్గ ప్రాప్తినిచ్చే కరవీరపుర సంగమం (దేవహృద , విపాసలు సంగమించే స్థలం), విపాసలోని కలికాశ్రమం , ఇరావతీ నది (ఈ ఒక్క ఇరావతీ నది వద్దనే 60,000 పుణ్యస్థలాలున్నాయి), ఇంకా కుంభవసుమ్ద , దేవిక నది , విశ్వామిత్ర నది, ఉద్ధనది వంటి పవిత్ర నదులు , ఇంద్రమార్గం , సోమతీర్థం , అంబుజాన , సువర్ణచారు , రుద్రతీర్థ , దుర్గద్వార , కోటితీర్థ , హంసపాద , ఋషిరూప , దేమీతీర్థం , పంచనది, అపాగ , తేశ నది , చంద్రభాగ , , శంఖమార్ణాల , గుహ్యేశ్వర , శతముఖ , ఇష్టకాపథ , వాదందేశ వంటి పవిత్ర స్థలాలు , నదులు ఉన్నాయి. శతముఖ నుండి గుహ్యేశ్వర వరకు ఉన్న పవిత్ర స్థలం , పవిత్రతలో వారణాసి కన్నా మిన్నా. వస్త్రపథ అత్యంత శ్రేష్టమైన పవిత్ర స్థలం. సతి అలోకల తీర్థం సతీసరోవరం. అన్ని పాపాలను హరిస్తుంది విష్ణుపాద సరస్సు. *“కాబట్టి ఇలాంటి అత్యద్భుతమైన తీర్థస్థలాలను తమరు దర్శించి తీరాల్సిందే. ఈ దర్శనీయ స్థలాలను దర్శించడం వల్ల అక్కడ ఉండే దుష్టుల పాపాలను కూడా మీరు పక్షాళన చేసినట్లవుతుంది”* అని నీలుడు అభ్యర్థించాడు.
ఇవన్నీ వింటుంటే ఒక ఆలోచన వస్తుంది.
ఆ కాలంలో పవిత్ర స్థలాల గురించి ప్రతి ఒక్కరికీ ఎంత బాగా తెలుసో అనిపిస్తుంది. పవిత్ర స్థలాల పేర్లు చెప్పటమే కాదు , వాటి ప్రాశస్త్యం వివరించడంతో పాటు ఏయే తిథి , నక్షత్రాలలో అవి మరింత పవిత్రమో చెప్పటం కనిపిస్తుంది.
అలా నీలుడు ఒకటొకటిగా పవిత్ర స్థలాలను వర్ణించి చెప్తుంటే , కశ్యపుడికి కూడా ఆయా తీర్థాలను దర్శించాలనే ఉత్సాహం కలిగింది. నీలుడితో పాటు ఆయన పవిత్ర స్థలాలను దర్శించేందుకు ప్రయాణమయ్యాడు.
యమున , సరస్వతులను దాటి కురుక్షేత్ర దర్శించాడు. అక్కడి ‘సన్నీతి’ అత్యంత పవిత్రం. ప్రతి అమావాస్య నాడు అన్ని తీర్థాల జలాలు ఈ తీర్థంలో చేరుతాయి. రాహువు వల్ల సూర్యగ్రహణం ఏర్పడిన కాలంలో ఇక్కడ శ్రాద్ధకర్మలు జరిపిన వారికి వెయ్యి అశ్వమేధ యాగాలు జరిపిన పుణ్యం వస్తుంది. సన్నితిని దర్శించిన తరువాత చక్రతీర్థ ప్రయాణమయ్యారు. ఈ చక్రతీర్థ ప్రాశస్త్యాన్ని నారదుడు సైతం పొగిడాడు. ఈ చక్రతీర్థ సందర్శనం వల్ల కలిగే పుణ్యం సూర్యగ్రహణం వల్ల కలిగే పుణ్యం కన్నా పదిరెట్లు ఎక్కువ. చక్ర , పృథుదకలను దర్శించిన తర్వాత విష్ణుపాద , అమర పర్వాతలను దర్శించారు. ఆ తరువాత శతధ్రు , గంగానదులను దాటి అర్జునుడి ఆశ్రమం ‘దేవసుందరం’ చేరుకున్నారు. ఆపై విపాసను దాటారు. అప్పుడు కశ్యపుడు మాద్రదేశం శూన్యంగా ఉండడం చూశాడు. ఆశ్చర్యపోయాడు.
*ఉత్తీర్థ చ మహాభాగాం విపాశాం పాపనాశినీమ్।*
*దృష్టవాన్ సకలం దేశం తదా శూన్యం స కశ్యపః॥*
సిరి సంపదలతో , ధన ధాన్యాలతో తులతూగే రమణీయమైన దేశం ఇంత శూన్యంగా ఎందుకు ఉందని నీలుడిని ప్రశ్నిమ్చాడు కశ్యపుడు.
*నీలుడికి కావలసింది ఇదే.*
తీర్థయాత్రలంటే కేవలం పుణ్య సంపాదన మాత్రమే కాదు , పాపుల పాపాలను హరించి వారికి మోక్షం ఇవ్వటం కూడా మహాపురుషుల తీర్థయాత్రలలో మర్మం.
కశ్యపుడికి ఉత్తర దేశంలోని తీర్థస్థలాలను వివరిస్తూ ‘మాద్ర’ దేశం అని నీలుడు ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక మర్మం ఇదే.
[8/10, 9:27 PM] Murali: _*నీలమత పురాణం – 10*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కశ్యపుడు భారతదేశంలో ఇతర ప్రాంతాలలో దర్శించిన పుణ్యస్థలాలు , నీలుడు కశ్యపుడికి వినిపించిన పుణ్యక్షేత్రాలు చూస్తుంటే *‘అడుగడుగున గుడి ఉంది’* అన్నమాట ఎంత సత్యమో బోధపడుతుంది. అయితే , అడుగడుగునా ఇన్ని పవిత్ర స్థలాలున్న దైవభూమి పిశాచాల మయం అవటం , రాక్షసుల భయాలకి గురవటం ఆలోచించాల్సిన అంశం.
ఇంత పవిత్రమైన ప్రాంతాలు దుష్టుల బారిన పడటం ఎంతో విచారకరమైనదైనా గమనిస్తే , దానికీ ఏదో ఒక కారణం కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సృష్టితో పోలిస్తే మానవ జీవితకాలం చాలా చిన్నది. లక్షల , కోట్ల సంవత్సరాల లెక్కల ముందు ఒక వంద సంవత్సరాలు సముద్రంలో నీటి చుక్క లాంటివి. కానీ నీటి చుక్క లాంటి జీవితంలో మనిషి లక్షల కోట సంవత్సరాల చరిత్రను ఆవిష్కరించాలి. లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరాలలో దాగి ఉన్న రహస్యాలను గ్రహించాలి. ఇది సాధించాలంటే వంద సంవత్సరాల జీవిత కాలం కూడా సరిగ్గా లేని మనిషి దృష్టి విశాలమవ్వాలి. ఆలోచనలకు అవధి ఉండకూడదు. తన తరువాత కూడా దర్శించగలిగిన దృష్టి ఉన్నవారి తీర్మానాలకు ఉన్న సమగ్రత , తాత్కాలిక అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ణయించే వారికి ఉండదు. ఉదాహరణకు ఎవరో ఏదో పని చేశారనుకుందాం. ఆ పని మంచిది కాదు. *‘దాని ఫలితం చెడుగా ఉంటుంది’* అంటే దానికి ఎవరూ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ చెడు పని చేసిన వాడు సంతోషంగా , సుఖంగా ఉన్నట్టు కనబడుతాడు కాబట్టి. కానీ ఆ పని ఫలితం వెంటనే కనబడకపోవచ్చు. కాని కొన్ని తరాలలో ఆ దుష్ఫలితం అతడు కాకున్నా , అతని వారయినా అనుభవించక తప్పదు అంటుంది కర్మ సిద్ధాంతం. కొన్ని తరాల పాటు వర్తించే కర్మ సిద్ధాంతాన్ని కొన్ని రోజులలో , గంటలలో పరిశీలించి చూసి పనికిరాదని తేల్చడం అజ్ఞానానికి నిదర్శనం , హ్రస్వదృష్టికి తార్కాణం.
జలోద్భవుడు ఉద్భవించిన విధానమే ధర్మవిరుద్ధం. సతీదేవిని చూసి మోహించిన రాక్షసుడి వీర్యం సతీసరోవరంలో పతనమవడం , దాన్ని నాగులు భద్రపరచడం వల్ల ఉద్భవించినవాడు జలోద్భవుడు. పరసతిని మోహించడం , కామించడం , అదుపులేని మోహంతో కూడిన దురాలోచన ఫలితం జలోద్భవుడు. అలాంటి దుష్టపుటాలోచన ఫలితంగా జనించిన వీర్యాన్ని భద్రపరిచి జీవం పోయటం వల్ల ఉద్భవించిన దుష్టుడు జలోద్భవుడు దౌష్ట్యంగా కాక మరో రకంగా ప్రవర్తించడం ఊహ కందని విషయం. అలాంటి దుష్టపుటాలోచన బీజాన్ని భద్రపరిచి జీవం పోసిన కర్మఫలం ఆ ప్రాంతం , అక్కడి నాగులు , అక్కడి ప్రజలు అనుభవించక తప్పదు. కాని ఇదంతా ఒక రోజులో రెండు రోజులో జరిగేది కాదు. అదీగాక ఈ సృష్టిలో ఏ ఫలితానికీ ఏదో ఒకటి కారణం ఉండదు. పలు విభిన్నమైన కారణాల ఫలితం మనకు తెలుస్తుంది. కానీ మన హ్రస్వదృష్టి వల్ల మనం ఒకటో రెండో కారణాలను ఊహిస్తాం. అవీ మెదడుకు అందకపోతే అదీ లేదు. కారణ రహితమైన ప్రపంచం ఇది అని ప్రపంచాన్ని తిట్టిపోస్తాం. అందుకే ఏదైనా ఒక విషయం విశ్లేషించాలంటే ఎంతో అధ్యయనం , విశ్లేషణతో పాటు దార్శనికత అవసరం. వ్యక్తి ద్రష్టలా ఆలోచించడం ఆవశ్యకం.
సతీసరోవరం పరిసర ప్రాంతాలన్నీ జలోద్భవుడి కారణంగా నిర్మానుష్యం అయిపోయాయి. అనేక పవిత్ర స్థలాల సందర్శనంతో పవిత్ర మనస్కుడు , పవిత్ర శరీరి అయిన కశ్యపుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు మంచి చెడుల నడుమ ఘర్షణకు ప్రాతిపదిక ఏర్పడింది. మంచి ఆలోచనకు , దుష్టపుటాలోచనలకు నడుమ ఘర్షణ సందర్భం ఏర్పడింది. ఈ సంఘర్షణను ప్రస్తావించే కన్నా ముందు *‘నీలమత పురాణం’* ప్రస్తావించిన తీర్థ స్థలాలను స్మరించాల్సి ఉంటుంది. ‘నీలమత పురాణం’లో ప్రస్తావించిన కొండలు , నదులు , పవిత్ర స్థలాల గురించి ‘వేద్కుమారి’ పరిశోధించి *“నీలమత పురాణ – ఎ కల్చరల్ అండ్ లిటరరీ స్టడీ ఆఫ్ కశ్మీర్”* లో అనేక అంశాలను పొందుపరిచింది. ఆ అంశాలను స్పృశిస్తూ , ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎందుకంటే , మన పురాణాలను పుక్కిట పురాణాలుగా కొట్టివేస్తారు. కానీ పరిశీలిస్తే ఆ పురాణాలలో అనేక భౌగోళిక అంశాలు లభిస్తాయి. చారిత్రక ఆధారాలు పొందుపరిచి దొరుకుతాయి.
