Pages

Shree Lalitha Naamam for Astrological problems

 
 
 
జాతకంలో దోషాలు పోవడానికి లలితా సహస్రనామ స్తోత్రం నుంచి ఒక నామo

భవదావసుధావృష్టిః, పాపారణ్య దవానలా, దౌర్భాగ్యతూలవాతూలా, జరాధ్వన్తరవిప్రభా, భాగ్యాబ్ధిచంద్రికా, భక్తచిత్తకేకిఘనాఘనా, రోగపర్వతదంభోలిః, మృత్యుదారుకుఠారికా"
 
 
 ఈ నామాల గుత్తి ముందు వెనుకా శ్రీ మాత్రే నమః సంపుటితం చేసి (అంటే ముందు శ్రీ మాత్రే నమః అని ఈ ఎనిమిది నామాలు చదివి మళ్ళీ శ్రీ మాత్రే నమః అనాలి)  ఎన్ని మార్లైనా జపించవచ్చు. ఫలితం మాత్రం అమోఘం.

The beautiful story of Madhura Meenakshi - Adi Shankaracharya

 అష్టాదశశక్తి పీఠములలో  మధుర మీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాలనేత్రములతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలము కలగలిపిన మరకత మణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత.

మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్య రాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి"  గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతున్నది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతములోని మూలమూలల నుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించి వేసినది మీనాక్షి.

పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రి వేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా, అపాయం వచ్చినా వారికిక బయటకి వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతై పోవలసిందే!
క్షేత్ర పాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షీ భూతునిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించు కున్నాడా భోళా శంకరుడు.

తన శరీరంలోని అర్ధభాగము అయిన ఈశ్వరుని అవమానపరిస్తే , తనను తాను అవమానపరచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా?   కాలము విచిత్రమైనది. ఏ సమయములో, ఏ ప్రాణికి, ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు. ఎవరి  వంతుకు ఏది వస్తే అది వారు మంచి అయినా, చెడు అయినా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.  

ఆది శంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి పైవిధముగా ఉన్నది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతము పలికి తన అంతఃపురంలో  సకల సేవలు చేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు" నేను మధుర మీనాక్షి ఆలయం లో ఈ రాత్రికి ధ్యానము చేసుకుంటాను అని చెప్పాడు". ఆ మాటలను విన్న పాండ్య రాజు పాదాల కింద భూకంపము వచ్చినంతగా కంపించిపోయాడు."వద్దు స్వామి మేము చేసుకున్న ఏ పాపమో,  ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయములో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్ల బలితీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగము రాని విధముగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయములోకి రాత్రి వేళ అడుగుపెట్టవద్దు .అసలు అంతః పురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. పొరపాటుగా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్య రాజు వేడుకున్నాడు. ఆది శంకరా చార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధాన పరచాడు. 'సన్యాసులకు గృహస్తుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కాని తర్వాత వారు గృహస్తుల గృహాలలో ఉండరాదు. మేము ఆలయములోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానము చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు' అన్నాడు. పాండ్యరాజు హతాశుడైనాడు.

దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువబ్రహ్మచారినిక చూడనేమో అని  పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయము లోనికి తీసుకొనివెళ్లి తిరిగి అంత:పురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆరాత్రి నిద్ర లేదు. ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆ పాపము తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటు ఇటూ పచార్లు చేయసాగాడు. 

రాత్రి అయినది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపములో పద్మాసనము వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానములో కూర్చుండి పోయాడు. మరకతశ్యామ అయిన ఆ తల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటి మధ్య నిలచి సహస్రారములో ఆశీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధా వర్షము కురిపిస్తున్నది.


ఆ సమయము లోనే ఆలయములోని గంటలన్నీ వాటంతట అవే మ్రోగనారంభించాయి. ఆలయములోని అన్నివైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చామూర్తిలో  చైతన్యము వచ్చి అమ్మవారు మెల్లగా పీఠము నుండి లేచి నిల్చున్నది.  పాద మంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ, ధగ మెరుస్తుండగా, ఆమె ధరించి ఉన్న ఎఱ్ఱని రంగు పట్టు చీరె, బంగారు జరీ అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెపుతున్నట్లుగా, కోటి వెన్నెలలు రాసిబోసినట్లున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారము వద్దకు వచ్చి లిప్తకాలము ఆగినది. 


ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలో ఉన్న యువకయోగి ఆమె విశాల నయన దృష్టి పథం లోకి వచ్చాడు.
"ఎవరీతడు? ఈ అద్భుత తేజస్సేమిటి?  నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాలశివుని"లా ఉన్న ఆయోగి ని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి? అని ఆశ్చర్యము కలిగినది.
క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారు మబ్బు వర్ణంలోనికి మారి భయంకర దంష్ట్రా కరాళ వదనంతో, దిక్కులను సైతం మ్రింగివేసే భయంకరమయిన చూపులతో అడుగు ముందుకు వేస్తుంది. మహాకాళీ స్వరూపంలా. 

ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని "మహాలావణ్య  శేవధి" ని కళ్లారా చూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞ రూపంగానే కన్పిస్తుంది. కన్నతల్లి అందమైనదా ? కాదా ? అనుకోరు కదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !

అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేసాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న ఆ తామస మూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. దంష్ట్రా కరాళ వదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తి పారవశ్యానికి అచ్చెరు వొందింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి  ఆశ్చర్యంగా చూచింది. నిజానికీ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్లిపోవలిసిన వాడు. మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? 

అర్ధ నిమీళితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చుని స్తోత్రం చేశాడా యువక యోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువక యోగి లోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలి వస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్త్విక తేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.


ఆహా! తన శక్తి పీఠస్థానము ఎంత అద్భుతముగా చెప్పాడీ యువకుడు? అవును తాను త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ. సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తి రూపిణిగా, పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకములో ఎంత చక్కగా వర్ణించి గుర్తుచేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. 

ఆదిశంకరుల  ముఖకమలము నుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలు తరంగాలుగా ఆమె కర్ణతాటంకాలను దాటి, కర్ణపుటాలను దాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. ఏమిటిది?  ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా! ఏమి పద లాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరము! ఏమి భక్తితత్పరత! ఏమి వర్ణన?
శ్రీచక్ర రాజములోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువక యోగికి కరతలామలకము!  

