*తిరుమల…
సుప్రభాత గానం.
➖➖➖✍️
దక్షిణభారతదేశం లోని లక్షలాది గృహాలలో, మరీ ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు వారిళ్ళలో దినచర్య నేటికీ సుప్రభాతగాన శ్రవణం తోనే ప్రారంభమవుతుంది.
గృహాలలోనే కాకుండా తిరుమలతో సహా ప్రపంచం నలుమూలలా ఉన్న శ్రీవేంకటేశ్వరుని దేవాలయాల లోను, ఎన్నో హిందూ ధార్మిక సంస్థల్లోను, ప్రసార మాధ్యమాలలో కూడా ఉదయపు వేళల్లో సుప్రభాతగానం చేయబడుతుంది.
కోట్లాదిమంది తెలుగువారు కంఠస్థంగా చెప్పగలిగిన ఆధ్యాత్మిక గీతమేదైనా ఉందంటే అది ముమ్మాటికీ ‘సుప్రభాతం' మాత్రమే. అంతటి ప్రఖ్యాతి గాంచిన సుప్రభాత గానాన్ని శ్రవణానందకరంగా విని, ఆనందించి, భక్తిపారవశ్యంలో మునిగిపోవడమే గానీ ఆ గీత రచయిత ఎవరు? అది ఏ సందర్భంలో, ఎలా రచింపబడింది? దానిలోని భావర్థమేమిటి? అన్న విషయాలు అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈనాటి ప్రకరణంలో ఆ విషయాలను ముచ్చటించుకుందాం…
*సుప్రభాతగానం ఆవిర్భావం:
అర్థసహస్రాబ్దానికి పైగా కోట్లాది భక్తజనులను తన ఆధ్యాత్మిక శోభతో, భావలాలిత్యంతో, వీనులవిందైన ఛందోబద్ధ శ్లోకాలతో పులకింపజేస్తున్న 'సుప్రభాతగానం' ప్రణాళికాబద్ధంగా, ఎంతోకాలం వెచ్చించి వ్రాసినది కాదు. భక్త్యావేశాన్ని తనువెల్లా రంగరించుకున్న ఒక భక్తాగ్రేసరుని గుండె లోతుల్లోంచి అసంకల్పితంగా, ఆశువుగా పొరలి వచ్చిన గానామృతమే 'సుప్రభాతం'.
*మనవాళ మహాముని
దాదాపు ఆరు శతాబ్దాలక్రితం…. ‘మనవాళ మహాముని’ అనే శ్రీవారి మహాభక్తుడుండేవారు. విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన మహామహులలో వీరు కూడా ఒకరు. శ్రీవారి భక్తితత్వ వ్యాప్తికి, హైందవమత సాంప్రదాయం వ్రేళ్ళూనుకోవడానికి ఆ మహనీయుడు సలిపిన విశేషకృషికి గుర్తుగా తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో వారికో ఉపాలయాన్ని నిర్మించి, అందులో నేటికీ నిత్యపూజలు నిర్వహించబడుతున్నాయి.
ఆ ఋషిసత్తముడు, తన ఎనిమిది మంది ప్రముఖ శిష్యులలో ఒకరైన 'హస్తగిరినాథన్' వారితో ఒకసారి తిరుమలకు విచ్చేశారు.
*హస్తగిరినాథన్:
హస్తగిరినాథన్ వారు ప్రఖ్యాత వైష్ణవమత ప్రచారకులు 'ముడుంబైనంబి' వారసులైన అనంతాచారి, ఆండాళ్ పుణ్యదంపతులకు; పధ్నాలుగవ శతాబ్దపు ద్వితీయార్థభాగంలో, కాంచీపురంలో జన్మించారు. ఆధ్యాత్మిక గ్రంథాలెన్నింటినో అలవోకగా పఠించిన హస్తగిరినాథన్ తన అసమానమైన కవితాకౌశలంతో, పాండితీప్రకర్షతో; ఆధ్యాత్మిక చర్చల్లో ప్రతివాదులకు పెనుసవాలుగా నిలిచారు. ఎందరో ఉద్దండ పండితులను తన వాక్ఫటిమతో ఓడించిన 'నరశింహ మిశ్రుడు' అనే అద్వైత పండితోత్తముడిని పరాజయం పాలు గావించి, వారిని తన శిష్యునిగా చేసుకొనడం వల్ల హస్తగిరినాథన్ 'ప్రతివాద భయంకర అణ్ణన్' గా ప్రఖ్యాతి గాంచారు. వారి వంశీయులు ఇప్పటికీ సంగీతసాధనలో తరించుతున్నట్లు కొందరి కథనం.