[8/10, 9:27 PM] Murali: _*నీలమత పురాణం – 11*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*యత్తార్మ్యక్షభీత్యా ప్రాప్తానం నాగానాం గుప్తయేధృవమ్।*
*ప్రసారిత భుజాం పృష్ఠే శైల ప్రావార లీలయాం॥*
*విజేయతే పుణ్యబలెర్చతైర్యత్తు న శస్త్రిణామ్।*
నీలమత పురాణం తెలుసుకోవడంలో అడుగు ముందుకు వేసే ముందు ఒక్క నిమిషం ఆగి నీలమత పురాణంలో ప్రస్తావించిన పుణ్యక్షేత్రాలను ఆధునిక సమయంలో గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకు రెండు కారణాలు. ఒకటి నీలమత పురాణం ఎప్పటిదయినా అప్పటికే దేశ భౌగోళిక స్థితిగతులు , విభిన్న ప్రాంతాల గురించిన విజ్ఞానం ఆ కాలంలోనే ఉండేదని అర్థం చేసుకునేందుకు. రెండవది ఇప్పటి ‘దేశం’ అన్న భావన అప్పుడు లేకున్నా ప్రజలంతా *‘ఒకటి’, ‘ఇదంతా మనది’* అన్న భావన ఉన్నదని గుర్తించేందుకు. ఈ రెండు కారణాల వల్ల మనం నీలమత పురాణంలో ప్రస్తావించిన స్థలాలు , నదులు , కొండల వంటి వాటిని గుర్తించాల్సి ఉంటుంది. ముందుగా రాజతరంగిణిలో కల్హణుడు చెప్పిన మాటలను స్మరించుకోవాల్సి ఉంటుంది. నీలమత పురాణం కశ్మీర్ నలువైపులా ఉన్న పర్వతాలను ప్రాకృతికమైన అడ్డుగోడలుగా వర్ణిస్తుంది. శత్రువులు కాశ్మీరంలో అడుగుపెట్టకుండా భగవంతుడు ప్రాకృతికంగా కట్టిన పవిత్రమైన కోటగా భావిస్తుంది. అయితే కల్హణుడి కాలం వచ్చేసరికి తురుష్కులు కశ్మీర్లో అడుగుపెట్టారు. కశ్మీర్ను రూపాంతరం చెందించడం ప్రారంభించారు. వారి ప్రభావం వల్ల కశ్మీర్ జన జీవితంలో మానసిక వ్యవస్థలో ప్రవేశించిన దిగజారుడుతనం , నైతిక విలువల పతనం , పెరుగుతున్న సంకుచితత్వం , తరుగుతున్న ధార్మికత్వం , ప్రవేశిస్తున్న దౌర్బల్యం , భీరుత్వం వంటి వాటిని ప్రత్యక్షంగా చూశాడు. తురుష్కుల సంపర్కం వలన భారతీయ సమాజం ఎలా చిన్నాభిన్నం అవుతుందో గమనించాడు , అవగాహన చేసుకున్నాడు. అయితే భారతీయ ‘ఆత్మ’ను ఎరిగినవాడు కల్హణుడు.
అందుకే నీలమత పురాణానికి భిన్నంగా కశ్మీరు వైపు శత్రువులు కన్నెత్తి చూడలేరు అనలేదు. *“కాశ్మీరును శత్రువులు భౌతిక బలంతో గెలవవచ్చు కానీ ధార్మికంగా , ఆధ్యాత్మికంగా ఎవరు గెలవలేరు”* అన్నాడు. ఒకసారి ఇప్పుడు కశ్మీర్లో జరుగుతున్నది గమనిస్తే కల్హణుడు భారతీయ ఆత్మను ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో స్పష్టం అవుతుంది.
కశ్మీరు తురకల వశం అయింది. అక్కడ పండితుల జీవనం దుర్భరం అయింది. కానీ కశ్మీర్ ప్రజల నడుమ ఉన్న బాంధవ్యం చెదరలేదు. కానీ ఆధునిక రాజకీయాలు అంతర్జాతీయ కుట్రలు కశ్మీర్లో సామాన్యుల నడుమ ఎల్లలు సృజించాయి. సామాన్యులను భీతిభ్రాంతులను చేస్తూ ఆయుధాలు ధరించిన విదేశీ తీవ్రవాదులు తాము ప్రజల స్వరం అయినట్టు ప్రచారం చేసుకున్నారు. పండితులను కశ్మీర్ నుంచి తరిమి వేసి తమ సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. కశ్మీర్ ప్రజలకు భారత దేశంతో కలిసి ఉండడం ఇష్టం లేదంటూ ప్రచారం చేశారు. మన *‘మీడియా’* కూడా దాన్నే ప్రచారం చేసింది. భారతీయ సైన్యంపై రాళ్లు రువ్వుతున్న ప్రజలను పదేపదే చూపిస్తూ దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కాశ్మీరు ప్రజల పట్ల ద్వేషం కలిగేట్టు చేసింది. కశ్మీర్ ప్రజలు భారత్ను ద్వేషిస్తున్నారు వారిని పట్టి ఉంచడం కుదరదన్న భావనను కలుగ చేసింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం దృఢనిశ్చయం ప్రదర్శించిందో , సామాన్యుడికి తీవ్రవాదుల తుపాకుల నుండి రక్షణ కల్పించిందో అప్పుడు తల లోని పేలను ఏరి ఏరి చంపినట్టు తీవ్రవాదుల ఏరివేత జరిగింది. భారతదేశంతో ఆత్మిక సంబంధం అనుబంధం కలిగి మౌనంగా ఉన్న సామాన్య పౌరుల సహాయం లేకపోతే ఈనాడు *‘బారాముల్లా’* తీవ్రవాద రహితం అయ్యేది కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు కశ్మీర్లో శాంతి నెలకొనే వీలుంది. మళ్లీ పండితులు కశ్మీర్లో ప్రశాంత జీవనం సాగించే వీలు కలుగుతుంది. ఇది భారతీయ ఆత్మ స్వరూపం. తుఫాను వచ్చినప్పుడు క్రుంగదు , వంగుతుంది. తర్వాత మళ్ళీ తలెత్తుతుంది. కల్హణుడు చెపుతున్నది ఇదే. భౌతిక బలంతో తాత్కాలికంగా కశ్మీరును అణచవచ్చు కాని ఆధ్యాత్మిక బలంతో కశ్మీర్ తిరిగి తల ఎత్తుకొని నిలబడుతుంది. తుపాకి నీడ తొలగితే అసలు ప్రజల స్వరం వినిపిస్తుంది.
ఇది కాశ్మీర్కే కాదు , సమస్త భారతదేశానికి ఈ దేశానికి ఆత్మ అయిన భారతీయ ధర్మానికి వర్తిస్తుంది. ఇది ఒక సజీవనది. బండ రాళ్ళు అడ్డు వచ్చినప్పుడు వాటిని కోయలేనప్పుడు వంగి పక్కనుంచి ప్రవహిస్తుంది , కానీ దాన్ని కోస్తూ పోతుంది. కొన్నాళ్ళకి బండరాయి కరిగిపోతుంది. నీరు ప్రవహిస్తూనే ఉంటుంది!
నీల మత పురాణం *‘బాహిరిగిరి’ ‘అంతర గిరి’* అన్న రెండు హిమాలయ శ్రేణులను ప్రస్తావిస్తుంది. వీటిని లెస్సర్ హిమాలయాస్ , గ్రేటర్ సెంటర్ హిమాలయాస్ అని ప్రస్తుతం అంటున్నాము. ‘పాలి’ సాహిత్యంలో వీటిని ‘చుల్లా హిమవంత్’, ‘మహా హిమవంత్’ అంటారు. నీలమత పురాణంలో ‘ద్వార్వా’ దేశంలోని ‘ఉశీరక్’ పర్వతం ప్రస్తావన ఉంటుంది. దీన్ని కశ్మీరు దక్షిణాన ఉన్న ‘శివాలిక్’ పర్వత శ్రేణులలో ఒకటిగా భావిస్తున్నారు ఇప్పటికీ దీన్ని ‘ఉశీరగిరి’ అంటారు. పీర్ పంచాల్ పర్వత శ్రేణులని నీలమత పురాణం ‘బ్రహ్మ విష్ణు మహేశ్వర’గా ప్రస్తావిస్తుంది. వీటిల్లో పశ్చిమాన ఉన్న అత్యున్నత శ్రేణి ‘నౌబంధన’ అంటుంది. సకల జీవుల జీవం ఉన్న పడవను విష్ణువు ఈ పర్వతానికే బంధించాడని నమ్మకం.
నీల మత పురాణంలోని ‘హరముక్త్’ పర్వతం ప్రస్తుతం ‘హారముఖ్’ పర్వతం. ఉత్తర మానస సరస్సు , నంది క్షేత్ర , భూతేశ్వర తీర్థాలు ఈ పర్వతానికి ఈశాన్యంలో ఉన్నాయి. ‘మందకోల్- కాళోదర్’ సరస్సులకు నీరందించే హిమానీనదం , నంది పర్వతం , నంది క్షేత్రానికి వెళ్లే వారు దారిలో దర్శించే పర్వతం ‘భరతగిరి’, అమర్నాథ్ పర్వతంపై ఉన్న తీర్థం ‘అమరేశ్వర’. సింధూ లోయకు తూర్పు హిమాలయ శ్రేణుల నడుమ ఉన్న పర్వతం మహాదేవగిరి. నీలమత పురాణంలో ప్రస్తావించిన ఇంద్రకీల , గౌరీ శిఖరాలు , వాటిపై ఉన్న దుర్గ గుడి ప్రస్తుతం శారదాపీఠంకు దగ్గరగా ఉన్న పర్వతాలుగా భావిస్తున్నారు.
నీలమత పురాణంలో కశ్మీర్కు చెందిన 60 నదుల ప్రస్తావన ఉంది. ఇక పవిత్ర స్థలాలకు కొదువే లేదు. నీలమత పురాణంలో ప్రస్తావించిన పవిత్ర స్థలాలు వాటి ప్రస్తుత నామాలు కొన్ని.
సింధూ లోయ నుంచి శ్రీనగర్కు వెళ్లే దారిలో ఉన్న ‘విచార్ నాగ’ గ్రామం , నీలమత పురాణంలోని ‘ఇలాపత్ర నాగ’. ఇప్పటి ‘అచ్చల్’ అప్పటి ‘అక్షిపాల నాగ’. ఇప్పటి ఇస్లామాబాద్ అప్పటి ‘తంత్ నాగ’. ఇప్పటి ‘బీరు’ అప్పటి ‘బహురూప’. ఇప్పటి ‘బుదాబ్రార్’ అప్పటి ‘భేదాదేవి’. గంగోద్భేద తీర్థం ఉన్నది ఇక్కడే. ‘సావాధర్ ధూర్’ అప్పటి చక్రధర తీర్థం. ఇప్పటి ‘చందుల్ సార్’ అప్పటి ‘చంద్రసార’. ఇప్పటి ‘గణేశ బల్’ అప్పటి గణేశ తీర్థం. ఇప్పటి ‘వాగ హోమ్’ అప్పటి ‘హస్తికర్ణ నాగ’. ఇప్పటి ‘రామార దాన్’ అప్పటి ‘ఇష్టికా పథ్’. ఇప్పటి ‘కోథేర్’ గ్రామం అప్పటి ‘కపాలేశ్వర’. బారాముల్లా దగ్గరి ‘కోటీసర్’ అప్పటి ‘కోటి తీర్థం’. త్రాల్ లోయలోని ‘నారాస్తాన్’ అప్పటి ‘నారాయణ స్థానం’. ఇప్పటి ‘పంజా’ అప్పటి ‘పంచ హస్త’. ఇప్పటి ‘పాన్ చక్’ అప్పటి ‘పాండవ తీర్థం’. ఇప్పటి ‘రామూష్’ అప్పటి ‘రామతీర్థం’. ఇప్పటి ‘సూయమ్’ అప్పటి ‘స్వయం భూ’. ఇప్పటి ‘సుందర్ బాల్’ అప్పటి ‘సోదర నాగ’. ఇప్పటి ‘త్రిఫర్’ అప్పటి ‘తిప్రదేశ’. ఇప్పటి ‘విజబ్రూర్’ అప్పటి ‘విజయేశ్వర’.
ఈ రకంగా నీలమత పురాణంలో ప్రస్తావించిన పేర్లను ఇప్పటి స్థలాలుగా గుర్తించడం కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని నిరూపించడమే కాదు , కాశ్మీర్ భారతదేశంలో ప్రత్యేకంగా లేదని , దేశంలోని ఇతర భాగాలతో ధార్మికంగా , రాజకీయంగా , సాంస్కృతికంగా కలిసి ఉందని స్పష్టం అవుతోంది. కాశ్మీరు రాజులు ఇతర ప్రాంతాలపై రాజ్యం చేయడం , కశ్మీర్ కు సరైన రాజు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి రాజులను తీసుకువచ్చి కాశ్మీరు పాలనా బాధ్యతలను అప్పగించడం *‘రాజతరంగిణి’* ద్వారా తెలుస్తుంది. కాబట్టి కశ్మీరు చరిత్రను తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే.
నీలమత పురాణంలో కశ్మీరును కీలకమైన ఘట్టంలో విడిచి మనం పుణ్య స్థలాలను పర్యటించి కశ్మీర్ విహంగవీక్షణం చేశాం. ఇప్పుడు పిశాచాలతో సతమతమవుతున్న కాశ్మీరుకు నీలుడు ఆహ్వానించగా వచ్చిన కశ్యపుడి దగ్గరకు వెళ్దాం. ముందుకు సాగుదాం.
[8/10, 9:27 PM] Murali: *_నీలమత పురాణం – 12_*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*కర్తవ్యోత్ర ప్రతీకారో మయా తీర్థ సమాప్తితః।*
*తీర్థయాత్రామ్ సమాప్తైవ శీఘ్రమేతత్కరో మి తే॥*
నీలుడు కశ్యపుడికి కశ్మీర్ దుస్థితిని వివరించాడు. తాను సంగ్రాముడి పుత్రుడు జలోద్భవుడిని పెంచి పెద్ద చేయడం చెప్పాడు. బ్రహ్మదేవుడి వరాలతో జలోద్భవుడు ఉన్మత్తుడై , అంధుడై ప్రజలను పీక్కు తినడం వివరించాడు. దార్వాభిసార , గాంధార , జుహుందర , అంతరగిరి, బహిర్గిరి వంటి ప్రాంతాలు నిర్మానుష్యమైన విషయం వివరించాడు. విశ్వకళ్యాణం కోసం జలోద్భవుడిని అరికట్టమని ప్రార్థించాడు.