"ఎవరు నాయనా నీవు ?  నాదారికి  అడ్డుగా కూర్చున్నావేమిటి?  నేనీ సమయములో సంహారకార్యక్రమము  చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలము ఆగానంతే. నీవు తొలగు. నిజానికి నీవీపాటికి నాకు ఆహారము కావలసిన వాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది. అన్నది జగజ్జనని వాత్సల్య పూరిత సుధా దృక్కులతో ఆదిశంకరాచార్యను చూస్తూ.


ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి......" గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తల పంకించింది. "నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లి విరిసి "శుద్ధ విద్యామ్ కురాకార  ద్విజ పంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనము వలన ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీ దేవి వీణ అయిన "కచ్ఛపి"  మధుర నాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది.

నీ స్తోత్రాలకు, నీ భక్తికి మెచ్చాను. నీవు, నీ కవిత్వము చిరస్తాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన అమ్మ వారి స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలము పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నా సంహారకార్యక్రమమును యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరముగా భావించు. అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామస భావ ప్రభావంతో ఉన్న అమ్మవారు.


ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. "బాల్యములో తెలిసీ తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లీ, శంకరుడు నా నామధేయము. దేశాటనముతోనూ, వేదాంతములకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరములు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది గూడా ఎంత కాలం తల్లీ!

కానీ నా  హృదయములో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయినది. అది శల్యం లా నన్ను అప్పుడప్పుడూ  బాధిస్తూ ఉంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధమనోహరముగా నవ్వినది. 

"ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని. నీ తల్లిని, జగజ్జననిని నేనుండగా  నీకేమి కొరత నాయనా! అడుగు నీకోరిక తీర్చి నేను నాసంహార కార్యక్రమమునకు వెళ్లిపోతాను. ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం తరగలేదు.


పసితనపు  అమాయకత్వము వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వినది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నాదా నవ్వు.

"తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రముతో, నీ భక్తితో, నీ వినయముతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలి కదా! నీకు తెలుసో తెలియదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే  ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ      ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానము చెప్పాలి అని. ఆ ప్రశ్నలు లౌకికమైనవు కావు. ఎన్నో వేదాంత రహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావలెనన్న పరోపకార ధ్యేయంతోప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా!  అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యము తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది.


ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసము? లోకకళ్యాణార్ధము. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగము నుండి ఒకానొక కాంతి కిరణము మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడము ఆ తల్లిగమనించలేదు.  ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణ కాలము దివ్యానుభూతికి లోనైనది. "శివా, పరమశివా ! తల్లితో ఆడే ఆటలో పందెముగా  ఏమి
కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వరా! అనుకున్నాడు లోలోపల. అది భావనా రూపము గా పరమ శివుని నుండి అందినది.

"పందేముఏమిటి నాయనా?" అని మరల అన్నది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతడిని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరీశ్వరునికి కూడా తెలియచేయాలి అనే  ఉబలాటము ఆమెలో వచ్చేసింది.  "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణముగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లీ" అన్నాడు శంకరాచార్య. తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేయి అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితా శక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహాత్కీర్తి రావాలని కోర్కె కోరుతాడాని ఉహించినదా తల్లి.

తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై  ఈ సంహార కార్యక్రమం చేయడము నాకు బాధాకరముగా ఉన్నది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమము ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేను నీకు ఆహారము అవుతాను. అన్నాడు దృఢ చిత్తముతో ఆదిశంకరాచార్య.  


జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారముగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాట ప్రకారము నేనీ సంహారకార్యక్రమము ను ఆపేస్తాను, సరేనా! అన్నది. ఆమెలో తాను ఎన్నడు ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగా ఉన్నది. పశుపతినే ఓడించే తనకు ఓటమిరాదు. రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుందనిపెంచేట్లుగా  మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి,  తన సంహారకార్యక్రమమును  కొనసాగించాలి అని  ఆలోచించినది. 

ఆదిశంకరాచార్య వినమ్రముగా  మ్రొక్కాడు. తల్లీ దివ్య మహిమలు గల పాచికలు 
నీవే సృష్టించు. నీవు కోరిన పందెము నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యము నింపు. నేను ఆటలో అన్యాయము ఆడను, అనృతము పలుకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపములో కూర్చోనవసరము లేదు. నీ గర్భ గుడిలోని ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా! అన్నాడు.ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి.  చిన్నవాడివి. నీవు మొదట ఆడడము న్యాయము అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయములో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడూ చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే  నాకు చిన్నతనముగా ఉంటుంది.  మరి మీ ఇష్టము! అన్నది.  సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. 

ఆదిశంకరులు " తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు  ఈ క్షణాన నా  చేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోనికి వచ్చినట్లే కదా! ఈ భావనే నన్ను పులకింపచేస్తోంది. అమ్మా జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది?  మరల మరల ఈ అవకాశము రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడి నైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలము చాలా విలువైనది. మహత్తరమైనది. 

నీ లలితాసహస్రనామము లోని  కొన్ని నామాలు, వాటి అర్ధాలు ఆలోచిస్తూ  ఈ క్షణాలకు ఒక అదుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. అన్నాడు భక్తితో. 

సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింప చేసే అర్ధాలతో ఆ స్తోత్రము మరింత మహాత్వ పూర్ణమవుతుంది. అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.


సంఖ్యా శాస్త్ర ప్రకారము  పావులు కదులుతున్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందమున్నది. అమ్మ వారికి ఆటలో ఆసక్తి హెచ్చినది. ఇరువురి పావులు న్యాయబద్ధముగా కదులుతున్నాయి. "తాటంకయుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తల పంకిస్తోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆది శంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయా విమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు.