తెలుగు చలనచిత్రసీమను ఒకానొక సమయంలో తన గానమాధుర్యంతో ఉర్రూతలూగించిన, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ”ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పి. బి. శ్రీ నివాస్)” కూడా అదే వంశనామంతో ప్రఖ్యాతి గాంచడం కేవలం కాకతాళీయం కాకపోవచ్చు.
*ఆమోదముద్ర!
ఆనాడు, శ్రీవేంకటేశ్వరునికి ప్రత్యేకంగా సుప్రభాతం లేదు. ప్రాతఃకాల సమయాలలో ప్రబంధపఠనం మాత్రమే జరుగుతుండేది. ఒకనాటి ప్రాతఃసంధ్యలో గురుశిష్యులిద్దరూ (మణవాళ మహాముని, హస్తగిరినాథన్) స్వామివారి దివ్యమూర్తిని అలౌకిక ఆనందంతో కాంచుతున్నప్పుడు; గురువుగారు భగవత్సంకల్ప ప్రేరితుడై శ్రీనివాసుణ్ణి మేల్కొలుపుతూ ఒక ప్రత్యేక ప్రార్థనాగీతాన్ని ఆలపించ వలసిందిగా తన శిష్యుణ్ణి ఆదేశించారు. వెనువెంటనే ద్వాదశాళ్వారులలో ఒకరైన తొండరడిప్పొడి ఆళ్వార్ శ్రీరంగనాథునిపై రచించిన, అప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉన్న సుప్రభాతం శిష్యుని మదిలో మెదలగా, దానిలోని భావార్థాన్ని వారు స్మరణకు తెచ్చుకున్నారు. గురువు గారి ఆజ్ఞను మహాప్రసాదంగా, అందివచ్చిన అవకాశంగా భావించిన అణ్ణన్ స్వామి, *శ్రీరంగశాయి సుప్రభాత స్ఫూర్తితో 29 శ్లోకాలతో కూడిన శ్రీ వేంకటేశ సుప్రభాతాన్ని, 11 శ్లోకాలున్న శ్రీ వేంకటేశ స్తోత్రాన్ని, 16 శ్లోకాలు గల శ్రీ వేంకటేశ ప్రపత్తిని, 14 శ్లోకాలు గలిగిన శ్రీ వేంకటేశ మంగళాశాసనాన్ని ఇలా మొత్తం నాలుగు భాగాలను ఆశువుగా పఠించాడు.
అప్పటివరకు తమిళభాషలో ప్రబంధపారాయణం జరిగే తిరుమల ఆలయంలో అణ్ణన్ స్వామి సంస్కృతభాషలో రచించిన మేలుకొలుపు గీతాన్ని నిత్యం పఠించే… 'శ్రీ వేంకటేశ సుప్రభాతం' గా అంగీకరించే విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. కానీ భావసౌందర్యం లోను, రాగయుక్తంగా పాడబడడం లోను, ఛందోబద్ధత లోను ఏ విధమైన లోటుపాట్లు కానరాకపోవడంతో; ఎట్టకేలకు 1430 వ సంవత్సరం, శ్రీవీరప్రతాపరాయల వారి పరిపాలనాకాలంలో అణ్ణన్ స్వామి రచించిన గీతం….