అది విన్న కశ్యపుడు ‘అలాగే’ అన్నాడు. తీర్థయాత్ర ముగించుకున్నాడు. పరిసర ప్రాంతాలలో ఉన్న తీర్థాలన్నింటిలోనూ స్నానం చేశాడు. సతీ సరోవరం చేరాడు. పవిత్ర జలంలో పరిశుద్ధుడయ్యాడు. సతీ సరోవరంలో స్నానం చేసిన తరువాత స్వశక్తితో బ్రహ్మలోకం చేరుకున్నాడు. తనతో పాటు నీలుడిని కూడా తీసుకువెళ్ళాడు.
బ్రహ్మలోకంలో వాసుదేవుడు , ఈశ్వరుడు , అనంతుడు వంటి దేవతలంతా ఆ సమయాన ఉన్నారు. బ్రహ్మతో పాటు అక్కడ ఉన్న దేవతలందరినీ గౌరవించాడు కశ్యపుడు. వారందరికీ జలోద్భవుడి క్రూర చర్యలను , పాశవిక ప్రవృత్తిని గురించి వివరించాడు.
అప్పుడు బ్రహ్మ ఇతర దేవతలందరి వైపు చూసి *“మనందరం సౌబంధనకు వెళ్ళాలి. హరి జలోద్భవుడిని సంహరిస్తాడు”* అన్నాడు.
ఆ మాట వింటూనే హరి తన వాహనాన్ని అధిరోహించాడు. హరుడు నంది వైపు వెళ్ళాడు. బ్రహ్మ హంసను పిలిచాడు. నీలుడు మేఘం ఎక్కాడు. కశ్యపుడు తన అతీంద్రియ శక్తితో ప్రయాణమయ్యాడు.
ఇది విన్న ఇంద్రుడు తనతో ఉన్న దేవతలతో సహా ప్రయాణమయ్యాడు. యముడు , అగ్ని , వరుణుడు , వాయువు , కుబేరుడు , నిరుత్తి, ఆదిత్యులు , వసువులు , రుద్రులు , విశ్వదేవులు , మరుత్తులు , అశ్వినులు , భృగులు , సాధ్య , అంగీరసుడు పుత్రులు , మునులు , యోగులు , గంధర్వులు , అప్సరసలు , దేవతల పత్నులు , దేవతల తల్లులు , విద్యాధరులు , యక్షులు బయలుదేరారు. సముద్రాలు , నదులు అన్ని అక్కడికి ప్రయాణమయ్యాయి.
గంగ మొసలిపై , యమున తాబేలుపై , శతద్రు ఎద్దుపై , సరస్వతి గేదెపై ప్రయాణమయ్యారు. వివిశ గుర్రంపై , ఇరావతి ఏనుగుపై , చంద్రభాగ సింధులు పులిపై సవారీ చేస్తూ వెళ్లారు. దేవిక అడవిదున్న పైన , సరయు లేడి పైన వెళ్ళగా , మందాకిని మహిషిని , పాయోగ్ని మేకను వాహనం చేసుకున్నాయి.
నర్మద నెమలిని , గోమతి హరిణాన్ని , గోదావరి గొర్రెను , కంపన హంసను వాహనం చేసుకున్నాయి. గండకి కొంగను , కావేరి ఒంటెను , సుమతి మొసలిని , పవిత్ర సీత హంసను వాహనంగా చేసుకున్నాయి. లౌషిత్య కొమ్ములున్న లేడిని , వంక్షు వేగంగా పరిగెత్తే పందిని , హ్లాదిని గోరింకను , హాదిని కోడిని , పావని గుర్రాన్ని, సోనా పామును , కృష్ణవేణి మేఘాన్ని , భువన హరిణాన్ని వాహనం చేసుకున్నాయి. ఇవి కాక ఇతర నదులు తమ తమ వాహనాలను అధిరోహించి బయలుదేరాయి.
జలోద్భవుడితో దేవతలకు జరిగే యుద్ధాన్ని దర్శించేందుకు అందరూ ఉత్సాహంతో బయలుదేరారు.
దేవతలంతా సౌబంధన చేరారు.
సంరంభంగా దేవతలంతా రావడం జలోద్భవుడు చూశాడు.
జలోద్భవుడికి తెలుసు – దేవతలు ఎంతమంది ఎన్ని రకాల ఆయుధాలతో వచ్చినా నీటిలో ఉన్నంతవరకు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని. అందుకే సతీ సరోవరం నీటి అడుగుకు చేరాడు. బయటకు రాలేదు.
రుద్రుడు హరి సౌబంధన శిఖరం చేరారు.
దేవతలు అసురులు వారిని అనుసరించారు.
అప్పుడు జలోద్భవుడిని సంహరించే ఉద్దేశంతో జనార్దనుడు అనంతుడితో *“వాడు నీటిలో ఉన్నంతవరకు వాడిని ఎవరూ ఏమీ చేయలేరు. సతీ సరోవరం నీరు బయటకు వెడలేట్టు చేయాలి. హిమాలయాలను ఛేదించు. దాంతో నీరు బయటకు పారుతుంది. నీటి రక్షణ పోవడంతో జలోద్భవుడు బలహీనుడు అవుతాడు. వాడిని సంహరించవచ్చు”* అని అన్నాడు. అతని మాటలు వింటూనే అనంతుడు – స్వయంగా పర్వతమంతటివాడు , వెన్నెల వన్నె కలవాడు – తన శరీరాన్ని పెంచటం ప్రారంభించాడు.
( To be continued........................)
నీలమతపురాణం...కాశ్మి ర్ కు సంబంధించినది by కె.మురళీ కృష్ణ
[8/10, 7:52 PM] Murali: _*నీలమత పురాణం – 1*_చదవండి దీనిలో ఆనాటి చరిత్ర ...సంస్కృతి ..ఆచారాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది ..కల్హణుడి.....రాజతరంగిణి రచన లోని విషయాలు కొన్ని కలుస్తాయి
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
కశ్మీరుకు చెందిన అత్యంత ప్రాచీన పురాణం , *నీలమత పురాణం* తెలుగు అనువాదం. Part1
*శ్రీనివాసం హరిం దేవం వరదం పరమేశ్వరమ్|*
*త్రైలోక్యనాథం గోవిన్దం ప్రణమ్యాక్షరమవ్యయమ్||*
*పరీక్షిద్వంశభృచ్ఛ్రీమాన్ నృపతిర్జనమేజయః|*
*పప్రచ్ఛ శిష్యం వ్యాసస్య వైశంపాయ నమన్తికాత్||*
దైవ ప్రార్థన తరువాత రాజు జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు.
మహాభారతం కథను జనమేజయుడికి వినిపించినది వైశంపాయనుడు. వైశంపాయనుడు వ్యాసమహర్షి శిష్యుడు. జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు. సర్పయాగం తలపెట్టి నిర్వహించి సర్పాలను నాశనం చేస్తున్న జనమేజయుడిని మహర్షులు సర్పయాగం నిర్వహణ నుంచి విరమింపజేస్తారు. ఆ తరువాత వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారత గాథ వినిపిస్తాడు.
*‘నీలమత పురాణమ్’* ఆరంభం ఇది. ఇది జనమేయజుడికి వైశంపాయనుడు వినిపించిన పురాణం.
*అమరకోశం ప్రకారం పురాణానికి నిర్వచనం:*
*”సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశోమన్వంతరాణిచ*
*వంశాను చరితమ్ చేతి పురాణం పంచ లక్షణమ్”*
*‘సర్గ’* అంటే సృష్టి ఆవిర్భావం గురించి వివరించేది. *‘ప్రతి సర్గ’* అంటే ప్రపంచాలు నాశనం అయి తిరిగి సృష్టి సంభవించటం గురించి చెప్పేది. వంశ – వంశావళిని వివరించేది. మన్వంతరం – మను జీవితకాలం మన్వంతరం. వంశానుచరిత అంటే సూర్య , చంద్ర వంశాల వారి వంశవృక్షాలను , వారి చరిత్రను వివరించేది. ఈ అయిదు లక్షణాలు ఉన్నదాన్ని *‘పురాణం’* అంటారు. అయితే , విష్ణు , వాయు , మత్స్య , *భాగవత పురాణాలు* మినహా మిగతా ఏ పురాణం కూడా ఈ నిర్వచనంలో ఒదగదు. నీలమత పురాణం కూడా !
భారతీయ ప్రాచీన వాఙ్మయంతో ఒక సమస్య ఉంది. ఏ రచన కూడా ఈ కాలానికి చెందినది అని ఖచ్చితంగా చెప్పటం కష్టం. *‘కల్హణ రాజతరంగిణి’* ఏ కాలంలో రాసిందో నిర్ణయించడం సులభం. ఎందుకంటే కల్హణుడి జీవితకాలం గురించి అంచనా వేసే వీలుంది. రాజతరంగిణిలో కూడా కల్హణుడు తన జీవితకాలంలో తాను చూసిన విషయాలను ప్రస్తావించాడు. ఆనాటి చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దాంతో రాజతరంగిణి రచన కాల నిర్ణయంలో కష్టం లేదు. కానీ *‘నీలమత పురాణం’* గురించిన ప్రస్తావన రాజతరంగిణిలో ఉంది. కాబట్టి రాజతరంగిణి కన్నా ముందరిది *‘నీలమత పురాణం’* అనడంలో ఎలాంటి సంశయం లేదు. సమస్యల్లా *‘ఎంత ముందరిది ?’* అన్న విషయం దగ్గరే వస్తుంది.
రాజతరంగిణిలో నీలమత పురాణం ప్రస్తావన స్పష్టంగా *‘మూడవ గోవిందుడి’* కాలంలో వస్తుంది. బౌద్ధులు విజృంభించటం వల్ల ప్రాచీన సంప్రదాయాలు , సంస్కారాలు అదృశ్యం అవుతూండటంతో కోపించిన నాగులు కశ్మీరులో మంచు తుఫానులను కురిపిస్తుంటారు. వాటినుంచి ప్రజలను కాపాడేందుకు *‘చంద్రదేవుడు’* అనే వ్యక్తి నాగులను శాంతింపజేస్తాడు. మంచు తుఫానుల బారి నుంచి ప్రజలను రక్షిస్తాడు. అయితే అతడు ఒక నియమం విధింపజేస్తాడు. అదేమిటంటే దేశమంతా నీలమత పురాణాన్ని వ్యాపింపజేయాలి (చూ. ; *‘రాజతరంగిణి’* లో మొదటిభాగం 55 వ అధ్యాయం , శ్లో:182-186: *‘కల్హణ రాజతరంగిణి కథలు’* లో *‘ప్రజా పుణ్యైః సంభవంతి మహీభుజః’* కథ , పేజీ 58-64). దాంతో కశ్మీరులో మళ్ళీ శాంతి నెలకొంటుంది.
*‘రాజతరంగిణి’* ప్రకారం ఈ కథ మూడవ గోవిందుడి కాలంలో జరిగింది. *‘రాజతరంగిణి’* ప్రకారం నీలమత పురాణాన్ని చంద్రదేవుడు రచించాడు. కానీ అంతకు ముందే అమలులో ఉండేది నీలమత పురాణం. ప్రజలు విస్మరించిన సంప్రదాయాలు , సంస్కారాలు , పూజా విధానాలను క్రోడీకరించి చంద్రదేవుడు గ్రంథస్తం చేశాడు. *‘రాజతరంగిణి’* ప్రకారం ఈ కథ లౌకికాబ్దం 1894 లో జరిగింది. భారతీయ కాలమానం ప్రకారం ఈ లౌకికాబ్దాల లెక్కలు తీస్తే ఇది క్రీ.పూ. 1182 వ సంవత్సరం అవుతుంది. ఇక్కడే వస్తుంది సమస్య !
కల్హణుడు ఇచ్చిన తేదీ సరైనదిగా భావిస్తే మొత్తం మనం ఏర్పాటు చేసుకుని , నమ్ముతున్న చరిత్రను తిరగ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తెలుసుకున్న చరిత్ర ప్రకారం గౌతమ బుద్ధుడు పుట్టింది క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో. అది నిజమైతే కల్హణుడు ఇచ్చిన తేదీని ఆమోదించలేము. ఎందుకంటే క్రీ.పూ. 1182 సంవత్సరం నాటికల్లా బుద్ధుడు మరణించి , బౌద్ధం వ్రేళ్ళూనుకుని దేశమంతా విస్తరిస్తోంది. బౌద్ధులు దేశమంతా విస్తరించి సనాతన సంప్రదాయాలపై ఆధిక్యం సాధిస్తున్నారు. *‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’* లాంటి పరిస్థితి ఇది.