తల్లి నవ్వింది. విజయము అంటే విజయము నాదే కదా నాయనా! అన్నది. ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా.    విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వముతో ఉన్న ఆ తల్లి నయనాలలో, చూపులలో ఎరుపుదనము, అహం కనిపించాయి. "విజయము  నాది అయినా, నీది అయినా రెండూ ఒకటే తల్లీ.! నీలో నుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒక నాణేనికి బొమ్మా  బొరుసు లాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి  చివరి క్షణములో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయ రహస్యము. అందుకే నీవు గుప్తయోగినివి. గుప్తతరయోగినివి.  ఆ గోప్యాన్ని తెలుసుకోగలగినవారికి విజయమైనా, పరాజయమైనా ఒకటే కదమ్మా! పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయము ఎంతటి నిరాశను ఇస్తుందో అంతటి పట్టుదలను ప్రసాదిస్తుంది. ఆ పరాజయము ద్వారా పొందిన అవమానము, దైన్యము, దైవము పాదాలను పట్టుకొనేలా చేస్తుంది. ఇది మాత్రము విజయము కాదా తల్లీ! అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవశ్యముతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. గెలుపు ఓటములు, ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితి కి చేరుకున్న ఈ యువకుడు కారణ జన్ముడు. సర్వము బోధించగల సమర్ధ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికి రాగా పైకి అనేసింది. నాయనా! నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రము ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, 
వేదవాణి అయి అలరారుగాక.
"నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధముగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం, మోసము చేయను. గెలుపు, ఓటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ! అని అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాలవద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రి లోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధము చేసాడు. జగన్మాత సంతోషించినది. దివ్యాపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యేంతవరకు  నీ కోరిక మేరకు నేను నా స్థానములో కూర్చుంటాను, అంటూ గర్భగుడి లోనికి వెనక్కి వెనక్కి నడిచింది. ఆ సమయములో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువకయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. ఎంత చిన్న కోరిక కోరాడీ డింభకుడు. ఓడించకూడదు అనే జాలి కూడా కలిగినది. 

పీఠము మీద ఆసీనురాలైన మరుక్షణములో ఆమెలో ఇందాక ఉన్న తామస భావము  మాయమై నిర్మలత్వము వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేటట్లు అనుగ్రహించు. గెలుపు, ఓటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామస శక్తి అన్నది ఆగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధము చేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్ధించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగినది. 

అది ఈశ్వర కటాక్షము అని అర్ధమయినది.


"ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీటజననీ! ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవిత నాలో శ్లోకరూపములో పెల్లుబికివస్తోంది. నీ ఆశీస్సులతో అది కవిత్వముగా  నా హృదయములో రూపుదిద్దుకుంటున్నది. అంటూనే నిర్వాణ షట్కము లోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. 

ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం"
రాచనగరులో తెల్లవారు ఝాము ఆయినందుకు
గుర్తుగా మేలుకొలుపు నగారా మ్రోగుతున్నది. అమ్మవారు తృళ్ళిపడినది. ఈ యువక యోగి మధురవాక్కులలో కాలము ఆగిపోయినది. కాలము వదిగిపోయినది.

తల్లీ! ఇంకా కొద్దిగా ఆట ఉన్నది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. 

విశ్వానికి సాక్షిణి ని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా! అన్నది జగన్మాత అతని నోటివెంట ఆ నామాల అర్ధాలు వినాలనే కుతూహలంతో.


తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలే గదా అమ్మా! సర్వ విశ్వానికి సాక్షిణి వైన నీవు ప్రాణులకు కాలము తీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం  రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించిన సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ! అన్నాడు.

ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒకమాతృ మమత ఈయువకుని చూచినప్పటినుంచి తనలో కలుగుతూనే ఉన్నది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలము వినోదమా! కాదు, కాదు. ఇంకేదో కారణము ఉన్నది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖుని లాగా ఏ జన్మలోనో తన బిడ్డా? 

ఆట పూర్తి కాలేదు ఈ రోజు. సంహార కార్యక్రమము ఆగిపోయినది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మ ముహూర్త కాలము వస్తున్నది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరికాసేపటిలో కాలాన్ని ఖచ్చితముగా అమలుపరిచే సూర్యభగవాను డొస్తాడు. "భానుమండలమధ్యస్థా"  తన స్థానము. ఎంత మార్పు ఒక్క రాత్రిలో. ఈ యువకుడు ఏ మంత్రము వేశాడో! అమాయకత్వముతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేసాడా! తీరా తను ఆట ఒడిపోదుకదా! పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపెయ్యాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీక రించినది. క్షణకాలం భయవిహ్వలతతో చలించిన ఆమె విశాలనయనాలు  చూస్తూ ఆది శంకరులు భక్తిపూర్వకముగా నమస్కరించాడు.

అమ్మవారి కుండలినీ యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రము లోనివి( "పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ")  గానము చేస్తూ పావులు చక చకా కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరత్వరగా పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికలను వేస్తున్నది. 
 
దూరముగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభము అయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయము, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పధానికి మొదటి మెట్టు. "నాయనా! చివరి పందెము నాది. నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. " అవును తల్లీ, భూపురత్రయము, నాలుగు ద్వారాలలోకి వచ్చేశాను నేను కూడా. తొమ్మదవ ఆవరణ చేరాము తల్లీ, నీవు బిందువులో  యధాస్థానములో జగన్మాతగా కూర్చున్నావు. నీవే  గెలిచావు తల్లీ! నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యము ఏమున్నదమ్మా! అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లీ, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది? అన్నాడు.

నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహారకార్యక్రమమును నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోర్కె తీర్చుకొని, పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా! అంది అమ్మవారు. 

అవును తల్లీ! ఆట పరముగా విజయము నీది. కానీ తల్లీ, ఆట వైపు ఒక్క సారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరముగా, అక్షరసంఖ్యా శాస్త్ర పరముగా, మంత్ర శాస్త్రపరముగా గెలుపునాది అన్నాడు శంకరాచార్య దృఢస్వరముతో. అమ్మవారు ఏమిటి? సంఖ్యాశాస్త్రపరముగానా! అన్నది. ఏదీ స్ఫురించని అయోమయస్థితిలో.


"నవావరణములతో కూడిన శ్రీచక్రరూపము. శ్రీచక్రములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీ చక్రము నీదేహమైతే, సహస్రనామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి  నేను ఏర్పరిచిన ఈ శ్రీ చక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీ ఉనికిని, నీవే అర్ధరహితమని నిరూపిస్తావా! అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వము లోకి, తమస్సు లోకి జారిపోదా! అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపము లోనికి దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణరూపిణిగా కొలువై ఉన్నది. అద్భుతముగా తనని శ్రీచక్రములో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు.
గెలుపు తనదా! కాదు కాదు ఆ యువక యోగిదే. 