'శ్రీ వేంకటేశ సుప్రభాతం' గా ముక్తకంఠంతో ఆమోదించబడింది.
అంటే, నేటికి దాదాపు 590 సంవత్సరాల నుండి సుప్రభాతగానం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోందన్న మాట. తన అమోఘమైన ఆధ్యాత్మిక, సాహిత్య, కవితా, గాన పటిమతో అశేషంగా ఉన్న శ్రీవారి భక్తుల గుండెల్లో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకున్న …
‘అణ్ణన్ స్వామి’ ధన్యజీవి.
సుప్రభాత అంతర్గతమైన ఒక్కొక్క విభాగంలో ఏముందో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం…
*శ్రీ వేంకటేశ సుప్రభాతం:
*'సుప్రభాతం’ అంటే… ‘మంగళకరమైన ఉదయపు వేళ’ అని అర్థం.
వేంకటేశ సుప్రభాతం యొక్క ఇతివృత్తం ముఖ్యంగా శ్రీవారి మేలుకొలుపు గానమే అయినప్పటికీ అందులో వారి అపురూప సౌందర్యం, మంగళకరమైన గుణగణాలు, మహిమలు యొక్క సంక్షిప్త వర్ణన కూడా కానవస్తుంది. శ్రీవారు ముల్లోకాలకు రాజాధిరాజు. రాజులను, మహారాజులను సర్వలాంఛనాలతో మేలుకొలుపే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ శ్రీవారికి, సతీ సమేతంగా, రాజోచిత సత్కారాలతో పాడే మేలుకొలుపే సుప్రభాతగానం.
ప్రభాత సమయంలో ప్రకృతి శోభ; స్వామివారి తొలిదర్శనానికై వేచియుండే బ్రహ్మాదిదేవతల, నవగ్రహాల మరియు సప్తఋషుల కోలాహలం; రామచిలుకలు, తేనెటీగల వంటి అల్పప్రాణులు సైతం విభిన్నరీతుల్లో శ్రీవారికి తెలియజేసే అభినందనలు; శ్రీమహావిష్ణువు దశావతారాలు మున్నగు అంశాలు కూడా సుప్రభాతంలో మనోహరంగా వర్ణించబడ్డాయి.
*శ్రీ వేంకటేశ స్తోత్రం:
'స్తోత్రం' అంటే స్తుతి లేదా పొగడ్త అని అర్థం. శ్రీ వేంకటేశ స్తోత్రంలో శ్రీవారి దశావతారాల మహిమలు; వారి విశ్వవ్యాపకత్వం, సార్వభౌమత్వం, ఆశ్రితజన పక్షపాతం; శ్రీరామచంద్రుని విలువిద్యా కౌశలం మున్నగునవి విస్తారంగా వర్ణించబడ్డాయి.
*శ్రీ వేంకటేశ ప్రపత్తి:
సాధారణంగా, భక్తి ప్రపత్తి అనే మాటలను ప్రత్యాయపదాలుగా ఉపయోగిస్తుంటాం. కానీ రెండింటికీ ఎంతో వ్యత్యాసముంది. భక్తిని 'మర్కటకిశోరన్యాయం' తో పోల్చవచ్చు. అంటే పిల్ల కోతి ఎల్లవేళలా తల్లి ఉదరాన్ని తన కాలి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏ క్షణంలో నైనా పట్టు తప్పితే కోతిపిల్ల ప్రమాదానికి లోనవుతుంది. కోతిపిల్లను భక్తుని తోనూ, తల్లికోతిని భగవంతునితోనూ పోల్చినప్పుడు, 'మర్కట కిశోర న్యాయం' లో భగవంతునిపై విశేషమైన భక్తిభావ మున్నప్పటికీ, వారిని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండే బాధ్యత మాత్రం భక్తునిదే.