కల్హణుడిది ప్రామాణికం అనుకుంటే నీలమత పురాణం క్రీ.పూ. 1182 నాటిది. బుద్ధుడు అంతకు కొన్ని వందల సంవత్సరాలకు ముందు పుట్టి ఉండాలి. బుద్ధుడు క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో పుట్టేడని , అదే నిజమని నమ్మితే *‘నీలమత పురాణం’* క్రీ.పూ కాదు , క్రీ.శ. లోనిదై ఉండాలి. ఎప్పటిదై ఉంటుంది ?
పాశ్చాత్యుల ప్రకారం *‘నీలమత పురాణం’* లోనే బుద్ధుడి జన్మదినాన్ని సనాతన ధర్మానుయాయులు కూడా ఓ ఉత్సవంలా జరుపుకోవటం ఉంది కాబట్టి , క్షేమేంద్రుడు రాసిన *‘అవదాన కల్పలత’* లో కూడా ఈ ప్రస్తావన ఉంది కాబట్టి , క్షేమేంద్రుడి కాలం క్రీ.శ. 900 – 1165 గా తీర్మానించారు కాబట్టి , పాశ్చాత్య లెక్కల ప్రకారం బుద్ధుడు దశావతారాలలో ఒకటి అవడం క్రీ.శ. 1000 సంవత్సరం ప్రాంతంలో జరిగి ఉంటుంది కాబట్టి , నీలమత పురాణం క్రీ.శ. ఆరు , ఏడు శతాబ్దాలలో రచించి ఉంటారని తీర్మానించారు. ఒక దెబ్బతో క్రీ.పూ. 1182 నాటి రచన , క్రీ.శ. 6-7 శతాబ్దాలకు దూకిందన్నమాట.
ఈ లెక్కలలో ఏ లెక్కకూ ప్రామాణికం లేదు. ఏ లెక్కకూ ఆధారం లేదు. అంతా ఊహ. బుద్ధుడు క్రీ.పూ. ఆరవ శతాబ్దం నాటి వాడని తీర్మానించారు కాబట్టి , దాన్ని కేంద్రంగా చేసుకుని మిగతా అన్నింటినీ దాని చుట్టూ తిప్పి ఊహించి నిర్ణయించుకున్నారన్న మాట. అంతే కాదు , క్షేమేంద్రుడి కన్నా నాలుగు , అయిదు వందల సంవత్సరాల క్రితం రాసినదనడానికే ఆధారమూ లేదు. కానీ అలా ఓ తేదీని ఊహించారు , నిర్ణయించారు , ప్రకటించారు. ప్రచారం చేశారు. పదే పదే అంటుంటడంతో అది స్థిరపడింది. ప్రామాణికం అయింది , అంతే తప్ప క్రీ.శ. ఆరు , ఏడు శతాబ్దాల కాలంలో నీలమత పురాణం రచించారనడానికి ఋజువులు లేవు. ఉన్నది కేవలం ఊహ. అంటే మన పూర్వీకులు తమ పుస్తకాలలో పొందుపరిచిన నిజాల కన్నా పాశ్చాత్యుల ఊహలే మనకు ప్రామాణికాలయ్యాయన్నమాటా.
కల్హణుడు చెప్పిన మూడో గోవిందుడిని ఆమోదిస్తాం. నీలమత పురాణాన్ని చంద్రదేవుడు రచించాడన్న దాన్ని ఆమోదిస్తాం. కానీ కల్హణుడు చెప్పిన క్రీ.పూ. 1182 ని మాత్రం ఆమోదించమట. ఎందుకంటే, అది ఆమోదిస్తే పాశ్చాత్యుల తేదీలు , సిద్ధాంతాలు తలక్రిందులు అవుతాయి. అదీ కథ. ఇదెలా ఉంటుందంటే , ఒక రాజు , ఒక పండితుడు దారిలో పోతున్నారట. వారికి మేకలు కాస్తున్నవాడు కనిపించాడు. రాజు ‘వీడేమిటి , గాడిదలు కాస్తున్నాడు?’ అని అడిగాడట. ఇప్పుడు , అవి గాడిదలు కావు , మేకలు అంటే పండితుడి మెడ పోతుంది. అందుకని ‘అవును రాజా… గాడిదలు కాస్తున్నాడేంటి వీడు’ అన్నాడట పండితుడు. దాంతో రాజు అనుమానాలు పటాపంచలయ్యాయి. ఎవరు ఎంత చెప్పినా , చివరికి మేకల యజమాని అవి మేకలు అని అన్నా రాజు ఒప్పుకోలేదు. ఆ పండితుడు ఒప్పుకోలేదు , సైనికులు ఒప్పుకోలేదు. దాంతో ఆ రాజ్యంలో మేకలను గాడిదలనడం ఆనవాయితీ అయ్యిందట. మన చరిత్ర నిర్ణయంలోనూ , తేదీల నిర్ణయంలోనూ ఇదే జరిగింది. ‘ఇది నిజం’ అని నిరూపణ ఉన్న దానిని నమ్మక , *‘నా ఊహ నిజం’* అన్న బలమున్న వాడి ఊహే నిజం అయిందన్న మాట.
వచ్చిన చిక్కు ఏమిటంటే మన వాళ్ళు లెక్కలలో దిట్టలు. పెద్ద పెద్ద ఆధునిక యంత్రాలతో చూసి తెలుసుకుంటున్న విషయాలను వారు తమ మేధ ద్వారా దర్శించి ప్రకటించారు. *‘సమయ గణన’* అందులో ఒకటి. *‘కాల గణన’* లో సెకనులో లక్షవ వంతు వరకూ గణించి నామకరణం చేశారు. ఆకును ఒక సూదితో గుచ్చేందుకు అవసరమయ్యే సమయాన్ని *‘అల్పకాల’* అంటారు.
30 అల్పకాలాలు = 1 తృటి
30 తృటులు = 1 కాలా
30 కాలాలు = 1 కాస్థా
30 కాస్థాలు = 1 నిముష (ఒక మాత్ర)
4 నిముషాలు =1 గణిత
10 గణితాలు = 1 కాతువిర్పు (అంటే నిట్టూర్చే సమయం)
ఇలా ఒక పురాణంలోని *‘కాలమానాన్ని’* చూస్తూ పోతే వారు ప్రతి విషయాన్ని ఎంత సూక్ష్మంగా , ఎంతో తీవ్రంగా , ఎంత లోతుగా విశ్లేషించేవారో తెలుస్తుంది. పైగా వారు ప్రతీ విషయంలోనూ ఖచ్చితంగా ఉండేవారు. ఒక పదాన్ని ఉచ్ఛరించడానికి ఎంత సమయం పడుతుందో లెక్కించి , ఏ కార్యక్రమం ఎంత సమయంలో కావాలో నిర్ణయించేవారు. గ్రహగతుల విషయంలోనూ ఇంతే. దేన్నీ తేలికగా , అల్లాటప్పాగా వదలలేదు. పాయింటు తరువాత పది సున్నాల తరువాత ఒకటి (0.00000000001) కదా అని వదిలేయలేదు. అలాంటి వారు ఇచ్చిన లెక్కలను నమ్ముతామా ?
‘అప్పుడయింది అది అన్నాము కాబట్టి , ఇది ఇంతలో అయిపోవాలి’ అని ఊహ ప్రకారం నిర్ణయించి నిర్ధారించేవారిని నమ్ముతామా ? అంటే మనం ‘ఊహాత్మాక నిర్ధరాణనే నమ్ముతాం’ అంటున్నాం. మన పూర్వీకుల కన్నా మనల్ని బానిసలు చేసినవారిపైనే విశ్వాసం ఉంచుతాం అంటున్నాం.
కాబట్టి *‘నీలమత పురాణం’* ఎప్పటిది , అన్న మీమాంసను పక్కనబెట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. కల్హణుడి ప్రకారం క్రీ.పూ. 1182 అనుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. *‘రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి’* అంటారు. కాబట్టి పురాణాలను పఠించేడప్పుడు పురాణాలను ‘నమ్మి’ ముందుకు సాగాలి. నమ్మకం లేకపోతే ముందుకు సాగినా లాభం లేదు. నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా పురాణాలు చదివితే పురాణం అర్థం కాదు , పైగా అపార్థం అవుతుంది. కాబట్టి *‘నీలమత పురాణం’* అత్యంత ప్రాచీనమైనది. క్రీ.పూ. 1182 కన్నా పాతది అని నమ్ముతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. నమ్మనివారు ఇక్కడే ఆగాల్సి ఉంటుంది. ముందుకు వస్తే అది వారి ఇష్టం ! పూర్వీకులపై విశ్వాసం , గౌరవాలతో ముందుకు సాగుదాం.
కస్తూరి మురళీకృష్ణ గారి నుంచి సేకరణ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Part2
“ప్రపంచాన్ని కదిలించిన మహాభారత యుద్ధంలో కశ్మీరు రాజులు పాల్గొనకపోవటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. జనమేజయుడికి ఈ సందేహం రావటంలో అనౌచిత్యం కానీ , అసందర్భం కానీ ఏమీ లేదు” అంటున్నారు అనువాద రచన లో.
జనమేజయ ఉవాచ !
మహాభారత సంగ్రామే నానా దేశ్య నరాధిపాః ।
మహాశూరాః సమాయాతాః పిత్రూణాం మహాత్మనామ్ ॥
కథం కాశ్మీరికో రాజా నాయాతస్త్రత్ర కీర్తయ్ ।
పాండవైర్ధార్త రాష్ట్రేశ్వ నా వృతః స కథం నృపః ॥
జనమేజయుడు అడుగుతున్నాడు:
“నా పూర్వీకుల నడుమ జరిగిన భారత యుద్ధంలో పాల్గొనేందుకు పలు విభిన్నమైన దేశాల నుండి , గొప్ప వీరులు వచ్చారు. పాల్గొన్నారు. కానీ కశ్మీర రాజులు ఆ యుద్ధంలో పాల్గొన్న సూచనలు లేవు. ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం వహించే కశ్మీరుకు చెందిన రాజులను పాండుపుత్రులు కానీ , ధృతరాష్ట్ర సంతానం కాని ఎందుకని ఎంచుకోలేదు ? ఎందుకని యుద్ధంలో తమవైపు పాల్గొనమని ఈ రెండు పక్షాల వారు కశ్మీర రాజును అడగలేదు ?”
ఇదీ ప్రశ్న !
ఈ ప్రశ్నతో ‘నీలమత పురాణం’ ప్రారంభమవుతుంది.
గమనిస్తే ఈ ప్రశ్నలో ‘మహాభారత యుద్ధం నిజంగా జరిగిందా ? లేదా ?’ అన్న సందేహం లేదు. మహాభారత యుద్ధంలో వారు ఎలాంటి అస్త్రాలు , శస్త్రాలు వాడేరు ? అన్న మీమాంస లేదు. పలు ప్రాంతాల నుండి రాజులు ఆ యుద్ధంలో ఎవరో ఒకరి వైపు నుండి పాల్గొన్నారు. అంటే , భారత ఖండంలో ఆ యుద్ధం ప్రభావానికి గురవని రాజ్యం లేదన్న మాట. ప్రతి రాజ్యం లోనూ ఆ యుద్ధం గురించిన చర్చ జరిగిందన్న మాట. అందుకే జనమేజయుడు యుద్ధం నిజంగా జరిగిందా లేదా ? నిజంగా అక్షౌహిణుల సైన్యం పాల్గొందా ? లేక లేని గొప్పలు చెప్పుకున్నారా ? లాంటి ప్రశ్నలు అడగలేదు. సూటిగా ప్రశ్న అడిగాడు. “మహాభారత యుద్ధంలో కశ్మీరు రాజుని పాండవులు కానీ , కౌరవులు కానీ తమవైపు పాల్గొనమని ఎందుకని అడగలేదు ?”
గమనిస్తే అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం ఏమీ మారలేదు. అప్పుడూ , ఇప్పుడూ కూడా వివిధ పక్షాల వారు కలిసి కూటములు ఏర్పరచటం , మద్దతు సాధించటం , పోరాడటం ఏదో ఒక రూపాన జరుగుతూనే ఉంది. అప్పుడు రాజులు , ఇప్పుడు రాజకీయ పార్టీలు. అప్పుడూ ఇప్పుడూ దేశాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో కూటములుగా ఏర్పడి మద్దతు ఆశించడం , “నువ్వు మా వైపు కాకపోతే మాకు వ్యతిరేకం” అన్నట్టు ప్రవర్తించడం ఉంది. అంటే ప్రపంచం మారినట్టు కనిపిస్తుంది కానీ మారదు. అందుకే ఓ కవి ‘ఈ ప్రపంచం ముఖం పాతదే, కానీ ప్రపంచం కొత్తదిగా కనిపిస్తుంది’ అన్నాడు.