ఆదిశంకరుడు అమ్మా! నా మీద  ఆగ్రహించకు. ఆగ్రహము వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీ భూతుడు సుందరేశ్వరుడున్నాడు. ఆ పరమశివుని గూడా పిలుద్దాము.  న్యాయనిర్ణయము ఆ స్వామి చేస్తాడు. అప్పుడు చూచినది అమ్మవారు సుందరేశ్వరునివైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది.


ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి  మండపములో  చిత్రించిన ఈ ఆట చిత్రము వరకు నీ  విశాలనయనాల చల్లని దృష్టి సారించు తల్లీ!  తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ!  నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటి కూడా తప్పు పోకుండా ఏకరువు పెడతాను తల్లీ, ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం 
పొల్లు పోదు. తప్పు, తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరిఅయిన బీజాక్షరాలను  చూడు తల్లీ!

నలబై నాలుగు కోణాలు, తొమ్మిది ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆట చిత్రములో చూడు అమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్విక బీజాక్షరాలను సంఖ్యా శాస్త్రపరముగా మలచి, ఏ పొరబాటు రానివ్వకుండా న్యాయబద్ధముగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయము వరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. "అకారాది క్షకారాంత" దేవతా శక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగినీ దేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యా పరముగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్క సారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చన గదా తల్లీ! 

నీ శక్తి పీఠాలలో ప్రతిష్ఠితమైన యంత్రాలలోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్రప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమములో భాగముగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరముగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రము చేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణ ప్రతిష్ట చేసాను. అదే నీ ముందున్న. "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:

"ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్త వైపు  కించిత్ లజ్జ, కించిత్ వేదన తో  బేలగా చూచినది మధుర మీనాక్షి.  ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్రయంత్రాన్ని సర్వ మానవాళికి శ్రేయోదాయకముగా ప్రసాదించాడు. "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీ ఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయములో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరుని రూపము తండ్రిగానూ, తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ "శివ అపరాధ  క్షమాపణ స్తోత్రము"  గంగా ఝురిలా ఉరకలు వేసిందా క్షణములో. 

అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అపుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహము తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వ దేవీ, దేవ గణాలు ఆ స్వామి తీర్పు కోసము ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేసాడు. మధురాపట్టణమంతా  మారు మ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్క సారి కైలాసమే కదిలి వచ్చినది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగాయి. భక్త్యావేశముతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రముతో ఆది శంకరులు స్తోత్రము చేయసాగాడు. ఆయన నోటివెంట సురగంగ మహోధృత జలపాతములా స్తోత్రములు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపములో సాక్షాత్కరించాడు. 

"దేవీ!" అన్నాడు పరమశివుడు.  
మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చుని చేతులు జోడించినది.  ఇప్పుడామె "మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా". తామసము మచ్చుకైనా లేని మమతా పూర్ణ. భర్త ఆజ్ఞ, తీర్పు శిరోధార్యముగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమ శివుడు ఇలా అన్నాడు. దేవీ! నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు.  ఈ ప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నము చేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతులుగ ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని, మంత్ర పూతముగా సిద్ధము చేయాలి. 
అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి, ఏ మలినము అంటని బాల్యములో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారం పొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమ తోనే జయించగల్గాలి.
అందుకే ఆ సమయము కోసము వేచిఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వ శాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితా శక్తి, అతడిని ఆసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసినది. అతి నిరాడంబముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి, పరమశివుడనైన నాకు మాత్రమే తెలుసు. 

కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధ పూరిత ఆలోచనలతో  తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపము సంతరించుకొనేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయములోనే   కావడముతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయినది. వారు పతనమైపోయారు.  బ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపము స్థిరపడిపోయినది.

 లోక కళ్యాణము తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలి తప్ప, భక్షించకూడదు అని ప్రతిజ్ఞ బూనాడు. శక్తి పీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలని ప్రతిష్టించాడు. 
నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వ గృహస్తులకు శ్రేయోదాయకమైనది అని సుందరేశ్వరుడు అన్నాడు. 

అమ్మవారు దిగ్భ్రాంతి పొందినది. ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాల శంకరుడే. భర్త అయిన శంకరుని వైపు, బిడ్డలాంటి బాల  శంకరునివైపు మార్చి, మార్చి చూచినది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనము అయినది. అమ్మవారిముఖములో ప్రశాంతత చోటుచేసుకొన్నది.

*శ్రీగురుభ్యోనమః  అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, ఆదిశంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించినది.ఆ సమయములోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరుని  రంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి ఆదిశంకరాచార్య బలిఅయి ఉంటాడని భయబ్రాంతుడయ్యాడు. రాజుతో పాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయము వైపు పరుగులు తీశారు. ఆ యువక యోగి మరణిస్తే, తాను జీవించి ఉండడము అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి, కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై, ఆలయ ప్రవేశము చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రము చేస్తూ తన్మయత్వములో మునిగి ఉన్న ఆదిశంకరులు ధృగ్గోచరమయ్యారు. 
పాండ్యరాజు "స్వామీ! నీవు జీవించే ఉన్నావా! నన్ను ఘోర నరకములో పడకుండా చేశావా! అంటూ ఆదిశంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. తల్లీ! మరల నీసాత్విక రూపాన్ని కళ్లారా చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించాడు. సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత కలిగిన సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాము. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబము. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. గృహాలలో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతో ఉంటే ఫలితము కలుగుతుంది సుమా!"పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. 

ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోనికి వెళ్లి ప్రతిష్ఠితమైపోయినది. ఆ యంత్రప్రభావము కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యముగా నిక్షిప్తమైనది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతములో మోకారిల్లి, నమస్కరించినపుడు వారి హృదయములో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుందాయంత్రము.
పాండ్యరాజు తన జన్మ సార్ధకమైనదని ఆనందించాడు. 

నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైనది, నీవు కారణజన్ముడవు. మరేదయిన వరము కోరుకో! అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లీ! నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రము లోనూ, మీ స్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగానూ, ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే  వారి జీవితాలు ధన్యమయేట్టు గాను,నాకు ఈ వైరాగ్యము అచంచలముగా కొనసాగి, నా శరీరపతనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు.
అలాగే నాయనా! తథాస్తు అన్నది అమ్మవారు.  తెల్లవారినది. ఆలయములో అమ్మవారు, స్వామి వారు యధాస్థానాలలో అర్చా మూర్తులుగా వెలిశారు. 