కానీ 'ప్రపత్తి' విషయంలో అలా కాదు. ప్రపత్తిని 'మార్జాల కిశోర న్యాయం' తో పోల్చుతారు. తల్లిపిల్లి తన పిల్లను నోటితో కరుచుకుని ఒక చోటి నుండి మరో చోటికి క్షేమంగా చేర్చుతుంది. పిల్లిపిల్ల తన బాధ్యతను పూర్తిగా తల్లిపై వేసి, నిశ్చింతగా ఉంటుంది. అలాగే, భక్తుడు 'ప్రపత్తి' లేదా 'శరణాగతి' ని ఆశ్రయించినప్పుడు తన భారాన్నంతా దేవునిపై వేసి, ఐహిక చింతలకు దూరంగా ఉంటూ, భగవన్నామ స్మరణలో ప్రశాంతంగా గడప గలడన్న మాట.
సంక్షిప్తంగా చెప్పాలంటే 'భక్తి' అంటే భగవంతుణ్ణి ఆరాధించడం;
'ప్రపత్తి' అంటే దేవుని శరణు వేడి భారాన్నంతా వానిపై వేసి నిశ్చింతగా ఉండటమన్న మాట.
'భక్తి' కంటే 'ప్రపత్తి' ని ఉత్తమమైనదిగా భావించి…. ‘అణ్ణన్ స్వామి’ దానినే ఆశ్రయించారు.
శ్రీ వేంకటేశ ప్రపత్తిలో శ్రీనివాసుని పాదపద్మాలే ముల్లోకవాసులందరికి శరణ్యమని; వారి శరణువేడినవారికి మోక్షప్రాప్తి లభిస్తుందని; వారు ఈప్సితాలు ఈడేర్చే కల్పతరువని వర్ణించ బడింది. భక్తులకు శ్రీవారి పాదాలే శరణు కావున, వారి పాదారవిందాలను కూడా ప్రపత్తిలో ‘అణ్ణన్ స్వామి’ విస్తారంగా వర్ణించారు.
*శ్రీ వేంకటేశ మంగళాశాసనం:
'మంగళాశాసనం' అంటే'ఆశీర్వచనము'.
శ్రీవేంకటేశ్వరుడు మానవమాత్రునిగా జన్మించి, అర్చారూపంలో వెలసియుండటం వల్ల వారు కూడా నరదృష్టికి అతీతులు కారు. కావున అతిలోక సౌందర్యంతో వర్థిల్లే వారి దివ్యమంగళ మూర్తికి దృష్టి (దిష్టి) సోకుతుందేమోననే బెంగతో, ‘అణ్ణన్ స్వామి’ శ్రీవారికి ఆశీర్వచనం పలికారు.
వారి శుభచింతనను విని, గగనాన విహరించే తథాస్తు దేవతలు 'తథాస్తు' పలికి, శ్రీవారిని దుష్టశక్తుల నుండి కాపాడతారని అణ్ణన్ స్వాముల ఆకాంక్ష.
అందువల్ల ముల్లోకాలను ఏలే, భక్తజనుల పాలిట కొంగుబంగారమైన శ్రీవేంకటేశ్వరుడు, శ్రీమహాలక్ష్మి కలకాలం వర్థిల్లాలనే ఆకాంక్షను 'మంగళాశాసనం' లో అణ్ణన్ స్వామి వెలిబుచ్చుతారు.
'శ్రీ వేంకటేశ మంగళాశాసనం' 'వరవరముని' అనే మరో భక్తుని ద్వారా రచించబడినదని కొన్ని గ్రంథాల్లో పేర్కొనబడింది. కానీ, అత్యధికులు మాత్రం దీనిని కూడా అణ్ణన్ స్వామివారే వ్రాశారని విశ్వసిస్తారు.✍️
🙏ఓం నమోవేంకటేశాయ🙏
అణ్ణన్ స్వామి అంటే ప్రతివాది భయంకర అణ్ణ0గ రాచార్యులు వారు అని కొందరు పెద్దలు చెబటం విశేషం ఓం నమో వెంకటేశాయ🙏
ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ
*సర్వ0
శ్రీకృష్ణార్పణమస్తు*
లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
0 comments:
Post a Comment