జనమేజయుడి మాటలలో గమనించదగ్గ మాట ఒకటుంది. ‘ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యమైన స్థానం ఆక్రమిస్తుంది కశ్మీరు’ అన్నది. ఈ మాట ప్రకారం కశ్మీరు ప్రాచీన భారతంలో ప్రపంచంలోనే ప్రాధాన్యం వహించిందన్నది స్పష్టమవుతోంది. అయితే కశ్మీర ప్రాధాన్యం పౌరాణికంగా ఏమిటన్నది వైశంపాయనుడు జనమేజయునికి ఇచ్చిన సమాధానంలో వస్తుంది. కానీ వైజ్ఞానికంగా చూసినా ప్రపంచంలో కశ్మీర్ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.
ఒక సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో తొలి మానవుడు ఉద్భవించింది కశ్మీరులోనే. పాశ్చాత్య చరిత్రకారులు , పరిశోధకులు ఆది మానవుడు ఆఫ్రికాలో ఉద్భవించి , యూరప్ ద్వారా ఆసియా వైపు ప్రయాణించాడని నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అలా అయితేనే వారి సిద్ధాంతాలు నిలుస్తాయి. కానీ కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన సెంట్రల్ ఏసియన్ స్టడీస్కు చెందిన పరిశోధకులు , ఆది మానవుడు ఉద్భవించింది కశ్మీర్లోనే అన్న విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. దీనికి ప్రేరణ ‘బూర్జహామ్’ అన్న ప్రాంతంలో తవ్వకాలలో బయటపడ్డ అనేక అంశాలు. ఇక్కడి తవ్వకాలలో ఆది మానవుడు , ముఖ్యంగా , భూమిలో గుంటలు తవ్వి వాటిలో నివసించే మనుషుల అవశేషాలు కశ్మీరులో లభించడం శాస్త్రవేత్తలకీ ఆలోచనను ఇచ్చింది. అంతే కాదు , ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించే విషయం రామాపిథెకస్ , పంజాబికస్ విభాగాలకు చెందిన తొలి *‘హోమోఎరక్టస్’* మానవుడి ఛాయలు కశ్మీరులో లభించినవే అతి ప్రాచీనం అన్నది. అదీగాక భారతీయ ధర్మంలో అతి పవిత్రంగా భావించే అనేకం కశ్మీర్ ఒక్క ప్రాంతంలోనే దొరుకుతాయి. అన్ని ఒకే చోట లభిస్తాయి. శ్రీచక్ర చేప (మత్స్యవతారంగా భావిస్తారీ చేపను), పద్మం, భూర్జర పత్రం , దేవదారు వృక్షం , కేసరి , కస్తూరి , మంచు , శివుడు , నాగులు , మానవ రూపంలోని సర్పాలు వంటి వన్నీ కశ్మీరులో లభిస్తాయి. పౌరాణిక కథ ప్రకారం మానవ జీవుల బీజాలన్నింటినీ రక్షించి తెచ్చిన పడవ గమ్యం కశ్మీరు. అంటే ఏ రకంగా చూసినా , అటు పౌరాణికంగా , ఇటు విజ్ఞానశాస్త్రపరంగా అయినా కశ్మీరు అత్యంత ప్రాధాన్యం వహిస్తుందన్నమాట. ఇక సాంస్కృతికంగా కశ్మీరు ప్రాధాన్యం చెప్పనవసరం లేదు.
ఇంత ప్రాధాన్యం కల కశ్మీరు దేశం ప్రపంచాన్ని కదిలించిన మహాభారత యుద్ధంలో పాల్గొనకపోవటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. జనమేజయుడికి ఈ సందేహం రావటంలో అనౌచిత్యం కానీ , అసందర్భం కానీ ఏమీ లేదు. మహాభారత యుద్ధం జరిగిందా లేదా అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.
చదవక ముందు కాకరకాయ అన్నవాడు చదివిన తరువాత కీకరకాయ అన్నట్టు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం నీడలో వికృతమైన, మూర్ఖపుటాలోచనలకు విజ్ఞానశాస్త్రం ముసుగువేసి , అజ్ఞానాన్ని విజ్ఞానమని భ్రమపెట్టి ప్రజలకు అసలైన విజ్ఞానం సరైన రూపంలో అందకుండా జరుగుతున్న ప్రయత్నాల ప్రభావంతో ఈ రోజు మనల్ని మనమే నమ్మని పరిస్థితి సమాజంలో నెలకొంది
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Part3
మహాభారత యుద్ధంలో పాల్గొనేందుకు కౌరవులు కానీ , పాండవులు కానీ కాశ్మీర రాజును ఎందుకని పిలవలేదన్న సందేహం జనమేజయుడికి వచ్చింది. దానికి వైశంపాయనుడు ఇచ్చిన సమాధానం తెలుసుకునే ముందు మనం అసలు మహాభారత యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది.
మహాభారత యుద్ధం సంభవిస్తుందని నిర్ధారణ కాకముందే కౌరవులు రాజులను తమవైపు కూడగట్టుకునే పని ప్రారంభించారు. పాండవుల వనవాసం ఆరంభం కాగానే కర్ణుడు దిగ్విజయ యాత్ర ప్రారంభించాడు. ఈ యాత్రలో కర్ణుడికి దాసోహం అన్న రాజులందరూ కౌరవుల పక్షాన మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. తాము స్వయంగా యుద్ధంలో పాల్గొనలేని వారు సైన్యాన్ని పంపారు. ఇతర రూపంలో సహాయం అందించారు. వంగ , పౌండ్ర , సుషమ , సింధు , గాంధార , కళింగ వంటి దేశాల రాజులు కౌరవులతో బంధుత్వం ఉండడం వల్ల కౌరవుల తరఫున పోరాడారు. జయద్రధుడు దుస్సలను వివాహమాడడంతో *‘సింధు రాజ్యం’* , దుర్యోధనుడి మొదటి భార్య వల్ల త్రిగర్త , రెండవ భార్య వల్ల కళింగ , గాంధారి వల్ల గాంధారం వంటి దేశాలు కౌరవుల పక్షం వహించాయి.
పాండవుల తరఫున వారి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. ద్రౌపది వల్ల పాంచాల దేశం , అభిమన్యుడి భార్య ఉత్తర వల్ల మత్స్య దేశం , యుధిష్టరుడి భార్య వల్ల శివి దేశం , సహదేవుడి భార్య విజయ వల్ల మాద్ర దేశం , నలుడి భార్య కరేణుమతి వల్ల చేది దేశం , భీముడి భార్య బలాంధర వల్ల కాశి , మరో భార్య హిడింబి వల్ల ఘటోత్కచుడు, ఇతర రాక్షసులు ; అర్జునుడి భార్య ఉలూపి వల్ల నాగులు , కృష్ణుడు , సాత్యకి , పాండ్య రాజులు పాండవుల పక్షం వహించారు.
మహాభారతంలో కౌరవుల సైన్యం ఎంత , పాండవుల సైన్యం ఎంత , ఏయే సైన్యంలో ఎంతమంది సైనికులు ఉండేవారు వంటి విషయాలు విపులంగా ఉన్నాయి. ఒకరకంగా చూస్తే ఈనాడు ఒక పరిశోధకుడు ప్రపంచంలోని అన్ని దేశాల సైనికులను లెక్కించి ప్రకటిస్తే ఎంత సవివరంగా చెప్తాడో , అంత వివరంగా ప్రతీ చిన్న విషయాన్నీ మహాభారతంలో చెప్పటం గమనించవచ్చు. అంటే మన పురాణాలపై పలువురు విమర్శించేట్టు కాకి లెక్కలు , గాలి లెక్కలు చెప్తున్నట్టు కాదన్నమాట.
పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు కాగా కౌరవుల సైన్యం పదకొండు అక్షౌహిణులు. ఒక అక్షౌహిణి అంటే 21,870 గజదళం, 21,870 రథ దళం, 65,610 అశ్వదళం , 109,350 పదాతిదళం.
ఈ లెక్కలు చూస్తే కళ్ళు తిరుగుతాయి.
ఒక అక్షౌహిణి సంఖ్య ఇంత అయితే ఏడు అక్షౌహిణిలు , పదకొండు అక్షౌహిణిల సంఖ్యను లెక్కించడం సులభం.
అసలు అంత సంఖ్యలో ఆ కాలంలో ప్రజలు ఎక్కడున్నారు ? అని వాదిస్తారు కొందరు.
ఇంకో రెండు మూడు వందల ఏళ్ళ తరువాత 21వ శతాబ్దంలో మిలియన్ల సంఖ్యలో ప్రజలుండేవారంటే నమ్మని పరిస్థితులు రావచ్చు. ఇప్పటికే బ్రిటీషు కాలంలో వారు లేబర్ పనికి ఉపయోగించిన భారతీయుల సంఖ్య చూస్తే నమ్మబుద్ధి కాదు. ఇంకా బ్రిటీష్ పాలిత దేశాలకు (కామన్వెల్త్) వలసవెళ్ళి అక్కడే స్థిరపడిన భారతీయుల లెక్క చూస్తే నమ్మటం కష్టం. వంద , రెండు వందల ఏళ్ళ క్రితం లెక్కలే నమ్మ వీలుగా లేకపోతే , క్రీ.పూ. కొన్ని వేల ఏళ్ళ క్రితం నాటి సంఖ్యలు నమ్మశక్యంగా లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ కాస్త ఊహాశక్తిని ఉపయోగిస్తే , భూమి ఆవిర్భావాన్ని , కల్పాలను కోట్ల సంఖ్యలలో లెక్కించిన వారి మేధాశక్తిని నిష్పక్షపాతంగా గమనిస్తే , సెకన్లలో వెయ్యోవంతు కూడా ఖచ్చితంగా లెక్కించి పాటించే వారి పట్టుదల , నిజాయితీలను అర్థం చేసుకుంటే ఈ లెక్కలపై అనుమానాలు జనించవు.
ఇక సైన్యంలో ఒక వీరుడిని అతను ఎంతమందిని మట్టి కరిపించగల శక్తి కలవాడో అన్నదాని ఆధారంగా వర్గీకరించడం కనిపిస్తుంది.
మహారథి అంటే 12 మంది అర్ధరథులతో పోరాడే శక్తి కలవాడు. అతిరథి అంటే 9 మంది రథులతో పోరాడేవాడు. అతిరథ , మహారథులని మనం చాలా తేలికగా వాడతాం. మహారథి కన్నా గొప్ప వీరుడు లేడు. అతడి తరువాత అతిరథి. మహాభారతంలో అశ్వత్థామ , అభిమన్యుడు , లక్ష్మణ కుమారుడు (మాయాబజార్లో జోకర్), ఘటోత్కచుడు లాంటివారు అతిరథులు.
ఇంకా ఏకరథి (8 రథులతో పోరాడేవాడు), రథి (ఇద్దరు అర్ధ రథులతో పోరాడేవాడు), అర్ధరథి (2500 మందితో పోరాడేవాడు) , అతి మహారథి (12 మహారథులతో పోరాడేవాడు) , మహా మహారథి (24 అతి మహారథులతో పోరాడేవాడు) అనే వర్గీకరణలు ఉన్నాయి. ఈ వర్గీకరణ ప్రకారం పాండవ సేనలో కృష్ణుడు *‘అతి మహారథి’*. అర్జునుడు ఇద్దరు మహారథులతో సమానం. భీముడు (ఏకరథి), ధర్మరాజు , నకులుడు , సహదేవుడు , ఉత్తర కుమారుడు (మరో జోకర్) వంటి వారు రథులు.
కౌరవ సేనలో భీష్ముడు , కర్ణుడు , ద్రోణాచార్యుడు , అశ్వత్థామలు మహారథులు. కృతవర్మ, శల్య , కృపాచార్య వంటివారు అతిరథులు. ధుర్యోధనుడు ఏకరథి. శకుని , లక్ష్మణ కుమారుడు , జయద్రధుడు , నీల వంటి వారు రథులు. పాండవుల వైపు వ్యూహ రచయిత శ్రీకృష్ణుడు. కౌరవుల వైపు శకుని. అంటే ఆ కాలం లోని అతిరథ , మహారథులు , వీరులు , రాజ్యాలు అన్నీ దాదాపుగా యుద్ధంలో పాల్గొన్నాయి. రుక్మి, విదురుడు , బలరాముడు మాత్రమే యుద్ధంలో పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయినవారు. ఇలాంటి పరిస్థితిలో కాశ్మీర రాజును కౌరవులు కానీ , పాండవులు కానీ తమ వైపు పాల్గొనమని ఎందుకని అడగలేదన్న ప్రశ్న జనించడం స్వాభావికం.
దీనికి సమాధానం అత్యంత కీలకమైనది. భారతీయ చరిత్రలో , సాంఘికంగా , మానసికంగా , భౌగోళికంగా , ధార్మికంగా కాశ్మీరు ప్రాధాన్యతని స్పష్టం చేస్తుందీ సమాధానం.