శంకరులు చేసిన శ్రీచక్రనమూనాలు  విశ్వకర్మలకు అందాయి. శ్రీవిద్యోపాసకులకు, శ్రీవిద్య పట్ల ఆసక్తి, భక్తి, అకుంఠిత విశ్వాసము ఉన్న వారికి శ్రీచక్రార్చన నియమముగా చేసే వారికి, లలితా సహస్రనామము తప్పులు లేకుండా పారాయణ చేయగా  చేయగా అర్హత సాధించుకున్న వారికి అందుబాటులోకి వచ్చేసాయి.
అమ్మవారి ప్రతిరూపాలుగా గృహాలను, గృహస్తులనూ పావనము చేస్తున్నాయి.
 

Importance of Prayagraj Kumbh Mela

ప్రయాగస్నానమాహాత్మ్యం:
 
 
మామూలురోజులలోనే ప్రయాగలో స్నానానికి 
ఎంతో ప్రాధాన్యతని పురాణాలు తెలుపుతున్నాయి, 
ఇక కుంభయోగంలో చెప్పేదేముంది?

"అశ్వమేధసహస్రాణి వాజపేయశతాని చ।
 లక్షం ప్రదక్షిణా భూమేః కుంభస్నానేన తత్ఫలమ్।।"

"వెయ్యి అశ్వమేధయాగాలు, 
వంద వాజపేయ యాగాలు, 
లక్షసార్లు భూప్రదక్షిణలు చేస్తే ఎంతఫలితమో , 
కుంభస్నానం ప్రయాగలో చేస్తే అంతఫలితమని విష్ణుపురాణవచనం.

"సహస్రం కార్తికే స్నానం మాఘే స్నానశతానిచ।
వైశాఖే నర్మదాకోటిః కుంభస్నానేన తత్ఫలమ్।।"

 
గ్రహాలలో సూర్యుడు, 
నక్షత్రాలలో చంద్రుడు ఎలా శ్రేష్ఠమో, 
తీర్థాలలో ప్రయాగ అలా శ్రేష్ఠమని పద్మపురాణవచనం.
గ్రహాలలో సూర్యుడు, 
నక్షత్రాలలో చంద్రుడు ఎలా శ్రేష్ఠమో, 
తీర్థాలలో ప్రయాగ అలా శ్రేష్ఠమని పద్మపురాణవచనం.

ప్రయాగలోని అక్షయవటదర్శనం చేస్తే 
బ్రహ్మహత్యాది పాతకనాశనం అవుతుందని 
కూడా పద్మపురాణం తెలుపుతోంది.

ప్రయాగతీర్థాన్ని 60వేల ధనుర్ధారులు గంగానదిని, సూర్యభగవానుడు యమునానదిని , 
ఇంద్రుడు ప్రయాగక్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారని మత్స్యపురాణవచనం.

మాఘమాసంలో త్రివేణీసంగమస్నానం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నారదపురాణవచనం.

అందువలన వీలు చేసుకుని , 
పుణ్యాభిలాషులమై , 
దురితక్షయాన్ని కాంక్షిస్తూ ప్రయాగరాజ్ లో స్నానం ఆచరించి సాధుదర్శనం చేసుకుని తరిద్దాం.
 
 

Kumbh Mela and its importance in Puranas

కుంభము అంటే కుండ లేదా కలశము అనిఅర్ధము.
మేళా అంటే కలయిక, కూటమి అనిఅర్ధము. 
ఈ కుంభమేళా గురించి..
భాగవతము, 
మహాభారతము,
రామాయణము,
విష్ణుపురాణము మొదలైన గ్రంధాలలో ఉన్నది.
 
క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా  
ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం :  అలహాబాద్, 
హరిద్వార్, 
ఉజ్జయిని, 
నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయి. 
అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట 
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది.

దీనిని సాధారణ కుంభమేళా అంటారు.

6 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళాన్ని అర్ధకుంభమేళ అని,
12 సంవత్సరాలకు కొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. 

12 పూర్ణ కుంభమేళాలు 
12*12= 144 ఏళ్లకోసారి చేసే కుంభమేళాన్ని మహాకుంభమేళా అంటారు.
 
2025 లో మరలా పూర్ణ కుంభమేళా జరగనుంది
ఇక అర్ధకుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ,యమున, సరస్వతినదుల త్రివేణి సంగమంలో ( అలహాబాద్) ప్రయాగ్ రాజ్ వద్దజరుగుతాయి.

ఈ అర్ధకుంభమేళాకి ఎన్నోలక్షలమంది అఘోరాలు,
సాధువులు స్నానము ఆచరిస్తారు.

*కుంభమేళా_పౌరాణిక_ప్రాశస్త్యం.
స్కందపురాణంలో దీనివర్ణన ఉంది. 
మనకు దేవదానవుల క్షీరసాగరమథనం కథ 
తెలుసు కదా! 

అపుడు ఉద్భవించిన అమృతం కోసం దేవదానవుల నడుమ 12 రోజులపాటు యుద్ధం జరిగింది. 
దేవతలకు 12 రోజులంటే మానవులకు 
12 సంవత్సరములే కదా! 
కుంభపర్వాలు కూడా 12 ఉన్నాయి. 
అయితే మానవులకు 4 , 
దేవతలకు 8 కేటాయించడం జరిగింది. 
అందువలన భూమిపై 4 , 
దేవలోకంలో 8 కుంభపర్వాలు జరుగుతాయని స్కందపురాణవచనం. 
                           
దేవదానవ సంగ్రామ సమయంలో అమృతకుంభాన్ని సూర్యచంద్రులు, గురుడు, శని రక్షించారు. 
చంద్రుడు కలశంనుండి అమృతం బయటకు ఒలకకుండా కాపాడితే , 
సూర్యుడు కలశం పగిలిపోకుండా చూసుకున్నాడట. గురుడు కలశాన్ని రాక్షసులనుండి కాపాడితే , 
శనైశ్చరుడు ఇంద్రునినుండి కలశాన్ని కాపాడాడని స్కందపురాణం ఇలా తెలియజేస్తుంది -
 

" చంద్రః ప్రస్రవణాద్రక్షాం సూర్యో విస్ఫోటనాద్దధౌ ।
  దైత్యేభ్యశ్చ గురూ రక్షాం శౌరిదేవేంద్రజాద్భయాత్।।"

ఏ సమయంలో ఈ గ్రహాలు కలశాన్ని రక్షించాయో 
అప్పటి గ్రహస్థితికి అనుగుణంగా వర్తమాన గ్రహస్థితులలోకి ఆయా గ్రహాలు వచ్చినప్పుడు కుంభయోగం ఏర్పడుతుంది. 

