Pages

Vaikunta Ekadasi

🌸ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత ఏమిటి..?🌸

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే 'హరివాసరమ'ని, 'హరిదినమ'ని, 'వైకుంఠ దినమ'ని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం.

 దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును.

 ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.

ఇక ఈ ఆచారాలు ఏమీ చేయలేని వారు ,సమయం లేనివారు ,వృద్ధులు వీరు ఎవరైనా సరే ఓం నమో నారాయణాయ అనే జపం చేసుకోవచ్చు .. శ్రీమన్నారాయణుడి ఫోటో పై ఒక్క నిమిషం మనస్సు అనే తెరపై కళ్ళు మూసుకొని ..మ నస్సు లో కూడా ధ్యానం చేసుకోవచ్చు ..మనస్సు పెట్టకుండా ఆడంబరత్త్వం కాదు ..స్వామి పై భక్తి తో ఒక్క నిమిషం ధ్యానించినా చాలు .శ్రీరాములు వారో ,శ్రీకృష్ణభగవానుడో ..నరసింహస్వామివారో ,హైయగ్రీవుడో...ఏదో ఒక రూపం తో ధ్యానం చేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్లగలిగితే ..ఇంకా మంచిది అక్కడ కూర్చొని కూడా స్వామిరూపాన్ని మనసులోకి తెచ్చుకొని కొద్దిసేపు ధ్యానం చేసినా చాలు .,విష్ణుసహస్రనామాలు వింటూ ఒక్కోక్క పువ్వు లేక తులసీ దళం స్వామి వారి ఫోటో పై వేస్తూ ..చివరలో ఒక పండు లేక ఒక బెల్లం ముక్క స్వామికి అర్పించి ..హారతి ఇవ్వండి చాలు .


.ఏదో ఒక రకంగా భగవంతుని కి దగ్గరగా ,భగవంతుని తో ,ఉన్నాము అనే భావన ఈ పవిత్రమైన పండుగల పరమార్ధం ..ఏమి గుర్తుకు రాకపోతే ఓం నమో వేం కటేశాయా..అని జపం చేసుకోవచ్చు.. గోవిందనామాలు చదువుకోవచ్చు ,శ్రీమద్ భాగవతం పద్యాలు లు చదువుకొని కూడా ఆ శ్రీ మహా విష్ణువును తలుచుకొని ఆనందా మృతం లో మునగవచ్చు ......ఇక జాగారాలు ...ఉపవాసాలు ..ఏకాగ్రత కోసం ఏర్పాటు చేయబడినవి .ఎవరికి ఎంత ఓపిక ,శక్తీ   ఉంటే దానిని బట్టి ఎంతైనా చేసుకోవచ్చు ..

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online