*కశ్మీర మండలం చైవ ప్రధానం జగతి స్థితం।*
*కథం నాసౌ సమూహృత స్తత్ర పౌండవకౌరవైః ॥*
*కిం నామాభూత స రాజా చ కాశ్మీరాణాం మహాశయః ।*
*కథం వాసౌ నిశమ్యౌతన్నాయాత శ్చాత్మనా తథా॥*
ఎంతో ప్రాధాన్యం కల కశ్మీరుకి ప్రపంచంలోని దేశాలన్నీ పాల్గొన్న భారతయుద్ధంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఎందుకన్న ప్రశ్నకు సమాధానంగా గతంలో జరిగిన సంఘటనలు చెప్పడం ఆరంభిస్తాడు. ఇక్కడి నుంచి 30వ శ్లోకం వరకూ కశ్మీర చరిత్ర వివరణ ఉంటుంది. ఈ కథను రాజతరంగిణిలో కల్హణుడు నీలమత పురాణం నుండి దాదాపుగా యథాతథంగా వాడినారు.
కశ్మీరును కలియుగారంభంలో మొదటి గోనందుడు అనే రాజు పాలిస్తూండేవాడు. ఈయన యుధిష్టరుడికి సమకాలీనుడు. జరాసంధుడికి సన్నిహితుడు. మధురపై దాడి చేస్తూ జరాసంధుడు , తమకు సహాయంగా రమ్మని గోనందుడిని ఆహ్వానిస్తాడు. మిత్రుడి ఆహ్వానాన్ని మన్నించిన గోనందుడు జరాసంధుడికి సహాయంగా మధురపై దాడికి వెళ్తాడు.
జరాసంధుడు దాడికి వస్తున్నాడని తెలియగానే కృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ యుద్ధంలో ఓడిపోతాడు. ఒక కథ ప్రకారం కృష్ణుడు నగరం వదిలిపోతాడు. చాలా కాలం యుద్ధం కొనసాగుతుంది. అలాంటి పరిస్థితిలో బలరాముడు యుద్ధరంగంలోకి దూకుతాడు. చాలాకాలం యుద్ధం సాగుతుంది. చివరికి యుద్ధంలో గోనందుడు తీవ్రంగా గాయపడతాడు. మరణిస్తాడు. దాంతో జరాసంధుడు ఓటమిని అంగీకరించి వెనుదిరుగుతాడు. కశ్మీర సైన్యం కశ్మీరు చేరుతుంది.
తండ్రి మరణించడంతో *‘దామోదరుడు’* కశ్మీరు రాజవుతాడు. అతడు చక్కగా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. కానీ అతడికి ఆనందం ఉండదు. యుద్ధంలో తండ్రి మరణం అతడిని బాధిస్తూంటుంది. ఇలాంటి పరిస్థితులలో గాంధార రాజు కృష్ణుడిని , అతడి బంధువులను స్వయంవరానికి పిలిచాడని తెలుస్తుంది. ఆ స్వయంవరానికి పెద్ద సైన్యం తీసుకుని దామోదరుడు వెళ్తాడు. అక్కడ కృష్ణుడితో తలపడాల్సి వస్తుంది. కృష్ణుడు అతనిని సంహరిస్తాడు.
ఆ సమయంలో దామోదరుడి భార్య యశోవతి గర్భవతి. కృష్ణుడు యుద్ధంలో విజయం సాధించినా కశ్మీరును ఆక్రమించాలని ప్రయత్నించడు. కశ్మీరుపై ఎలాంటి వ్యతిరేక చర్యలు చేపట్టడు. కశ్మీరు శత్రువుకు మిత్రదేశం. అంటే పరోక్షంగా శత్రుదేశం. అయినా సరే , కృష్ణుడు కశ్మీరును ఆక్రమించాలన్న ఆలోచనను కూడా ప్రదర్శించడు. గర్భవతిగా ఉన్న యశోవతిని కశ్మీరుకు రాణిగా నియమిస్తాడు. తాను గెలిచి సైతం ఓడిన రాజు బార్యకు సింహాసనం అప్పగించిన అతి అపురూపమైన సన్నివేశం ఇది.
ఓడిన శత్రువులను అవమానించి , వాడి భార్యలను తన రాణివాసానికి సేవకులుగా తరలించడమో , వారి సేనలకు భార్యలుగా చేయటమో మాత్రమే తెలిసిన ‘జాతుల’కు కృష్ణుడి ఈ చర్యలోని ఔన్నత్యం అర్థం కాదు. భారతీయ ధర్మంలోని గొప్పతనం బోధపడదు. ఎందుకంటే వారి బుద్ధికి అందని ఔన్నత్యం ఇది. శత్రువును చంపటం , అతడి స్త్రీలను అవమానించటమే ఆధిక్యత అనుకునే ఆత్మన్యూనతా భావంలో మగ్గుతూ , అభద్రతా బావానికి గురయ్యే ఆత్మవిశ్వాసం లేని జాతులకు ఇలాంటి గాథలు కల్పితాలుగా , కట్టుకథలుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ భారతీయులకు ఇలాంటి ఔన్నత్యం , ఔదార్యం , ఉత్కృష్ట వ్యక్తిత్వ ప్రదర్శన సర్వసాధారణం.
ఇంతవరకు *‘నీలమత పురాణం’* లో ఉన్న కథను గ్రహించిన కల్హుణుడు కృష్ణుడు ఎందుకని కశ్మీరును ఆక్రమించలేదో వివరిస్తూ కృష్ణుడితో అద్భుతమైన శ్లోకం చెప్పిస్తాడు.
*కశ్మీరాః పార్వతీ తత్ర రాజాజ్ఞేయో హరాంశజః ।*
*వా వజ్ఞేయస్య దుష్టోపి విదుషా భూతి మిచ్ఛతా ॥*
కశ్మీర భూభాగం పార్వతీమాత. రాజు శివాంశజుడు. అతడు దుష్టుడైనా పరలోక శ్రేయస్సు కోరి రాజును అవమానించరాదు.
ఇదీ భారతీయ ధర్మం. ఇదీ భారతీయాత్మ స్వచ్ఛమైన స్వరూపం.
కశ్మీరు రాజు తనపై కోపంతో ససైన్యంగా వచ్చి స్వయంవరంలో ఉన్న తనతో తలపడి ఓడినా కృష్ణుడికి ఆ రాజుపై ద్వేషం లేదు. రాజ్యంపై కోపం లేదు. రాజు చేసిన నేరానికి ప్రజలను ద్వేషించి వారిని హింసించాలని లేదు.
కశ్మీరు పార్వతితో సమానం. రాజు శివాంశజుడు. ఇంతే కావల్సింది ఆ రాజ్యాన్ని అతని భార్యకు అప్పగించేందుకు.
ప్రపంచంలో ఏ నాగరికతలో కూడా ఇలాంటి అత్యద్భుతమైన ఔన్నత్యం కంచుకాగడా పెట్టి వెతికినా లభించదు.
*‘నీలమత పురాణం’* లో ఈ ఘట్టంలో కేవలం కృష్ణుడికి కశ్మీరుపై ఉన్న పవిత్ర భావన వల్ల రాజ్యాన్ని యశోవతికి అప్పగించాడని ఉంటుంది. ఆ పవిత్ర భావన ఏమిటన్నది కల్హణుడు వివరించాడు రాజతరంగిణిలో (చూ. రాజతరంగిణి కథలు , కశ్మీరాః పార్వతీ కథ).
*తతః స వాసుదేవేన యుద్ధే తస్మిన్నిపాతిత్ః ।*
*అన్తర్వత్నీం తస్య పత్నీం వాసుదేవో అభ్యషేచయత్ ॥*
*భవిష్యత్పుత్ర రాజ్యార్థే తస్య దేశస్య గౌరవాత్ ।*
*తతః సా సుషేవే పుత్రం బాల గోనన్ద సంజ్ఞితమ్ ॥*
ఇదీ నీలమత పురాణంలో ఉంది. నరకుడికి వాసుదేవుడికి జరిగిన యుద్ధంలా దామోదరుడికి , వాసుదేవుడికి నడుమ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాసుదేవుడు దామోదరుడిని సంహరించాడు. కానీ కశ్మీరుపై గౌరవంతో ఆ గర్భవతి అయిన అతని భార్యను రాణిగా నియమించాదు భవిష్యత్తులో ఆ పుత్రుడు రాజవుతాడు. అతడి పేరు గోనందుడు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే – *‘తనది కాని దాని కోసం ఆశ పడకపోవడం’* అన్న ఆధ్యాత్మికత , ధర్మంగా అమలు అవటం. అంతేకాదు , గెలిచిన వాడిది కాదు రాజ్యం. ఓడినా రాజ్యం వారిదే. గెలుపు ఓటములు దైవాధీనాలు. దాన్లో గొప్ప లేదు , కక్ష లేదు. క్రోధం లేదు. ద్వేషం లేదు. ఓడినవాడిపై చులకన భావం లేనే లేదు.
సాధారణంగా , ఆధునిక చరిత్రకారులు , చరిత్ర విశ్లేషకులు భారతదేశంలో రాజులను నీచులుగా , దుష్టులుగా చూపుతారు. భారతీయ మహిళలు వంటింట్లో బందీలయి , సంకెళ్ళలో మ్రగ్గుతూ వ్యక్తిత్వం అన్నది లేనివారని ప్రచారం చేస్తారు. దీనికి తోడు భారత దేశానికి ‘దేశం’ అన్న భావన స్వాతంత్ర్యం తరువాత సంస్థానల విలీనం తరువాతనే వచ్చిందని తీర్మానిస్తారు.
‘నీలమత పురాణం’లో దామోదరుడి మరణం తరువాత శ్రీకృష్ణుడు రాజ్యాన్ని గర్భవతి అయిన యశోవతికి కట్టబెట్టడం చూస్తే పై వాదనలన్ని శుష్క వాదాలనీ , పై పైన చూసేసి , పాశ్చాత్య దేశాల సామాజిక , రాజకీయ , మానసిక వికృతులను భారతదేశానికి ఆపాదించి , మనల్ని మనం తక్కువ చేసుకోవటం తప్పించి మరొకటి కాదని స్పష్టమవుతోంది. ఇది పులి , పిల్లిని చూసి తనని తాను మరచి పిల్లిలా కావడం లాంటిది (చూ. దేశభక్తి కథలు – ‘మన బెబ్బులి’ కథ).
ప్రాచీన కాలం నుంచి భారతీయులకు దేశానికి , ధర్మానికి అభేద ప్రతిపత్తి అనీ ; రాజులు , రాజ్యాలు పోయినా ప్రజల దేశభక్తి అంటే ధర్మభక్తి తప్ప రాజభక్తి , రాజ్య భక్తి కాదని నిరూపించే సంఘటన ఇది. మానవ చరిత్రలో మరపురాని మహత్తరమైన ఘటన ఇది. అలాంటి పార్వతి లాంటి కశ్మీరు ఈనాడు రాక్షసుల్లాంటి తీవ్రవాదుల చేతిలో చిక్కి విలవిలలాడుతోంది.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Part4
“కశ్మీరు పూర్వం సతీసరోవరమన్న సరస్సు అని చెప్తారు కదా… మరి ఆ సరస్సు అదృశ్యమై ఎలా ఇక్కడ భూమి ఏర్పడింది?” అన్న ప్రశ్నకు సమాధానం ‘నీలమత పురాణం – 4’లో లభిస్తుంది.
*బాలభావాత్ పాండుసునైర్నానీతః కౌరవైర్న వా॥* (27)
గోనందుడు బాలుడవడం వల్ల కౌరవులు కానీ పాండవులు కానీ కాశ్మీరరాజును కురుక్షేత్ర యుద్ధంలో తమవైపు పోరాడమని కోరలేదు.
ఇదీ కాశ్మీర రాజ్యం కురుక్షేత్ర మహా సంగ్రామంలో పాల్గొనపోకపోవటానికి కారణం.
*జనమేజయ ఉవాచ:*
*దేశస్య గౌరవం చక్రే కిమర్థం ద్విజసత్తమ।*
*వాసుదేవో మహాత్మా యదభ్యాషిశ్చత్స్యయం ప్రియమ్॥* (30)
అప్పుడు జనమేజయుడు అడిగాడు:
*“ఓ విప్రోత్తమా ! వాసుదేవుడు ఎందుకని కాశ్మీరాన్ని అంతగా గౌరవించాడు ? తాను ఆక్రమించకుండా ఒక స్త్రీని రాజ్యాధికారిని నియమించేటంతగా ఎందుకని గౌరవించాడీ దేశాన్ని ?”*
*ఇది కూడా అడగవలసిన ప్రశ్ననే.*
అందరూ కృష్ణుడిని ద్వేషిస్తారు. అతడిని అవమానించాలని ప్రయత్నిస్తారు. కృష్ణుడితో వైరం పూనుతారు. కానీ ద్వేషించేవారికి పది రెట్లు ఎక్కువమంది కృష్ణుడిని ఆరాధిస్తారు , గౌరవిస్తారు. కాబట్టి కృష్ణుడి ప్రతి చర్యకు కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు ఈ ప్రశ్నవల్ల కశ్మీరు ప్రాశస్త్యం , పవిత్రతలకు కారణాలు తెలుసుకోవచ్చు.