అయితే ఆ అమృతకుంభం నుండి 
కొన్ని అమృతబిందువులు తుళ్ళి నాలుగుచోట్ల పడ్డాయనీ , 
అందువలన అవి పడిన నాలుగుచోట్ల..
 ప్రయాగ,
ఉజ్జయిని,
నాసిక్ మరియు 
హరిద్వార్ లలో కుంభమేళా జరుగుతుందని స్కందపురాణం అంటోంది -

" విష్ణుద్వారే తీర్థరాజేఽవన్త్యాం గోదావరీతటే।
   సుధాబిందువినిక్షేపాత్ కుంభపర్వేతి విశ్రుతమ్।।"
 
 "వెయ్యి కార్తికమాసస్నానాలు గంగలో చేసిన ఫలితం, వందమాఘమాసస్నానాలు గంగలో చేసినఫలితం , వైశాఖమాసస్నానాలు కోటిమారులు నర్మదా నదిలో చేసినఫలితాన్ని ఒక్కమారు కుంభస్నానంతో మానవుడు పొందుతాడని స్కందపురాణవచనం
 

Kumbh Mela and its important days

*కుంభస్నానం మరియు దాని విశిష్టత..!!*

జనవరి 15 వతేదీ నుండి ప్రయాగరాజ్ లో జరిగే కుంభమేళా గురించి , దాని ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాము.
                        
దక్షిణాదిన మనందరకూ పుష్కరాలు , పుష్కరస్నానాలు , ఏయేనదులలో ఎప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసు కానీ ఈ కుంభస్నానాలనేవి కేవలం ఉత్తరదేశపు తీర్థాలకే సొంతం. 
           
ఈ కుంభస్నానాలు..
ప్రయాగ, 
ఉజ్జయిని, 
నాసిక్ మరియు 
హరిద్వార్ లలో జరుగుతాయి.

మనవైపు పుష్కరాలు గురుగ్రహం యొక్క సంచారం లో ఒక్కొక్క రాశిప్రవేశంతో ప్రారంభమౌతాయి. 12రోజులవరకూ కొనసాగుతాయి. 

అయితే ఈ కుంభస్నానాలు పైన పేర్కొన్న 4 చోట్ల ఖగోళీయ గ్రహగతుల ఆధారంగా ప్రారంభమౌతాయి. పుష్కరస్నానాలకు గురుచారం ఒకటే ప్రాతిపదిక అయితే , 
ఈ కుంభస్నానాలకు గురుచారంతోబాటు రవి,చంద్రుల సంచారం కూడా ప్రాతిపదికగా తీసుకుని స్నానతేదీలను నిర్ణయిస్తారు. 

*ప్రయాగలో..కుంభస్నాన..నిర్ణయం:💐*

మేషరాశింగతే జీవే మకరే చంద్రభాస్కరౌ ।
అమావాస్యా తదాయోగః కుంభాఖ్యస్తీర్థనాయకే ।।
                                             - స్కందపురాణం.
"గురుడు మేషరాశిలో ఉండి రవి,చంద్రులు మకరరాశిలో ఉన్నపుడు అమావాస్య నాడు కుంభయోగం ఏర్పడుతుంది."

అలా ఏర్పడిన తరువాత, మకరసంక్రమణం నాడు మొదటి షాహీస్నాన్ తో కుంభస్నానాలు ప్రారంభమౌతాయి. 
                       
 మకరసంక్రమణం నాడు ప్రయాగలో కుంభమేఅర్ధకుంభ్ . ప్రధాన కుంభమేళా 12 సం.కు ఒకసారి వస్తుంది. 
మధ్యలో 6 సం.కు ఒకసారి అర్ధకుంభ్ ని నిర్వహించాలని కొన్ని శతాబ్దాలక్రితమే సాధు-సంత్ ల మండలి నిర్ణయం తీసుకుంది. 
అయితే ఈ అర్ధకుంభ్ కేవలం ప్రయాగ, హరిద్వార్ లలో మాత్రమే జరుగుతుంది. 
ఆయాచోట్ల ప్రధాన కుంభయోగానికి సరిగ్గా 6 సం.కు అర్ధకుంభ్ జరుపుతారు. 
అందువలన 2013 లో కుంభ్  జరిగాక , 
2019 లో అర్ధకుంభ్ జరుగుతోంది. 
అర్ధకుంభ్ నకు ఖగోళగ్రహగతులతో సంబంధం లేదు. ప్రధాన కుంభమేళాజరిగాక 6 సంవత్సరాలవ్వాలి  అంతే. 

అర్ధకుంభమేళా, 
పూర్ణకుంభమేళా, 
సాధారణ కుంభమేళా గురించి క్లుప్తముగా..💐

*అర్ధకుంభమేళా.💐*
2019 జనవరి 15 మంగళవారం సంక్రాంతి నుండి 
49 రోజులపాటు మార్చి 4 మహాశివరాత్రి వరకు జరుగును.

 
 
క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా  
ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం :  అలహాబాద్,హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయి. 
అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట 
ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది.

దీనిని సాధారణ కుంభమేళా అంటారు.

6 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళాన్ని అర్ధకుంభమేళ అని,
12 సంవత్సరాలకు కొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. 

12 పూర్ణ కుంభమేళాలు 
12*12= 144 ఏళ్లకోసారి చేసే కుంభమేళాన్ని మహాకుంభ
మేళాఅంటారు.

2025 లో మరలా పూర్ణ కుంభమేళా జరగనుంది.
అలాగే ప్రతి సంవత్సరము కొన్ని పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి.

గురుడు ఏరాశిలో ప్రవేశిస్తే  ఆనదికి పుష్కరము వస్తుంది. 
పుష్కరము అంటే 12 సంవత్సరాలు అనిఅర్ధము.

ఈసారి గురుడు ధను రాశిలో ప్రవేసిస్తున్నాడు. 
కనుక 2019 నవంబర్ 5 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నదికి అనగా పుష్కరవాహిని నదికి పుష్కరాలు ప్రారంభము అగును.