*ఈ ప్రశ్నకు సమాధానం జనమేజయుడు ఆశించినట్టే వస్తుంది.*
*యేషా దేవి ఉమా సైవ కశ్మీరా నృపసత్తమ।*
*అశీత సరః పూర్ణజలం సురమ్యం సుమనోహరమ్॥*
ఉమాదేవిదీ కశ్మీరానిదీ అభేద ప్రతిపత్తి. ఇక్కడ అనేక సుందరమైన సరస్సులు , నదులు ఉండేవి. నిజానికి కాశ్మీరం అంతా ఒకప్పుడు సరస్సుగా ఉండేది.
ఇక్కడి నుంచి కాశ్మీరాన్ని అతి సుందరంగా వర్ణిస్తాడు వైశంపాయనుడు. కాశ్మీరు ప్రజలు ధర్మబద్ధులై యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. సత్యాన్వేషణలో , సాధనలో సమయం గడిపేవారు. వేద వేదాంగాలను అభ్యసించేవారు. క్షత్రియులు వీరులు. వైశ్యులు వ్యాపారదక్షులు. ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు. ఇతరులు కూడా తమ కర్తవ్యాలను సక్రమంగా చిత్తశుద్ధితో నిర్వహించేవారు. అడుగడుగునా మందిరాలతో , పవిత్ర స్థలాలతో కశ్మీరు సర్వాగ సుందరంగా అలరాలేది.
*పృథివ్యాం యాని తీర్థాని తాని తత్ర నరాధిప।*
*ఋష్యాశ్రమ సంసంబాంధం శీతాతాప శుభం సుఖమ్॥*
భూమిపై ఎన్ని తీర్థాలున్నాయో అన్నీ కాశ్మీరులో ఉన్నాయి. ఋష్యాశ్రమాలతో సుందరమైన కశ్మీరు వేసవిలో చల్లగా ఉండి సుఖాన్నిస్తుంది.
శత్రువులతో పరాజయం ఎరుగనిదై , పరాజితమవటం అన్న మాట తెలియకపోవటం వల్ల అందువల్ల కలిగే భయం తెలియనిదై , కరువు కాటకాలు లేకుండా సుఖమయంగా ఉండేది కాశ్మీరు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా పండుగలతో కళకళలాడుతుండేది కాశ్మీరు. దౌష్ట్యం అన్నది లేకుండా పాములు , పులులు , ఎలుగుల వంటి దుష్ట జీవుల జాడ లేకుండా ఉండేది. కాశ్మీరులో మనుషులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఆనందంతో సంబరాలు చేసుకునేవారు. అడుగడుగునా అందమైన వనాలతో , పూదోటలతో , ఆటపాటలతో స్వర్గంలా ఉండేది కశ్మీరు.
*తత్ర నద్యస్తథా పుణ్యాః పుణ్యాన్యపి సరాంసి చ।*
*దేవాలయాః సంపుణ్యాశ్చ తేషాం చైవ తథాశ్రమాః॥*
*కశ్మీర మండలం పుణ్యం సర్వతీర్థమరిందం।*
*తత్ర నాగా హృదాః పుణ్యాస్తత్ర పుణ్యా శిలోశ్చయా॥*
కాశ్మీర మండలం పుణ్యతీర్థాలతో నిండి ఉంది. నాగుల పవిత్ర సరస్సులు , అతి పవిత్రమైన పర్వతాల కాలవాలం కాశ్మీరం. అతి పవిత్రమైన మందిరాలు , వాటి వెంటే ఋష్యాశ్రమాలు ఉంటాయి.
*తన్మధ్యేన చ నిర్యాతా సీమన్తమివ కుర్వతీ।*
*వితస్తా పరమా దేవీ సాక్షాద్విమనగోద్భవా॥*
ఇంత పవిత్రమైన కశ్మీరంలో , తలపై కేశాలను రెండు భాగాలుగా చేస్తూ పాపిట వేసినట్టు , రెండు భాగాలు చేస్తూ హిమాలయాలలో జన్మించిన దేవీ సమానమైన వితస్త నది ప్రవహిస్తోంది.
ఇది విన్న జనమేజయుడికి మరో సందేహం వచ్చింది.
*“కశ్మీరు పూర్వం సతీసరోవరమన్న సరస్సు అని చెప్తారు కదా… మరి ఆ సరస్సు అదృశ్యమై ఎలా ఇక్కడ భూమి ఏర్పడింది ?”* ఇదీ జనమేజయుడి సందేహం. ఇది కూడా అడగాల్సిన ప్రశ్ననే.
ఇప్పుడు భూగర్భశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఎదిగి భూమి ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులు , కదలికలు పరిశోధించి , విశ్లేషించి తెలుపుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా సముద్రంలో మునిగి ఉండేది అని అందుకు నిదర్శనంగా ఆ ప్రాంతంలో కొండలలో ఉన్న రాళ్ళలో శిలాజాలు (fossils), నీటిలో మాత్రమే ఉండగలిగే జీవుల ఆనవాళ్ళను చూపి తీర్మానిస్తున్నది. లేకపోతే గతంలో ఓ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండేదని రాళ్ళపై ఉన్న ఆనవాళ్ళ ద్వారా తేల్చి చెప్తోంది. ఇంకొన్ని ప్రాంతాలలో అగ్నిపర్వతాలు ఉండెవనీ , అక్కడి రాళ్ళన్నీ లావా ఘనీభవించడం వల్ల ఏర్పడినవేననీ చెప్తోంది. ఇలా భూగర్భశాస్త్రం అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఆవిష్కరిస్తుంది.
నీలమత పురాణం రాసిన కాలంలో *‘భూగర్భశాస్త్రం’* ఇప్పుడున్న రూపంలో లేదు. అప్పటి శాస్త్రం వేరు. కానీ ఇన్ని పరిశోధనల తర్వాత భూగర్భశాస్త్రం చెప్పిన విషయాలు ఆనాటి పురాణాలలో కనిపిస్తాయి. అయితే టెర్మినాలజీ వేరు.
ప్రాచీన కాలం నాటి వాఙ్మయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని విశ్లేషించేందుకు ప్రధాన ప్రతిబంధకం సాంకేతిక పదాలు.
ఇప్పుడు మనం పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం ఏర్పాటు చేసిన పేర్లకు అలవాటు పడిపోయాం.
ప్రాచీన కాలంలో పురాణాలు రాసేవారికి భవిష్యత్తులో తాము చెప్పిన అంశాలు భూగర్భ శాస్త్రం పరిధిలోకి వస్తాయని , వాటికి వేర్వేరు పేర్లుంటాయని తెలియదు. భవిష్యత్తు తరాల వారు తమకు తెలిసిన టెర్మినాలజీతో పురాణాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారని వారు ఊహించలేదు. దాంతో పురాణాలలో ఆనాటి ప్రతీకలతో ఆనాటి టెర్మినాలజీతో ఆనాటి పద్ధతి ప్రకారం విజ్ఞానాన్ని పొందుపరిచారు.
జనమేజయుడి ప్రశ్నకు వైశంపాయనుడు చెప్పిన సమాధానం ఆధునిక భూగర్భశాస్త్రం ఆవిష్కరణలతో సరిపోతుంది.
భూగర్భశాస్త్రం ప్రకారం ఒకప్పుడు హిమాలయ ప్రాంతమంతా టెథిస్ అనే సముద్రంతో నిండి ఉండేది. ఇది 70 మిలియన్ సంవత్సరాల నాటి పరిస్థితి. అప్పటికి భూమి ప్లేట్ల (ఫలకల) రూపంలో సముద్రంలో కదులుతూండేది. అలా కదులుతున్న ఇండో – ఆస్ట్రేలియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్లు ఢీకొన్నాయి. ఈ ఇండో - ఆస్ట్రేలియన్ ప్లేట్ విడివడి ఆస్ట్రేలియా ఇండియాగా ఏర్పడ్డాయి. మ్యాన్మార్ లోని అరకన్ యోమా , అండమాన్ నికోబార్ ద్వీపాలు , బంగాళాఖాతం ఈ రెండు ప్లేట్లు ‘ఢీ’ కొనడం వల్ల ఏర్పడ్డాయి. టెథిస్ సముద్రాన్ని ఇండో - ఆస్ట్రేలియన్ ప్లేట్ కప్పేయడం వల్ల యూరేషియన్ ప్లేట్తో ఢీ కొన్నప్పుడు అక్కడున్నవన్నీ మడతలు పడి పైకి తోయబడ్డాయి. అలా ఏర్పడ్డ ముడత పర్వతాలు మంచుతో కప్పబడడం వల్ల హిమాలయ పర్వతాలు అన్నారు. అందుకే హిమాలయాలు పర్వతశిఖరాలపై సముద్రంలో ఉండవలసిన జీవజాలాల ఆనవాళ్ళున్నాయి. దాన్నిబట్టి ఒకప్పుడివన్నీ సముద్రంలో భాగమనీ , రెండు ప్లేట్లు ఢీ వల్ల కలిగిన ఘర్షణ వల్ల పర్వతాలుగా ఏర్పడ్డాయని ఊహిస్తున్నారు. ఈ కదలిక ఇంకా సాగుతోంది. అందుకే ఈ ప్లేట్లు ఢీకొన్న ప్రాంతాలలో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. భూకంపాలు వస్తూంటాయి. ఈ సమయంలో ఏర్పడినవే యూరప్ లోని ఆల్ఫ్స్ పర్వతాలు. ఈ ప్లేట్ల కదలికల శాస్త్రాన్ని *‘ప్లేట్ టెక్నానిక్స్’* అంటారు. పై నుంచి చూస్తే ఆల్ప్స్ పర్వతాలనూ , హిమాలయ పర్వతాలను ఒకే రేఖతో కలపవచ్చని తెలుస్తుంది. అంటే ప్లేట్లు తాకిన అంచువెంబడి పర్వతాలు ఏర్పడ్డాయన్నమాట. ఇప్పటికే ఇండియా ప్లేటు సంవత్సరానికి 67 మి.మీ. చొప్పున కదులుతూ ఆసియా ప్లేట్ వైపు దూసుకుపోతోంది. మరో పది మిలియన్ సంవత్సరాలలో ఇండియా ప్లేట్ ఆసియా ప్లేట్తో ఢీకొంటుంది. ఇప్పటికే జరుగుతున్న కదలికల వల్ల హిమాలయాలు సంవత్సరానికి 5 మి.మీ. ఎదుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అందుకే భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. హిమాలయాలలో హిమనీనదాలు ఉండడం వల్ల , వాటి కదలికల వల్ల కూడా భౌగోళిక స్వరూపం రూపాంతరం చెందుతోంది. ఇంత మంచు కరగడం వల్ల నదులు ఏర్పడ్డాయి , సరస్సులు ఏర్పడ్డాయి.
ఇలాంటి ఒక సరస్సు ప్రస్తుతం కశ్మీరు ఉన్న ప్రాంతంలో ఉండేది. దాన్ని సతీసరోవరం అని అంటూంటారని చెప్తున్నాడు వైశంపాయనుడు. దాని కన్నా ముందు ఆయన చెప్పిన వివరాలు , మనం పైన తెలుసుకున్న భూగర్భశాస్త్రం వివరాలితో పోలిస్తే ‘అద్భుతం’ అనిపిస్తుంది.
*“ఒకప్పుడు సరోవరంగా ఉన్న ఈ ప్రాంతం కశ్మీరంగా ఎలా రూపాంతరం చెందింది?”* అన్న జనమేజయుడికి తిన్నగా సమాధానం ఇవ్వడు.
ఇదే ప్రశ్నని గోనందుడు తీర్థయాత్ర సమయంలో బృహదీశ్వరుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు అని సమాధానం చెబుతాడు.
బృహదీశ్వరుడు – ముందు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళటానికి ఒక నెల పడుతుందని , ఇలాంటి రెండు నెలలు కలిస్తే ఒక ఋతువు అవుతుందనీ , మూడు ఋతువులు ఒక అయనం అవుతుందనీ , రెండు అయనాలు ఒక సంవత్సరం అవుతుందని చెప్తాడు. తరువాత ఇలాంటి నాలుగు లక్షల ముప్ఫయి రెండు వేల సంవత్సరాలు కలియుగం అవుతుందని చెప్తాడు. ఇంతకు రెట్టింపు ద్వాపర , మూడు రెట్లు త్రేతా యుగం , నాలుగు రెట్లు కృతయుగం అని చెప్తాడు. ఇలాంటి 71 చతుర్యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. మన్వంతరం సమాప్తి కాగానే ప్రళయం వస్తుంది , చరాచర సృష్టి అంతా నశిస్తుంది.
*భూర్లోకమాశ్రితాః సర్వా నాశమాయాంతి సర్వథా।*
*ఏకార్ణవం జగత్సర్వం తదా భవతి భూపతే ॥*
సృష్టి లోని సర్వం నశించడంతో , జగత్తంతా ఒక మహాసముద్రం అనిపిస్తుంది.