ఇక అర్ధకుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ,,యమున, సరస్వతినదుల త్రివేణి సంగమంలో ( అలహాబాద్) ప్రయాగ్ రాజ్ వద్దజరుగుతాయి.

ఈ అర్ధకుంభమేళాకి ఎన్నోలక్షలమంది అఘోరాలు,
సాధువులు స్నానము ఆచరిస్తారు.

కుంభమేళాలో ముఖ్యమైన రోజులు :

జనవరి 15 మంగళవారం రాజ స్నానము.

జనవరి 21 సోమవారం పుష్య పౌర్ణమి.

ఫిబ్రవరి 4 సోమవారం మౌని అమావాస్య.

ఫిబ్రవరి 9 శనివారం  శ్రీపంచమి.

ఫిబ్రవరి 19మంగళవారం వ్యాసపూర్ణిమ,మాఘపూర్ణిమ.

మార్చి 4 సోమవారం మహాశివరాత్రి.
ఓం నమః శివాయ..!!

Kanuma festival speciality

*కనుమ పండుగ* శుభాకాంక్షలు

కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇది. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.


ఈ రోజున ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషధాలు, వన మూలికలే గదా.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.

సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ ఊరి పశువు లన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి.. చెదర గొట్టతాడు. అవి బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ  పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని" పొలి" అంటారు. ఆ "పొలి"ని తోటోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో,చెరువుల్లో, బావుల్లో "పొలో.... పొలి" అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడా మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

సంపదలకు ... సంతోషాలకు కారణమైన పశువులను కృతజ్ఞతా పూర్వకంగా పూజించడమే కనుమ పండుగలోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో బసవన్నలు రైతులకు ఎంతగానో తమ సహకారాన్ని అందిస్తుంటాయి. అలాగే పాడి ద్వారా రైతన్నలను గోమాతలు ఆర్ధికంగా ఆదుకుంటూ వుంటాయి.

తమ యజమానిపట్ల ప్రేమతో తప్ప వాటి కష్టంలో ఎలాంటి స్వార్థం కనిపించదు. యజమాని ప్రేమతో నిమిరితే పొంగిపోవడం మాత్రమే వాటికి తెలుసు. ఆ కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నయినా సంతోషంగా భరించడమే వాటికి తెలుసు. ధర్మస్వరూపమైన బసవన్నలు ... భూదేవి స్వరూపంగా చెప్పబడుతోన్న గోమాతలు ఇలా రైతన్నల అభివృద్ధికి తమవంతు కృషిచేస్తుంటాయి. అందువలన ఈ రోజున పశువులశాలను శుభ్రపరచి ... గోమాతలను ... బసవన్నలను ప్రేమతో ముస్తాబు చేస్తారు.

ఈ రోజున వాటిని ఎలాంటి పనికి ఉపయోగించకుండా పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. కొత్త ధాన్యంతో పొంగలిని తయారుచేసి వాటికి తినిపిస్తారు. మరికొంత పొంగలిని తమ పొలాల్లో చల్లుతారు. సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేసినవారు భగవంతుడి ప్రీతికి పాత్రులవుతారు. దాంతో ఆయన వాళ్లని కనిపెట్టుకుని వుంటాడు. అందువలన కనుమ రోజున పశువులను పూజించడం వలన పాడిపంటలు మరింత వృద్ధి చెందుతాయని చెప్పబడుతోంది.
 

Sankranthi Rituals - Significance

సంక్రాంతి సంప్రదాయాలు.

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి.

ముగ్గులు.....
ఓర్పును నేర్పే కళ…
ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.

భోగిమంటలు.

వ్యామోహానికి నిప్పు
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.

గంగిరెద్దులు, హరిదాసులు....
భిక్షానికీ ఓ ధర్మం..
ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.

గుమ్మడికాయ....

తీగల్లా అల్లుకుపోవాలి..
ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.

గొబ్బెమ్మలు....

అసహ్యం నుంచి అద్భుతం
కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు .

భోగిపండ్లు
యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.
బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.

గాలిపటం.

దారంలాంటిది జీవితం
ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

కోడిపందేలు.

యుద్ధనీతిని గెలిపించే పందెం
పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు  మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.

పశు పూజలు
శ్రమకు కృతజ్ఞత

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.

*తిల తర్పణం*

సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.

*సంకురుమయ / సంక్రాంతి పురుషుడు*

మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లొ పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.

హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి.
 
పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణం లో రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.
ఆది శంకరాచార్యులు ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నారు

Sankranthi - some interesting facts

సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో పాటిస్తారు. మరొకవైపు బెంగాలీ కాలెండరు మరియు అస్సామీ కాలెండరులలో ప్రతి నెల చివరి రోజున సంక్రాంతిగా పరిగణిస్తారు. 

*ఉత్తరాయణం, దక్షిణాయనం*

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.

 "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా నిర్వచించారు - *తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః* - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం కలిపి మనకు ఒక సంవత్సరం కాలము.

*మకర సంక్రాంతి* -సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. ఇది ఆరు నెలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం. సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
మహా వైషువ సంక్రాంతి -ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం. మొదటిది శీతాకాలం, వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువులో వచ్చేది)
మరియు వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువులో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు కచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి. అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరం గానూ మరియు బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ నిర్వహిస్తారు. భారతదేశం లోని అనేక ప్రాంతాలలో ఈ రోజును వైశాఖిగా వ్యవహరిస్తారు.

*విష్ణు పది సంక్రాంతి* -సింహ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృషభ సంక్రాంతి మరియు వృశ్చిక సంక్రాంతి.
*ధను సంక్రాంతి*- చంద్రమాన కాలెండరులో పుష్యమాస మొదటి రోజు దక్షిణాన భూటాన్ మరియు నేపాల్ లలో దీనిని వైల్డ్ దుంపలు (తరుల్) తినే పండగగా జరుపుతారు.
*కర్కాటక సంక్రాంతి* :  సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించే దినాన్ని కర్కాటక సంక్రాతిగా వ్యవహరిస్తారు. ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ కాలెండరులో వ్యవహరిస్తారు. ఈ రోజు దక్షిణాయణ పుణ్యకాలానికి మొదటి రోజు.