*శేషం చినశ్యతే సర్వ జంబూద్వీపం విశేషతః।*
*తదా వినష్టె లోకేఽస్మిన్మహాదేవః స్వయం ప్రభు॥*
జంబూద్వీపం పూర్తిగా నాశనమైపోతుంది. అలా నాశనమయ్యే విశ్వాన్ని కాపాడేందుకు సముద్రం నీటిలోకి మహా విష్ణువు స్వయంగా ప్రవేశిస్తాడు.
ఇలాంటి స్థితిలో సతీదేవి నౌక రూపం ధరిస్తుంది. మనువు జీవజాలాలను , బీజాలను ఆ పడవలో ఉంచుతారు. చేప రూపంలో విష్ణువు పడవను తీసుకువెళ్ళి పర్వతాలలో కట్టేస్తాడు. ఆ పర్వతం పేరు నౌబంధనా. ఈ పర్వత దర్శనం అన్ని పాపాలను , భయాలను నశింపజేస్తుంది. అలా ఒక కృతయుగం కాలం తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది.
*విదధాతి ప్రజావర్గే యథాపూర్వమరిందమ్।*
*నౌదేహేన సతీ దేవీ భూమిర్భవతి పార్థివ॥*
*తస్యాం తు భూమై భవతి సరస్తు విమలోదకమ్।*
*షడ్యోజనాయతం రమ్యం తదర్ధేన చ విస్తృతమ్ ॥*
మళ్ళీ సృష్టి ఆరంభమైన తరువాత , నౌక రూపంలో ఉన్న సతీదేవి భూమిగా మారుతుంది. ఆ భూమిపై నిర్మలమైన నీరు గల *‘సతీదేశమ’* నే సరస్సు ఏర్పడుతుంది. ఆరు యోజనాల పొడవు , అందులో సగం వెడల్పు గల అత్యద్భుతమైన ఈ సరస్సులో దేవతలు జలకాలాడతారు.
*ఇలా ఏర్పడిందన్నమాట ‘సతీ సరోవరం’.*
ఈ లెక్కలు , యుగాలు , మన్వంతరాలు , సతీదేవి నౌకా రూపం ధరించడం , నీరు భూమిగా మారటం ఇవన్నీ ఈనాటి వైజ్ఞానిక దృష్టితో చూస్తే హాస్యంగా , అవహేళనార్హంగా అనిపిస్తాయి. కానీ ఇవన్నీ ప్రతీకలు , ఆ కాలం నాటి టెర్మినాలజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పురాణాలు , పౌరాణిక గాథలు ఎంత కట్టుకథలుగా అనిపించినా అవి కట్టుకథలు కావు , గట్టి కథలు అనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకునేందుకు మనం *‘విజ్ఞానం’* గా భావిస్తున్న విజ్ఞానాన్ని దాటి చూడాలనిపిస్తుంది.
భూగర్భశాస్త్రం , 70 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ‘అద్భుతం’గా భావిస్తాం , అదే కలియుగం నాలుగు లక్షల ముప్ఫయి రెండు వేల సంవత్సరాలు , ఇందుకు నాలుగు రెట్లు కృతయుగం అని , 71 చతుర్యుగాలు ఒక మన్వంతరం అని అంటే *‘పుక్కిటి పురాణ లెక్కలు చెప్పకు’,* పొమ్మంటారు. ఇదీ మన దృష్టి.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Part5
నీలమత పురాణంలో కాశ్మీరు ఆవిర్భావానికి సంబంధించిన కథలాంటి కథనే రాజతరంగిణి లోను ఉంది. కొద్ది మార్పులతో ఇలాంటి ఉదంతం ‘మహావంశ’లోనూ , మూల సర్వస్తివాదానికి చెందిన చైనీయుల ‘వినయం’ లోను , హుయాన్త్సాంగ్ ప్రయాణ కథనాలలోనూ ఉంది. వీటన్నిటిలో కాశ్మీరును ఆధునిక భూగర్బ శాస్త్రం ప్రకారం బేసిన్ వంటి ఆకారంలో వర్ణించటం కనిపిస్తుంది.
కాశ్మీరు భౌగోళిక స్వరూపాన్ని గమనిస్తే , కాశ్మీరు నలువైపులా ఎత్తయిన కొండలతో ఒక బేసిన్ లానే అనిపిస్తుంది. ఈ లోయలోని కనిష్ట ఎత్తు సముద్రమట్టం కన్నా 5700 అడుగుల ఎక్కువ. పర్వతాలలోని అతి తక్కువ ఎత్తు పీర్పంజాల్ రేంజ్లో 3000 అడుగులు. ఒకవేళ కాశ్మీరుని ఓ బేసిన్గా ఊహిస్తే , ఈ బేసిన్లో చేరిన నీళ్ళు బయటకు పోయేందుకు *‘బారాముల్లా’* దగ్గర ఉన్న కొండరాళ్ళలోని పగుళ్ళు దారి కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని లోయలో సగభాగం ‘కరెవా’లనబడే చిన్న మట్టి గుట్టలతో నిండి ఉంది. ఈ మట్టి గుట్టల పై భాగం బల్లపరుపుగా ఉంటుంది. ఈ కరెవాలు భూగర్భ శాస్త్రం ప్రకారం ‘ప్లీస్టోసీన్ కాలం’లో ఏర్పడ్దాయి. ఇందులోని మట్టి అంతా ఒక సరస్సులోకి చేరే పదార్థాలతో నిండి ఉంది. అంటే నీటి జీవజాలాల శిలాజాలతో ఈ మట్టిగుట్టలు నిండి ఉన్నాయి. ‘ప్లీస్టోసీన్ కాలం’ అంటే ఒక మిలియన్ సంవత్సరాల నాటి కాలం. భూగర్బ శాస్త్రం పరిశోధన ఫలితాల ప్రకారం ఆ కాలంలో కశ్మీరు ప్రాంతమంతా నీటితో నిండి ఉండేదనీ , పీర్పంజాల్ పర్వతపంక్తుల ఆవిర్భావం వల్ల 5000 చ.కిమీ. ప్రాంతంలొ ఒక సరస్సు ఏర్పడిందని తేలింది. ఈ సరస్సులోని నీరు బారాముల్లా వద్ద ఉన్న రాళ్ళల్లోంచి బయటకు పారిందనీ , నీరు వెళ్ళిపొగా సరస్సు అడుగున మిగిలిన మట్టి గుట్టలే ‘కరెవా’లనీ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.
*కరెవాలు రెండు రకాలు*
సాధారణంగా భూగర్భ శాస్త్రం ప్రకారం సెడిమెంట్లు , అంటే ఒకచోట నిక్షిప్తపరచిన మట్టి , రాళ్ళు , ఇతర పదార్థాల ద్వారా ఏర్పడిన సెడిమెంటరీ శిలలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. వాతిలో కరెవాలు – arenaceous, argillaceous rocks వర్గీకరణలోకి వస్తాయి. అరెనేషియస్ అంటే క్వార్ట్జ్ అధికంగా ఉంటుంది. అర్జిలేషియస్ అంటే బురదమట్టి అధికంగా ఉంటుంది. రెండూ నీటిలోనే ఏర్పడే రాళ్ళు. కెరవాలలో పైన భాగంలో బురదమట్టి , క్రింది భాగంలో అరెనేసియస్ రాళ్ళు ఉన్నాయి. కేశవ్ , రెంబిరా , రోముషు , దూధ్ గంగా , శాలిగంగ , బోన్నాగ్ నాథ్ , నిన్గ్లీ వంటి నదులు ఇక్కడకు తమతో పాటు బోలెడంత సెడిమెంట్లను తెచ్చి వేశాయి. కరెవాలను కోస్తూ వాటి ముక్కలను మోసుకుపోతున్నాయి.
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే , నీలమత పురాణం అమలులోకి వచ్చినప్పుడు భూగర్భ శాస్త్రం , పాశ్చాత్య దేశాలలోనూ ఒక శాస్త్రంగా ఎదగలేదు. వైజ్ఞానిక శాస్త్ర పరిశోధన పద్ధతులు , సూత్రాలు ఏర్పడలేదు. పైగా , ఆధునిక ‘విజ్ఞాన’ శాస్త్ర పరిశోధకులలా ఆనాటి ఋషులు ‘ఫీల్డ్ ట్రిప్’లకు వెళ్ళినవారు కాదు. వారికి ఆధునిక పరికరాలు , యంత్రాలు అందుబాటులో లేవు. కానీ శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా కనుగొన్న విషయాలను వారు తమ పురాణాలలో పొందుపరిచి భావి తరాల వారికి అందించారు. అయితెే వారి కాలంలో భాష వేరు , విషయాన్ని చెప్పే విధానం వేరు. అంశాలను సూచించేందుకు వారు వాడిన పదాలు వేరు. కానీ శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా చెప్పినదీ , ఋషులు పురాణాల్లో కశ్మీరు ఆవిర్భావం గురించి చెప్పినదీ దాదాపుగా ఒకటే.
కశ్మీరు మొత్తం నీటిలో మునిగి ఉండేది. పీర్పంజాల్ పర్వతాల ఆవిర్భావంతో కశ్మీరులో సరస్సు ఏర్పడింది. సరస్సులోని నీరు విడుదలవటం వల్ల కశ్మీర భూమి ఏర్పడింది. ఇక్కడ సరస్సు ఉండిందనేందుకు నిదర్శనాలు కరెవా మట్టి గుట్టలు.
పురాణం ప్రకారం కశ్మీరు అంతా సతీసరోవరమనే సరస్సు ఉండేది. ఆ సరస్సులో జలోద్భవుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడి వల్ల అందరు బాధలు పడుతుండేవారు. కానీ నీటిలో ఉన్నంత కాలం ఆ రాక్షసుడి బలం అధికంగా ఉంటుంది. కాబట్టి కశ్యపుడు నీరు బయటకు వెళ్ళేందుకు మార్గం ఏర్పరిచాడు. దేవతలు రాక్షసుడిని సంహరించారు. కశ్యపుడు ఏర్పరిచిన భూమి కాబట్టి కశ్మీరు అయిందీ ప్రాంతం.
టూకీగా పురాణాలు చెప్పే కశ్మీరు ఆవిర్భావం కథ ఇది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే , కశ్మీరు మొత్తం సరస్సు ఉండేదనీ , నీరు విడుదలవడం వల్ల కశ్మీరు ఏర్పడిందన్నది. టెథిస్ సరస్సు , పీర్ పంజాల్ రేంజ్ , కరెవాలు , అరెనేషియస్ , అర్జిలేషియస్ రాళ్ళు ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర టెర్మినాలజీ. జలోద్భవుడు , రాక్షసుడు , కశ్యపుడు , కశ్యపమేరు – కాశ్మీరు పురాణాల పదాలు.
అయితే నీలమత పురాణం ఎంతో వివరంగా కశ్మీరు ఆవిర్భావం గురించి చెప్తుంది. ఆధునిక ఆర్కియాలజీ పరిశోధనలతో పోలిస్తే , ఈ విషయాలు అత్యంత ఆశ్చర్యకరమైనవిగా అనిపిస్తాయి.
( To be continued.......................)
Blog Archive
-
▼
2020
(195)
-
▼
August
(19)
- కరోనా రోగాన్ని దగ్గరకు రాకుండా తరిమివేసే మహా మంత్ర...
- కరోనా రోగాన్ని తరిమివేసే మహామంత్రం రోజూవినండి.. ka...
- తిరుమల తిరుపతి స్వామివారి ద్వజస్తంభ రహస్యం secret ...
- పసుపుతో ఇంటిలోనే సులభంగాగణపతినితయారుచేసుకొనేవిధం h...
- వినాయక చవితి పూజ ఆడియో ...ఈ లింక్ ద్వారా వింటూ పూజ...
- విష్వక్సేనులవారు ఎవరు?........story about visvaksena
- నీలమతపురాణం. ....6,to12 parts by k మురళీకృష్ణ
- Ashtaadasa sakthi peethalu
- అష్టాదశ శక్తి పీఠాలు ...చూడండి ..తరించండి ..astaad...
- నీలమతపురాణం...కాశ్మి ర్ కు సంబంధించినది by కె.మురళ...
- Just for fun
- శ్రీ కృష్ణాష్టమి విశేషాలు
- శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్యులు లక్ష్మణ యతీంద్ర స్వామివారు
- శ్రీ శ్రీ శ్రీ పరమ పూజ్యులు శ్రీరామభక్తాగ్రేశ్వరుల...
- ప్రతీరోజూ ఈ వేదమంత్రం ఒకేసారి వినండి ఆరోగ్యం ఇస్తుంది
- Problems with pegions
- జామ కాయ గొప్పతనం తెలుసుకోండి nutritional values of...
- ధన్వంతరి నారాయణ స్తోత్రం.....ఆంజనేయ నవరత్నమలాస్తోత్రం
- శ్రీ వేంకటేశ్వరుని లోనే అందరూ వున్నారు ..సర్వం ఆయన...
-
▼
August
(19)
Followers
About Me
- Dr.M muralikrishna