Guru paaduka sthotram

*శ్రీ గురు పాదుకా స్తొత్రము

*అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |*
*వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 1 ||*


*కవిత్వవారాశి*
*నిశాకరాభ్యాం* *దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |*
*దూరికృతానమ్ర  విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 2 ||*


*నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |*
*మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||*


 *నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |*
*నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4 ||*


*నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |*
*నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 5 ||*


*పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యామ్ |*
*జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 6 ||*

*శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్ |*
*రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 7 ||*


*స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ |*
*స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురు పాదుకాభ్యామ్ || 8 ||*


*కామాదిసర్పవ్రజ గారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ |*
*బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 9 ||*
 
గురు అనుగ్రహం ఎలాంటిదో, ఆ అనుగ్రహానికి పాత్రులు కావడం ఎంతో ముఖ్యము. *గురు పాదుకా స్తోత్రం* ఎంతో శక్తివంతమైన మంత్రోచ్చారణ, ఇది గురుపాదుకల్ని అనంతమైన సంసారాన్ని దాటించే నావగా కొనియాడు తుంది. ఈ  మంత్రోచ్చారణ వల్ల మనం గురు అనుగ్రహానికి పాత్రులం కాగలుగుతాము
అనుగ్రహం మీ పైన లేకపోయినా లేక మీరు అనుగ్రహానికి పాత్రులు కాలేకపోయినా, మీ దగ్గర ఎంత డబ్బు, ధనం, ఇంకా వేరే ఎన్ని ఉన్నాసరే, మీరు ఓ అందమైన జీవితాన్ని జీవించలేరు. గురు అనుగ్రహం అనేది మీరు ఉహించుకునే అభూత కల్పన కాదు. గురు సాన్నిద్ధ్యం ఎంతో భౌతికమైంది.


 మీరు ఈ వీస్తున్న గాలిని ఎలా అనుభవించగలరో, ఈ సూర్య కిరణాలను ఎలా అనుభవించ గలరో, ఇది కూడా అంత భౌతికమైన అనుభవమే. గురువు అనేది ఓ నిర్దిష్టమైన శక్తి, నిర్దిష్టమైన అవకాశం. 


ఇది ఓ వ్యక్తి మాత్రమే కాదు – ఓ వ్యక్తి అలాంటి శక్తికి, స్థానానికి ఓ దూతగా మారడం. మీరు ఏదైనా చూడాలనుకోండి, మీకు కావలసింది వెలుగు అంతే గాని బల్బ్ కాదు కదా. కాని ఇప్పుడు బల్బ్ ద్వారానే ఈ వెలుగు వస్తోంది. నెనీ బల్బ్ లేకుండా ఉండలేనని మీరు ఆలోచించడం మొదలుపెడుతున్నారు. ఓ స్థాయిలో ఇది కూడా నిజమే . కాని గురు తత్త్వమనేది కాలానికి, స్థానానికి పరిమితమైంది కాదు. ఇప్పుడు నేను ఈ లైట్ బల్బ్ పక్కన కూర్చుంటే నాకు చాలా ఎక్కువ కాంతి వస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉండచ్చు . 


కాని ఒక గురువుకి పక్కన కూర్చున్న వ్యక్తి కంటే ఎన్నో వేల మైళ్ళు దూరంలో ఉన్నపటికీ మీరు ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.విజయం అనేది అనుగ్రహం లేకుండా రాదు. ఎలాగోలా మీరు ఈ  అనుగ్రహానికి పాత్రులవ్వడం నేర్చుకోవాలి. మీరు మీ మానసిక స్థితిని ఒక నిర్దిష్టమైన విధానంలో నిల్పుకుంటే మీరు దీనికి పాత్రులు కావచ్చు. 


మీ శరీరాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో తయ్యారుచేసుకుంటే కూడా, దీనికి పాత్రులు కావచ్చు. అలాగే మీరు మీ భావాల్ని ఒక నిర్దిష్టమైన విధానంలో మలచుకుంటే కూడా మీరు దీనికి పాత్రులు కావచ్చు. లేకపోతే మీరెంతో సంక్లిష్టమైన పద్ధతుల ద్వారా, ఈ శాస్త్రం పని చేసే తీరును తెలుసుకొని మీరు దీనికి పాత్రులు కావచ్చు.


 కాని అనుగ్రహం అన్నది లేకపోతే మాత్రం విజయం అనేది ఉండదు. మీరెంతో తెలివి గల వారై ఉండచ్చు కాని మీరో ఓటమిగానే మిగిలిపోతారు. మీరెంతో సామర్ధ్యం కలిగినవారై ఉండచ్చు, కాని మీరో ఓటమిగానే ఉంటారు. ఒక్క క్షణం, అనుగ్రహం మీకు దొరికినప్పుడు , వెంటనే అంతా మారిపోతుంది, అన్నిట్లోనూ  మీరు విజయవంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా లేదా సంతోషంగా ఉండడం అనేది అది మీరు మీ లోపల నుండి చేస్తున్న పని. మీకు మీ శరీరం మీద, మనస్సు మీద కొంత నియంత్రణ ఉంటే ఈ పనులు మీరు తేలిగ్గా చెయ్యొచ్చు.


కాని మీరు విజయం సాధించాలంటే మాత్రం, ఇది అనుగ్రహం లేకుండా జరగదు. ఎందుకంటే, అనుగ్రహం అనేది యంత్రంలో వేసే చమురు లాంటిది ఇది లేకుండా యంత్రం ఎక్కువ కాలం పని చేయలేదు. ఇది లేకపోతే, ప్రతిదీ కొండ ఎక్కుతున్నంత కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనలో చాలా మంది మనకి మనమే అనుగ్రహానికి పాత్రులు కాకుండా ఉంటున్నాం, మనకు మనమే ఇది చేసుకుంటున్నాం. మనం అనుగ్రహానికి పాత్రులయ్యేలాగా మనల్ని సంసిద్ధం చేసుకోవడంలేదు.


 అలాంటి వారి జీవితంలో ప్రతీది శ్రమే. చదువుకోడం ఒక ప్రయాస, ఉపాధి కోసం పని చేయడం ఒక ప్రయాస, సరే వివాహం అనేది ఎంతో పెద్ద ప్రయాస. కాని మీరొకసారి ఈ అనుగ్రహానికి పాత్రులయ్యారంటే ప్రతీది ఎంతో సునాయాసంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది మీ యంత్రాన్ని చమురుతో నింపేస్తుంది.
 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online